IPPB WhatsApp Banking Services: ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (IPPB), తన ఖాతాదార్లకు శుభవార్త చెప్పింది. తన కస్టమర్లకు వాట్సాప్ బ్యాంకింగ్ సేవను (WhatsApp Banking Service) అందించడానికి ప్రైవేట్ రంగ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌తో IPPB జత కట్టింది. 


మొబైల్ ఫోన్లలో బ్యాంకింగ్ సేవలు
IPPB కస్టమర్‌లు ఇప్పుడు వాట్సాప్ మెసేజింగ్‌ సర్వీస్ ద్వారా మరింత సౌకర్యవంతంగా బ్యాంకింగ్ సేవలను పొందగలుగుతారు. అంటే, వాట్సాప్‌ పని చేసే సెల్‌ఫోన్‌ కస్టమర్ల చేతిలో ఉంటే చాలు. ఎయిర్‌టెల్ IQ ద్వారా వాట్సాప్ మెసేజింగ్ సేవలు వినియోగదార్లకు అందుతాయి. ఇది IQ సర్వీస్‌గా పని చేస్తుంది, అంటే క్లౌడ్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌గా ఉంటుంది. తమ కస్టమర్‌లకు వాయిస్, సంక్షిప్త సందేశాలు (SMS), వాట్సాప్‌ ఛాటింగ్‌ ద్వారా సేవలు అందించేలా ఇది పని చేస్తుంది.


IPPB ఏమి చెప్పింది?
"భారత్‌లో డిజిటల్ & ఫైనాన్షియల్ చేర్పులను ప్రోత్సహించడానికి భారతి ఎయిర్‌టెల్‌తో భాగస్వామ్యం కావడానికి మేము సంతోషిస్తున్నాం. డిజిటల్ ఇండియా మిషన్‌లో భాగస్వామిగా దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలను అందించడానికి IPPB చాలా కాలంగా అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. వాట్సాప్‌లో వినియోగదారులకు బ్యాంకింగ్ పరిష్కారాలను అందించడానికి ఎయిర్‌టెల్‌తో భాగస్వామ్యం కావడం మాకు ఆనందంగా ఉంది" అని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) CGM & CSMO గురుశరణ్ రాయ్ బన్సాల్ చెప్పారు.


ఎయిర్‌టెల్ ఏం చెప్పింది?
“సాంకేతికతతో నడిచే ఆర్థిక రంగంలో అపారమైన వృద్ధి అవకాశం ఉందని, దేశంలోని మారుమూల ప్రాంతాలకు అత్యుత్తమ ఆర్థిక ఉత్పత్తులను తీసుకెళ్లగలమని మేము విశ్వసిస్తున్నాం. Airtel IQ ద్వారా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లకు బలమైన, సులభమైన, సురక్షిత క్లౌడ్ కమ్యూనికేషన్ పరిష్కారాన్ని అందిస్తాం. విశేషం ఏమిటంటే, వాట్సాప్ కోసం బిజినెస్ సర్వీస్ ప్రొవైడర్‌గా (BSP) వ్యవహరించే ప్రపంచంలోనే మొట్టమొదటి టెల్కో ఎయిర్‌టెల్. ఈ కొత్త ఒప్పందం ప్రకారం, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌ కస్టమర్లకు ఎయిర్‌టెల్ ఐక్యూ ద్వారా వాట్సాప్ మెసేజింగ్ సేవలను అందిస్తుంది" అని ఎయిర్‌టెల్ IQ బిజినెస్ హెడ్ అభిషేక్ బిస్వాల్ చెప్పారు.


కొత్త సేవ ప్రయోజనం ఏంటి?
ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌ కస్టమర్‌లు బ్రాంచ్‌ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఇంటి వద్దే కూర్చుని సేవలను పొందుతారు. దీంతో పాటు, సమీపంలో ఉన్న పోస్టాఫీసును గుర్తించడం వంటి సేవలను కూడా దీని ద్వారా పొందగలరు. పోస్ట్ పేమెంట్‌ బ్యాంక్ ఖాతాదార్లు కాళ్ల కదలికల (నడక) ద్వారా కాకుండా కేవలం చేతివేళ్ల కదలికల (వాట్సాప్‌ మెసేజింగ్‌) ద్వారా నేరుగా బ్యాంక్‌తో కనెక్ట్ అయ్యే సౌలభ్యాన్ని వాట్సాప్ మెసేజింగ్ సర్వీస్‌ పెంచుతుంది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వ డిజిటల్‌ ఇండియా మిషన్‌ను కూడా ముందుకు తీసుకెళ్లనున్నారు.


ఎయిర్‌టెల్‌తో కలిసి నెలకు 250 మిలియన్ల మెసేజ్‌లను తన ఖాతాదార్లకు IPPB డెలివరీ చేస్తుంది. వీరిలో చాలా మంది గ్రామీణ పట్టణాలు, టైర్ 2, టైర్‌ 3 నగరాల్లో నివసిస్తున్నారు. వీళ్లందరూ బ్రాంచ్‌ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, కొన్ని రకాల సేవలను తమ మొబైల్‌ ఫోన్‌ నుంచే పొందవచ్చు.