FM Nirmala Sitharaman Birthday: కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలు కుదేలైన సమయంలో ఆమె చాకచక్యంగా నిర్ణయాలు తీసుకున్నారు. సరఫరా అంతరాయాలతో ప్రపంచ దేశాల జీడీపీ పడిపోతున్నా ఆమె వెరవలేదు. ఐదు లక్షల కోట్ల ఎకానమీ లక్ష్య సాధన కోసం అలుపెరగకుండా పనిచేస్తున్నారు. తొణకని ఆత్మవిశ్వాసం, సవాళ్లకు బెణకని మనస్తత్వం ఆమె సొంతం. భారత తొలి పూర్తిస్థాయి ఆర్థిక ఆర్థిక మంత్రిగా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎకానమీకి ఆమె దిశానిర్దేశం చేస్తున్న తీరు అద్భుతం!! ఆగస్టు 18న ఆమె 63వ వసంతంలోకి అడుగుపెట్టారు.


తొలి పూర్తి స్థాయి మహిళా ఆర్థిక మంత్రి


2022, ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నారు. కరోనా వచ్చాక ఆమె ప్రవేశ పెడుతున్న మూడో పద్దు ఇది. నిజానికి భారత్‌లో తొలి పూర్తిస్థాయి ఆర్థిక మంత్రిగా ఆమె ఇప్పటికే చరిత్ర సృష్టించింది. గతంలో ఒకసారి మాజీ ప్రధాని ఇందిరా గాంధీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆర్థిక శాఖ బాధ్యతలు కొంతకాలం చూసుకున్నారే తప్ప చేపట్టలేదు. అంతకు ముందు నిర్మలా సీతారామన్‌ కార్పొరేట్‌ వ్యవహారాలు, వాణిజ్య మంత్రిగానూ సేవలందించారు.


మోదీ నమ్మకస్థుల్లో ఒకరు


నిర్మలా సీతారామన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఊరికే బాధ్యతలు అప్పగించలేదు. ఆ అధికారాన్ని ఆమె స్వయంగా కష్టపడి సంపాదించుకున్నారు. మోదీ నమ్మకస్థుల్లో ఒకరిగా మారిపోయారు. గతంలో ఆమె వాణిజ్య, పరిశ్రమల శాఖకు మంత్రిగా చేశారు. 2017, సెప్టెంబర్లో పూర్తిస్థాయి మహిళా రక్షణ మంత్రిగా రికార్డు సృష్టించారు. నాలుగు పెద్ద మంత్రిత్వ శాఖల్లో ఒకటిని సొంతం చేసుకున్నారు. సీనియర్‌ నేత అరుణ్‌జైట్లీ ఆకస్మిక మరణంతో ఆర్థిక మంత్రిగా మోదీ ఆమెను ఎంచుకున్నారు.


తమిళ బిడ్డ.. తెలుగు కోడలు


మదురైలో 1959, ఆగస్టు 18న నిర్మలా సీతారామన్‌ జన్మించారు. ఆమె తండ్రి నారాయన్‌ సీతారామన్‌ భారతీయ రైల్వేలో ఉద్యోగి. తల్లి సావిత్రీ సీతారామన్‌ గృహిణి. మద్రాస్‌, తిరుచురాపల్లిలో పాఠశాల విద్యను పూర్తి చేసుకున్న నిర్మల.. తిరుచ్చిలోని సీతాలక్ష్మీ రామస్వామి కళాశాలలో ఎకనామిక్స్‌లో బీఏ చదివారు. 1984లో దిల్లీ జేఎన్‌యూలో మాస్టర్స్‌ పూర్తి చేశారు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ చేశారు. పీజీ అయ్యాక ఆమె పరకాల ప్రభాకర్‌ను వివాహం చేసుకున్నారు. 1986లో బీబీసీలో పనిచేశారు. 1990లో దేశానికి తిరిగొచ్చి విద్యావేత్తగా మారారు.


రాఫెల్‌ డీల్‌లో మోదీకి అండగా


తొలుత నిర్మలా సీతారామన్‌ను జాతీయ మహిళా కమిషన్‌కు నామినేట్‌ చేసింది ఎన్‌డీయే ప్రభుత్వం. ఆ తర్వాత అటల్‌ బిహారీ వాజ్‌పేయ్‌ ఆధ్వర్యంలో 2008లో బీజేపీలో చేరారు. అధికార ప్రతినిధిగా ఎదిగారు. 2014లో రాజ్యసభకు ఎంపికయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె పోటీ చేయలేదు. పారికర్‌ తర్వాత రక్షణ రంగ బాధ్యతలు చేపట్టిన నిర్మలా రాఫెల్‌ ఒప్పందంలోని అవినీతి ఆరోపణలను బలంగా తిప్పికొట్టారు. ఒకానొక సమయంలో పీఎం మోదీ మహిళను అడ్డుపెట్టుకుంటున్నారు అన్న రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలను ఆమె చీల్చి చెండాడింది. ఎదురుదాడితో ప్రతిపక్షాలను గుక్కతిప్పుకోనివ్వలేదు. ఆ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన తర్వాత సీతారామన్‌ కీలకంగా ఎదిగారు.


ప్రధాని మోదీ కల కోసం..


కరోనా రాకతో నిర్మలా సీతారామన్‌కు సవాళ్లు ఎదురయ్యాయి. లాక్‌డౌన్లతో ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు మందగించింది. తిరిగి దానిని పట్టాలెక్కించేందుకు ఆమె ఎన్నో ప్రయత్నాలు చేశారు. రూ.20 లక్షల కోట్లతో ఉద్దీపన పథకాలు ప్రకటించారు. రూ.2 కోట్లకు పైగా సంపాదనా పరులపై సర్‌ఛార్జ్‌ను విధించడం ద్వారా ఆమె రూ.5 లక్షల లోపు ఆదాయ వర్గాలపై మరింత పన్నుభారం పడకుండా చేశారు. దేశీయ కంపెనీలు, కొత్త మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీలకు కార్పొరేట్‌ పన్ను రేట్లను రద్దు చేశారు. జీఎస్‌టీ రేట్లను ఎప్పటికప్పుడు హేతుబద్దీకరిస్తున్నారు. 2025 లోపు భారత్‌ను రూ.5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న మోదీ కలను నెరవేర్చేందుకు ఆమె ఎంతో కష్టపడుతున్నారు. మున్ముందు ఆమెకెన్నో సవాళ్లు ఎదురవ్వనున్నాయి.