Adani Group Shares: బిలియనీర్‌ బాబు గౌతమ్‌ అదానీ ఏం చేసినా సంచలనమే. తాజాగా, ఒక షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నారు. అంబుజా సిమెంట్స్‌ (Ambuja Cements), ఏసీసీ (ACC) కంపెనీల్లోని తన షేర్ల మొత్తాన్నీ తాకట్టు కొట్టుకు  పంపారు. అంటే, ఈ చేత్తో కొని - ఆ చేత్తో తాకట్టు పెట్టారన్నమాట.


$13 బిలియన్లకు తాకట్టు
ఇంటర్నేషనల్‌ సిమెంట్‌ జెయింట్‌ హోల్సిమ్ లిమిటెడ్ నుంచి అంబుజా సిమెంట్స్‌, ఏసీసీ కొనుగోలును కొన్ని రోజుల క్రితమే పూర్తి చేశారు. ఈ రెండు భారతీయ సిమెంట్ కంపెనీల్లో కలిపి సుమారు $13 బిలియన్ల విలువైన షేర్లను అదానీ గ్రూప్‌ తాకట్టు పెట్టింది. 


ప్రపంచంలో రెండో అత్యంత సంపన్న వ్యక్తి (గౌతమ్‌ అదానీ) ఎంత ఆకలితో ఉన్నాడో, ఎంత దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటాడో అన్నదానికి ఇదొక చిన్న ఉదాహరణ.


ఈ రెండు కంపెనీల్లో ACCలో 57 శాతం, అంబుజా సిమెంట్స్ లిమిటెడ్‌లో 63 శాతం వాటా అంబానీ గ్రూప్‌ చేతిలో ఉంది. కొన్ని అంతర్జాతీయ బ్యాంకుల దగ్గర ఈ మొత్తం స్టేక్‌ను అంబానీ తాకట్టు పెట్టారు. ఇందుకోసం నాన్‌-డీలింగ్‌ అండర్‌టేకింగ్‌ (NDU) కుదుర్చుకున్నారు.


"కొందరు రుణదాతలు, ఇతర ఫైనాన్స్ పార్టీల ప్రయోజనం కోసం షేర్లను తాకట్టు పెట్టినట్లు" ఇండియన్‌ స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమర్పించిన ప్రత్యేక ఫైలింగ్‌లో డ్యూయిష్ బ్యాంక్ ఏజీకి (Deutsche Bank AG) చెందిన హాంగ్‌కాంగ్ శాఖ వెల్లడించింది.


మంగళవారం ట్రేడ్‌లో, అంబుజా సిమెంట్స్‌ స్టాక్‌ రూ.574 దగ్గర ముగిసింది. ఏసీసీ షేరు ధర రూ.2725 దగ్గర క్లోజయింది. 


అదానీ వాటా రూ.1.01 లక్షల కోట్లు
మంగళవారం నాటికి... అంబుజా మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.13 లక్షల కోట్లు. ఇందులో అదానీ వాటా విలువ రూ.71,988 కోట్లు. ఏసీసీలోని 57 శాతం NDU వాటా విలువ రూ.29,175 కోట్లు. మంగళవారం మార్కెట్‌ విలువల ప్రకారం, ఈ రెండు కంపెనీల్లో కలిపి అదానీ వాటా విలువ రూ.1.01 లక్షల కోట్లు.


అంబుజా, ఏసీసీ కొనుగోలు కోసం స్విస్ సిమెంట్ మేజర్ హోల్సిమ్‌కు అదానీ సంస్థలు $6.4 బిలియన్లు చెల్లించాయి. 14 అంతర్జాతీయ బ్యాంకుల నుంచి $4.5 బిలియన్ల రుణం తీసుకుని, ఈ లావాదేవీకి డబ్బులు సమకూర్చుకున్నాయి. ఆ మొత్తాన్ని తిరిగి తీర్చడం కోసం ఇప్పుడు షేర్లను తాకట్టు పెట్టారు.


బార్ల్కేస్‌ బ్యాంక్, డీబీఎస్‌ బ్యాంక్, డ్యూయిష్ బ్యాంక్, ఎంయూఎఫ్‌జీ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఈ లావాదేవీకి బుక్ రన్నర్స్‌గా వ్యవహరించాయి.


షేర్లలో ఒత్తిడి
షేర్ల తాకట్టు వ్యవహారం బయటకు రావడంతో, అంబుజా సిమెంట్స్‌, ఏసీసీ షేర్లు ఇవాళ్లి (బుధవారం) ట్రేడ్‌లో ఒత్తిడిలో ఉన్నాయి. రెండూ గ్యాప్‌ డౌన్‌లో ఓపెన్‌ అయ్యాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.