Patanjali Foods FPO: కేవలం ఏడాది వ్యవధిలోనే రెండో FPOకు (Follow-On Public Offering) పతంజలి ఫుడ్స్‌ లిమిటెడ్‌ (PFL) సిద్ధమైంది. ఈ విషయాన్ని స్వయంగా బాబా రామ్‌దేవ్ ప్రకటించారు. యోగా గురు బాబా రామ్‌దేవ్‌కి చెందిన పతంజలి గ్రూప్‌నకు చెందిన FMCG కంపెనీ ఇది. 


పతంజలి ఫుడ్స్ ప్రమోటర్ షేర్లను స్తంభింపజేస్తూ స్టాక్ ఎక్స్ఛేంజీలు నిర్ణయం తీసుకోవడంతో, ఆ ఇబ్బంది నుంచి బయటపడడానికి కంపెనీ FPO నిర్ణయం తీసుకుంది. రెండో FPO ద్వారా కనీస పబ్లిక్ షేర్‌హోల్డింగ్‌ను (MPS) 25 శాతానికి చేర్చాలని చూస్తోంది.


ప్రజల వద్ద కనీసం 25% వాటా నిబంధన
రెగ్యులేటరీ నిబంధనల ప్రకారం, ఒక పబ్లిక్‌ హోల్డింగ్‌ కంపెనీలో ప్రమోటర్ల వాటా 75%కు మించకూడదు, కనీసం 25% వాటా ప్రజల వద్ద ఉండాలి. కానీ ఇప్పటికీ అది 19.18% వద్దే ఉంది. నిబంధనల ప్రకారం, పబ్లిక్‌ వాటా కనీసం 25% కు చేరాలంటే, మరో 5.82% వాటా జనాల్లోకి వెళ్లాలి. 25% పబ్లిక్‌ హోల్డింగ్‌ గడువు 2022 డిసెంబరు 18 తోనే ముగిసింది. 25% పబ్లిక్‌ షేర్‌ హోల్డింగ్‌ నిబంధనను గడువులోగా ఈ కంపెనీ పాటించకపోవడం వల్లే, ప్రమోటర్ల వద్ద ఉన్న ఈ కంపెనీ వాటాలను రెండు స్టాక్‌ ఎక్సేంజీలు స్తంభింపజేశాయి. దీంతో.. పతంజలి ఆయుర్వేద, మేనేజింగ్ డైరెక్టర్‌ ఆచార్య బాలకృష్ణ వద్ద ఉన్న షేర్లు సహా 21 ప్రమోటర్ సంస్థల షేర్లను ఫ్రీజ్‌ అయ్యాయి, మొత్తంగా 29,25,76,299 షేర్లు ఆగిపోయాయని సమాచారం. 


ఏప్రిల్‌లో రెండో FPO 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత, వచ్చే నెలలో (ఏప్రిల్‌) FPO ప్రక్రియను పతంజలి ఫుడ్స్‌ ప్రారంభిస్తుందని PTIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబా రామ్‌దేవ్‌ ప్రకటించారు. ఆ FPO ద్వారా కంపెనీలో 6 శాతం వాటాను విక్రయించనున్నట్లు తెలిపారు. మార్కెట్ సెంటిమెంట్ బాగా లేకపోవడం వల్లే మలి విడత FPO ఆలస్యమైందని అన్నారు. 


ప్రమోటర్ల ఈక్విటీ షేర్లు ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు లాక్‌-ఇన్‌లో (షేర్ల లిస్టింగ్‌ తర్వాత ఏడాది లాక్‌-ఇన్‌ గడువు) ఉంటాయని బాబా రామ్‌దేవ్‌ చెప్పారు. కాబట్టి, ఎక్సేంజీలు తీసుకున్న నిర్ణయం వల్ల పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ కార్యకలాపాలు, ఆర్థిక పనితీరు, వృద్ధిపై ఎటువంటి ప్రభావం ఉండదని పెట్టుబడిదార్లు, వాటాదార్లకు భరోసా ఇచ్చారు. పతంజలి ఫుడ్స్ కార్యకలాపాలను పతంజలి గ్రూప్ చాలా బాగా నడుపుతోందని బాబా రామ్‌దేవ్ చెప్పారు. వ్యాపార విస్తరణ, లాభదాయకత, పనితీరును పెంచడానికి పూర్తి జాగ్రత్తలు తీసుకుంటోందని వెల్లడించారు. పెట్టుబడిదార్లు ఆందోళన చెందొద్దని సూచించారు. 


గత సంవత్సరం మార్చి 2022లో, పతంజలి ఫుడ్స్ తన FPOని తీసుకువచ్చింది.


ఇవాళ (శుక్రవారం, 17 మార్చి 2023) ఉదయం 10.15 గంటల సమయానికి, పతంజలి ఫుడ్స్‌ షేర్‌ 2.80% నష్టంతో రూ. 919 వద్ద ఉంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.