LIC Investment In Adani Stocks: : ఈ వారం అదానీ గ్రూప్ షేర్లలో అద్భుతమైన ర్యాలీ (వరుసగా 4 రోజుల ర్యాలీ) తర్వాత, అదానీ గ్రూప్ కంపెనీల్లో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (LIC) పెట్టుబడులు తిరిగి లాభాల్లోకి వచ్చాయి. అదానీ స్టాక్స్‌లో LIC పెట్టుబడి విలువ ఇప్పుడు రూ. 39,000 కోట్లకు పెరిగింది, ఈ వారం ప్రారంభంలో అది దాదాపు రూ. 32,000 కోట్లుగా ఉంది.


2023 జనవరి చివరి నాటికి, అదానీ గ్రూప్ కంపెనీల్లో ‍‌(Adani Group stocks) మొత్తం రూ. 30,127 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు ఎల్‌ఐసీ తెలిపింది. 2022లో అదానీ షేర్ల తారస్థాయి ర్యాలీ కారణంగా ఎల్‌ఐసీ మొత్తం పెట్టుబడి విలువ రూ. 82000 కోట్లకు చేరింది. ఆ గరిష్ట స్థాయి తర్వాత సీన్‌ రివర్స్‌ అయింది. హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ నివేదిక వచ్చిన 2023 జనవరి 24వ తేదీ తర్వాత, అదానీ షేర్ల పతనంతో ఎల్‌ఐసీ పెట్టుబడుల మొత్తం విలువ కూడా మండుటెండలో ఐస్‌క్రీమ్‌లా త్వరత్వరగా కరిగిపోవడం మొదలైంది.  జనవరి 27న మార్కెట్‌ ముగిసిన తర్వాత, అదానీ గ్రూప్‌లో ఎల్‌ఐసీ పెట్టుబడి విలువ రూ. 57,142 కోట్లకు తగ్గింది. 


అక్కడి నుంచి నెల రోజుల్లోనే, ఒక అంచనా ప్రకారం, ఫిబ్రవరి 27 నాటికి ఆ విలువ అతి భారీగా తగ్గి దాదాపు రూ. 32,000 కోట్లకు దిగి వచ్చింది. అంటే, ఎక్కడి నుంచి స్టార్టయిందో, దాదాపుగా అక్కడికే తిరిగి వచ్చింది.


అదానీ గ్రూప్‌లో LICకి ఉన్న వాటా వివరాలు: 
అదానీ గ్రూప్‌లో 10 లిస్టెడ్‌ కంపెనీలు ఉండగా, వీటిలో 7 కంపెనీల్లో ఎల్‌ఐసీ పెట్టుబడులు ఉన్నాయి. అవి.. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, ఏసీసీ, అంబుజా సిమెంట్. 


BSE డేటా ప్రకారం, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో ఎల్‌ఐసీకి 4.23 శాతం, అదానీ ట్రాన్స్‌మిషన్‌లో 3.65 శాతం, అదానీ టోటల్ గ్యాస్‌లో 5.96 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీలో 1.28 శాతం, అంబుజా సిమెంట్‌లో 6.33 శాతం, ACCలో 6.41 శాతం, అదానీ పోర్ట్స్‌లో 9.14 శాతం వాటా ఉంది. 


అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ GQG పార్టనర్స్ (GQG Partners), అదానీ గ్రూపులోని నాలుగు కంపెనీల షేర్లను గురువారం రూ. 15,446 కోట్లకు బ్లాక్ డీల్స్‌లో కొనుగోలు చేసింది. దీంతో, ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరిగి ఆ గ్రూప్ షేర్‌ ధరలు విపరీతంగా పరుగులు తీశాయి. అదానీ గ్రూప్ ప్రమోటర్ కంపెనీ ఎస్‌బీ అదానీ ఫ్యామిలీ, బ్లాక్ డీల్‌ ద్వారా మొత్తం 21 కోట్ల షేర్లను విక్రయించింది.


ఈ డీల్ తర్వాత జరిగిన షేర్‌ ధరల ర్యాలీ కారణంగా, అదానీ గ్రూపు కంపెనీల్లో ఎల్‌ఐసీ పెట్టుబడుల విలువ పెరిగింది. ప్రస్తుతం, ఎల్‌ఐసీ పెట్టుబడి విలువ రూ. 39,000 కోట్లకు పెరిగినా, జనవరి 24 నాటి రూ. 44,000 కోట్లతో పోలిస్తే ఇప్పటికీ తక్కువగా ఉంది. 


శుక్రవారం (03 మార్చి 2023) నాటి భారీ ర్యాలీతో, ఒక్క రోజులో అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 68,200 కోట్లకు పైగా జంప్ చేసింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.