Pakistan Inflation: మన పొరుగు దేశం పాకిస్థాన్‌లో దరిద్రం తాండవిస్తోంది. ఆ దేశంలో ద్రవ్యోల్బణం ఎప్పటికప్పుడు కొత్త రికార్డ్‌లు క్రియేట్‌ చేస్తోంది. ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగి, సామాన్య జనం ఆకలితో అల్లాడుతున్నారు. 
పాక్‌లో చక్కెర రేటు కూడా ఏ నెలకానెల కొత్త ఎత్తులకు చేరుతోంది. పాకిస్థాన్ రూపాయి ప్రకారం, కిలో పంచదార ధర రూ. 130 నుంచి ఏకంగా రూ. 200కి పెరిగింది. కొన్నాళ్ల క్రితం రూ. 800 పలికిన 20 కిలోల గోధుమ పిండి ప్యాకెట్‌ ఇప్పుడు రూ. 4000కి చేరింది. అంటే, కిలో గోధమ పిండి కూడా రూ. 200కు చేరింది. పాకిస్థాన్‌ ధనికులు కూడా ఈ రేట్లను చూసి కళ్లు తేలేస్తున్నారు.


పెరిగిన పిండి కొరత, ధర
రంజాన్ సమయం ముందు నుంచే పాకిస్థాన్ గోధుమ పిండి కొరతను ఎదుర్కొంటోంది. ఇప్పటికీ ఆ సమస్య కొనసాగుతోంది. ARY న్యూస్ రిపోర్ట్‌ ప్రకారం, అన్ని మిల్లులను మూసివేస్తున్నట్లు అక్కడి మిల్స్ అసోసియేషన్ ప్రకటించింది. పిండి మిల్లులపై పాక్‌ ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో, మిల్స్ అసోసియేషన్ సమ్మెకు దిగింది. దీంతో పిండి కొరత పెరిగి, ధరలు కూడా పెరిగాయి. ఐదు లక్షల బస్తాల గోధుమలను మిల్లులకు పంపుతామని ఆ దేశ ఆహార మంత్రి వాగ్దానం చేయడంతో, మిల్లు యాజమాన్యాలు సమ్మె విరమించాయి.


రోజ్‌నామా ఇంతేఖబ్ రిపోర్ట్‌ ప్రకారం, దాల్బాందిన్‌లో, కిలో చక్కెర ధర అత్యధికంగా కిలో రూ. 200 పలుకుతోంది. సహ్బత్‌పూర్‌లో 20 కిలోల పిండి ధర రూ. 4000కు చేరింది. ఇవే కాదు, సామాన్య జనానికి ప్రతిరోజూ అవసరమయ్యే చాలా ఆహార పదార్థాలు రేట్లు భారీగా పెరిగాయి.


షాక్‌ ఇచ్చిన పాకిస్థాన్ GDP గణాంకాలు
పాకిస్థాన్ జీడీపీ లెక్కలు షాకింగ్‌గా ఉన్నాయని దునియా డైలీ పేర్కొంది. దేశ GDP వృద్ధిని 5 శాతంగా అంచనా వేస్తే, వాస్తవంగా వచ్చిన వృద్ధి 0.29 శాతం. పారిశ్రామిక రంగం వృద్ధి లక్ష్యం 7.4 శాతం కాగా, వాస్తవ వృద్ధి 2.94 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, ద్రవ్యోల్బణం రేటును 11.5 శాతానికి దించాలని పాకిస్థాన్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం అది 55 సంవత్సరాల గరిష్ట స్థాయికి 36.4 శాతం వద్ద ఉంది.


IMF సాయం కోసం ఇప్పటికీ ఎదురుచూపు
ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌తో, అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) బోర్డు సమావేశం నిర్వహించనుంది. జూన్ చివరిలోగా ఈ సమావేశాన్ని నిర్వహించాలని భావిస్తున్నారు. IMF నుంచి పాకిస్థాన్ ఆశిస్తున్న 6.5 బిలియన్‌ డాలర్లలో, ఇప్పుడు 1.1 బిలియన్‌ డాలర్లు విడుదల చేయాలన్న ఒప్పందం కోసం ఈ సమావేశం జరుగుతుంది. వాస్తవానికి, గత ఏడాది నవంబర్‌ నెలలోనే ఈ సిబ్బంది స్థాయి ఒప్పందం జరగాల్సి ఉంది, అప్పటి నుంచి వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. 2008 సంవత్సరం తర్వాత, ఇలాంటి ఒప్పందంలో ఇంత జాప్యం ఎప్పుడూ జరగలేదు.


బడ్జెట్ వివరాలను పాకిస్థాన్ పంచుకుంటుంది
2024 ఆర్థిక సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని పాకిస్థాన్‌తో సమావేశం నిర్వహిస్తున్నట్లు IMF మిషన్ చీఫ్ నాథన్ పోర్ట్ తెలిపారు. ఈ సాయం అందింతే విదేశీ మారకపు మార్కెట్ పనితీరు సాఫీగా సాగుతుంది, ఆర్థిక వ్యవస్థ కొద్దిగా కుదుటపడుతుంది. రాయిటర్స్ రిపోర్ట్‌ ప్రకారం, పాకిస్థాన్‌ తన బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ముందే, ఆ వివరాలను IMFకు అందజేస్తుంది. వచ్చే నెలలో పాకిస్థాన్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.


మరో ఇంట్రెస్టింగ్‌ స్టోరీ: మీ డబ్బుల్ని వేగంగా డబుల్‌ చేసే మంచి పోస్టాఫీసు స్కీమ్‌