Stocks to watch: ఇవాళ ఉదయం 7.30 గం. సమయానికి సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) పాజిటివ్‌గా ట్రేడవుతోంది. ఆ సమయంలో 61 పాయింట్లు లేదా 0.35 శాతం గ్రీన్‌తో 17,441.5 వద్ద ట్రేడవుతోంది. మన మార్కెట్‌ సానుకూలంగా ప్రారంభమవుతుందని ఇది సూచిస్తోంది. 


నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


వొడాఫోన్‌ ఐడియా: అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఈ టెలికాం ఆపరేటర్ 5G సేవల ప్రారంభం.. వినియోగ విధానం, కస్టమర్ డిమాండ్, పోటీ పద్ధతులు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. కంపెనీ ప్రమోటర్లు రూ.4,940 కోట్లు పెట్టుబడి పెట్టారని కంపెనీ MD & CEO రవీందర్ టక్కర్ తెలిపారు. నిధుల సేకరణ కోసం ఈ కంపెనీ పెట్టుబడిదారులతో చురుగ్గా చర్చలు జరుపుతోంది.


లుపిన్:  క్యాన్సర్‌ చికిత్సలో ఉపయోగించే Dasatinib మాత్రలను అమెరికాలో 20 ఎంజీ, 50 ఎంజీ, 70 ఎంజీ, 80 ఎంజీ, 100 ఎంజీ, 140 ఎంజీ మోతాదుల్లో విక్రయించడానికి యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి తాత్కాలిక అనుమతి పొందింది. ఇది, బ్రిస్టల్-మైయర్స్ స్క్విబ్ కంపెనీకి చెందిన Sprycel టాబ్లెట్ల జెనరిక్‌ వెర్షన్.


మాక్రోటెక్ డెవలపర్స్‌: నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల (ఎన్‌సీడీలు) జారీ ద్వారా రూ.250 కోట్ల వరకు సమీకరించేందుకు బోర్డు ఆమోదం తెలిపిందని రియల్టీ సంస్థ వెల్లడించింది. ప్రతిపాదిత నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఇష్యూ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఎందుకోసం ఉపయోగిస్తుందో కంపెనీ వెల్లడించలేదు.


థైరోకేర్ టెక్నాలజీస్: ఈ కంపెనీకి చెందిన 3,20,000 షేర్లను బీఎస్‌ఈలో, 2,68,707 షేర్లను ఎన్‌ఎస్‌ఈలో 'ఫండ్‌స్మిత్ ఎమర్జింగ్ ఈక్విటీస్ ట్రస్ట్ పీఎల్‌సీ' విక్రయించింది. ఇది ఈ డయాగ్నోస్టిక్ చైన్‌లో 1.1 శాతం వాటాకు సమానం. సగటున బీఎస్‌ఈలో రూ.615.14 చొప్పున, ఎన్‌ఎస్‌ఈలో రూ.614.79 చొప్పున అమ్మింది. మొత్తం విలువ రూ.36 కోట్లు.


ఎల్‌&టీ టెక్నాలజీ సర్వీసెస్: ఇంజినీరింగ్ సేవలను అందించే ఈ కంపెనీ సంస్థ.. బీఎండబ్ల్యూ గ్రూప్ నుంచి యూరోపియన్ ప్రీమియర్ కార్ల తయారీ కోసం మల్టీ మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని సొంతం చేసుకుంది. 5 సంవత్సరాల ఒప్పందంలో భాగంగా, హైబ్రిడ్ వాహనాలకు ఇది హై ఎండ్ ఇంజినీరింగ్ సేవలను అందిస్తుంది.


కృష్ణా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్: నాగ్‌పుర్‌లోని ఎస్‌పీఏఎన్‌వీ మెడిసెర్చ్ లైఫ్‌సైన్సెస్‌లో మెజారిటీ వాటాను (51 శాతం) కొనుగోలు చేసేందుకు ఈ హాస్పిటల్ చైన్ ఒప్పందం కుదుర్చుకుంది. కింగ్స్‌వే హాస్పిటల్స్ పేరిట ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ఎస్‌పీఏఎన్‌వీ నడుపుతోంది. ఇందులో 300+ పడకలు ఉన్నాయి. ప్రస్తుతమున్న ప్రమోటర్లు, వాటాదారులు 49 శాతం వాటాను కలిగి ఉంటారు.


న్యూఢిల్లీ టెలివిజన్ (ఎన్‌డీటీవీ): వారెంట్లను షేర్లుగా మార్చడానికి సంబంధించి రెగ్యులేటర్ గతంలో ఇచ్చిన ఆర్డర్ వర్తింపు మీద స్పష్టత కోరుతూ.. అదానీ గ్రూప్, ఎన్‌డీటీవీ ప్రమోటర్ సంస్థ ఆర్‌ఆర్‌పీఆర్‌ హోల్డింగ్ సెబీని ఆశ్రయించాయి.


బీఎల్‌ఎస్‌ ఇంటర్నేషనల్ సర్వీసెస్: గ్లోబల్‌గా ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించే నోమురా సింగపూర్, ఈ వీసా సర్వీస్ ప్రొవైడర్‌లో 11 లక్షల ఈక్విటీ షేర్లను ఓపెన్ మార్కెట్ ద్వారా ఒక్కో షేరుకు సగటున రూ.230 చొప్పున మొత్తం రూ.253 కోట్లకు కొనుగోలు చేసింది.


ఇక్రా: గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, కీలక మేనేజిరియ్‌ పర్సన్‌గా వెంకటేష్ విశ్వనాథన్ నియామకానికి కంపెనీ బోర్డు ఆమోదం పొందింది. ఆయన నియామకం ఇవాళ్టి నుంచి (ఆగస్టు 30, 2022) అమల్లోకి వస్తుంది. కంపెనీ ఆయన్ను చీఫ్ ఇన్వెస్టర్ రిలేషన్స్ ఆఫీసర్‌గా కూడా నియమించింది.


ఉగ్రో క్యాపిటల్: బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ద్వారా, ఒక్కొక్కటి రూ.10,000 ముఖ విలువ కలిగిన 50,000 నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లను కేటాయించినట్లు ఈ సంస్థ తెలిపింది. వీటి కాలపరిమితి కేటాయింపు తేదీ నుంచి 24 నెలలు. కూపన్ రేటు సంవత్సరానికి 10.35 శాతం.


బీసీ పవర్ కంట్రోల్స్: 1.1 కోట్ల ఈక్విటీ షేర్లను, ఒక్కో షేరు ధర రూ.5.65 చొప్పున  ప్రాధాన్యత ప్రాతిపదికన ప్రమోటర్ గ్రూప్‌నకు జారీ చేయడానికి ఈ కేబుల్స్ కంపెనీ కంపెనీ బోర్డు ఆమోదించింది. దీని ద్వారా రూ.6.21 కోట్లను సమీకరిస్తుంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే!. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.