Indian Investors: చూడబోతుంటే భారతీయులు లండన్‌ నగరం సొంతం చేసుకొనేలా కనిపిస్తున్నారు!! ఎందుకు? ఎలాగంటారా? బ్రిటన్‌ రాజధాని లండన్‌లో భారతీయులే ఎక్కువగా స్థిరాస్తి కొనుగోళ్లు చేపడుతున్నారని తెలిసింది. ఆంగ్లేయుల కన్నా ఎక్కువగా మనోళ్లే ఇళ్లు, స్థలాలు, ప్రాపర్టీ దక్కించుకుంటున్నారు.


కొన్ని తరాలుగా లండన్‌లో భారతీయులు నివాసం ఉంటున్నారు. అలాగే ఎన్‌ఆర్‌ఐలు, పెట్టుబడిదారులు, విద్యార్థులు, విద్యను అభ్యసించేందుకు వెళ్లే విద్యార్థుల కుటుంబాలు అక్కడే స్థిరపడుతున్నారు. వాళ్లే నగరంలో ఎక్కువ ప్రాపర్టీ కొనుగోలు చేస్తున్నారు. ఆంగ్లేయులు, పాకిస్థానీలు ఆ తర్వాత స్థానంలో ఉన్నారని లండన్‌ కేంద్రంగా పనిచేస్తున్న స్థిరాస్తి అభివృద్ధి సంస్థ బర్రాట్‌ లండన్‌ తెలిపింది. బ్రిటన్‌ లేదా సొంత దేశంలో ఉంటున్న భారతీయ పెట్టుబడిదారులు సింగిల్‌, డబుల్‌, ట్రిపుల్‌ బెడ్‌రూమ్‌ అపార్ట్‌మెంట్లకు 2,90,000-4,50,000 పౌండ్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉంటున్నారని వెల్లడించింది.


'సుదీర్ఘ కాలం స్థిరంగా ఉండే లండన్‌ మార్కెట్లో ప్రాపర్టీ కొనుగోలుకు భారతీయ ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్‌ పెరుగుతోంది. లండన్‌ నగరం ఆవల మాత్రమే బ్రిటన్‌వాసులు కొనుగోళ్లు చేపట్టడం తెలుస్తోంది' అని బర్రాట్‌ లండన్ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ స్టువర్ట్‌ లెస్లీ అంటున్నారు. లండన్‌ నగరంలో తమ అమ్మకాల్లో 30 శాతం పూర్తిగా పెట్టుబడి ఉద్దేశంతోనే జరుగుతున్నాయని స్పష్టం చేశారు. అందులో 30 శాతం మంది విదేశీయులేనని పేర్కొన్నారు.


'ఈ ఏడాది ఇళ్లను కొనుగోలు చేస్తున్న భారతీయుల శాతం పెరిగింది. అందులో 7-8 శాతం మంది విదేశీ మార్కెట్‌కు చెందినవారే. అందుకే మేం డిమాండ్‌ వస్తున్న వైపే స్పందిస్తున్నాం' అని లెస్లీ అన్నారు. 2022లో సంపన్నులైన భారతీయుల్లో 10 శాతం మంది స్థానిక మార్కెట్లో ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నారని నైట్‌ ఫ్రాంక్‌ రిపోర్టు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత బ్రిటన్‌, యూఏఈ, అమెరికాలో కొనుగోలు చేయాలని భావిస్తున్నారు.


భారతీయులు లండన్‌లోనే ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. దశాబ్దాలుగా ఈ నగరం అంతర్జాతీయ విద్యకు కేంద్ర స్థానంగా ఉంది. అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ముఖద్వారంగా ఉంది. ఇండియా ఇన్వెస్టర్లు, కొనుగోలుదారులు ఇక్కడే ఉంటున్నారు. దాదాపుగా ముంబయి నగరం ధరలకే లండన్‌లో ప్రాపర్టీ దొరుకుతోంది. న్యాయ, చట్ట వ్యవస్థలు సైతం అలాగే ఉన్నాయి. లావాదేవీలు సులభంగా పూర్తవుతాయి. సుదీర్ఘ కాలంగా లండన్లో భారతీయులు పెట్టుబడి పెట్టడం కొత్తవారిలో ఆత్మవిశ్వాసం నింపుతోంది.


Indian Economy: జయహో భారత్‌! అనాల్సిన తరుణం వచ్చేసింది! 200 ఏళ్లు బానిసలుగా పరిపాలించిన బ్రిటన్‌ను స్వత్రంత్ర భారతదేశం తొలిసారి వెనక్కి నెట్టేసింది. భూమ్మీద ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఆంగ్లేయులను ఆరో స్థానానికి పరిమితం చేసింది. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్‌ ఓ నివేదిక విడుదల చేసింది.


వరుసగా 3 నెలలు


2021 ఆర్థిక ఏడాదిలో వరుసగా చివరి మూడు నెలలు బ్రిటన్‌ను భారత్‌ అధిగమించింది. ఐదో అతిపెద్ద ఎకానమీగా రికార్డు సృష్టించింది. అమెరికా డాలర్ల ఆధారంగా ఆర్థిక వ్యవస్థలను లెక్కించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ జీడీపీ గణాంకాల పరంగా ప్రస్తుత ఆర్థిక ఏడాది తొలి క్వార్టర్లోనూ భారత్‌ ముందంజలో ఉంది. సవరించిన డాలర్‌ మార్పిడి రేటు ప్రకారం సంబంధిత త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ నామినల్‌ నగదు విధానంలో మార్చి నాటికి 854.7 బిలియన్‌ డాలర్లుగా ఉంది. బ్రిటన్‌ 816 బిలియన్ డాలర్లతో వెనకబడింది.