Market Capitalisation: 2022 క్యాలెండర్ సంవత్సరంలో, టాటా గ్రూప్‌ (TATA Group) దేశంలోనే అతి పెద్ద బిజినెస్‌ గ్రూప్‌గా అవతరించింది. 2022లో అదానీ గ్రూప్ తన విలువను డబుల్‌ చేసింది. 


భారత్‌లో అతి పెద్ద కుటుంబ వ్యాపారాలు లేదా కంపెనీల సమూహాలు:


2022 క్యాలెండర్ ఇయర్‌లో (CY22), స్టాక్ మార్కెట్లో టాటా గ్రూప్ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ (capitalisation) రూ. 21.2 లక్షల కోట్లుగా ఉంది. టాటా గ్రూప్ మొదటి స్థానంలో ఉన్నప్పటికీ, 2021 డిసెంబర్‌ చివరి నాటికి ఉన్న రూ. 23.4 లక్షల కోట్ల కంటే ఇప్పుడు ఆ గ్రూప్‌ మార్కెట్‌ విలువ 9.4 శాతం తగ్గింది.


రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను కిందికి నెట్టేసిన అదానీ గ్రూప్‌
శరవేగంగా దూసుకొచ్చిన గౌతమ్‌ అదానీ గ్రూప్, రేసులో రెండో స్థానంలో నిలబడింది. 2022 డిసెంబర్‌ చివరి నాటికి అదానీ గ్రూప్‌ మార్కెట్ క్యాప్ రూ. 19.66 లక్షల కోట్లుగా ఉంది. 2021 డిసెంబర్ చివరి నాటికి ఇది రూ. 9.62 లక్షల కోట్లు. అంటే, ఏడాదిలో అదానీ గ్రూప్‌ విలువ రెట్టింపు పైగా పెరిగింది. గుజరాత్ అంబుజా, ACC, న్యూఢిల్లీ టెలివిజన్‌ (NDTV) కొనుగోలుతో, తన మార్కెట్ విలువకు రూ. 1.52 లక్షల కోట్లను అదానీ గ్రూప్ జోడించింది. స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో అదానీ విల్మార్ (Adani Wilmar Ltd) లిస్టింగ్, గ్రూప్‌ మార్కెట్ క్యాప్‌ను మరో రూ. 80,000 కోట్లు పెంచింది. 


2022 డిసెంబర్‌ చివరి నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) మార్కెట్ క్యాపిటలైజేషన్‌ రూ. 17.54 లక్షల కోట్లుగా ఉండగా... 2021 డిసెంబర్‌ చివరి నాటికి ఇది రూ. 16.4 లక్షల కోట్లు. 


టాప్‌-10లోని ఇతర కుటుంబ వ్యాపారాలు లేదా గ్రూప్‌లు
బజాజ్ గ్రూప్ (Bajaj Group) 2022లో దేశంలో నాలుగో అతి పెద్ద గ్రూప్‌గా ఉంది. ఈ గ్రూప్‌లో, స్టాక్ మార్కెట్‌లో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 8.35 లక్షల కోట్లుగా ఉంది, 2021తో పోలిస్తే ఇది 2.6 శాతం తక్కువ. 2021లో మార్కెట్ క్యాప్ రూ. 8.58 లక్షల కోట్లుగా ఉంది. 


రూ. 5.17 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో సునీల్ భారతి మిట్టల్‌కు చెందిన భారతి గ్రూప్ ‍‌(Bharti Group) ఐదో స్థానంలో, రూ. 4.56 లక్షల కోట్ల మార్కెట్ విలువతో ఆదిత్య బిర్లా గ్రూప్ (Aditya Birla Group) ఆరో స్థానంలో నిలిచాయి. 


రూ.3 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో మహీంద్ర గ్రూప్ ‍‌(Mahindra Group) ఏడో స్థానంలో నిలిచింది. ఏషియన్ పెయింట్స్ ‍‌(Asian Paints Group) రూ. 2.97 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో ఎనిమిదో స్థానంలో ఉండగా, శివ్‌నాడార్‌కు చెందిన హెచ్‌సీఎల్‌ టెక్ (HCL Tech) రూ. 2.82 లక్షల కోట్లతో తొమ్మిదో స్థానంలో, రాధ కిషన్ దమానీకి చెందిన అవెన్యూ సూపర్‌మార్ట్స్ (Avenue Supermarts) రూ. 2.64 లక్షల కోట్లతో పదో స్థానంలో ఉన్నాయి.


టాప్‌-10లో ఉన్న కుటుంబ వ్యాపారాల నుంచి అదానీ గ్రూప్‌ను మినహాయించి లెక్కేస్తే, మిగిలిన గ్రూప్‌ల మొత్తం మార్కెట్‌ విలువCY22లో 3.5 శాతం తగ్గింది. ఇవే కంపెనీలు కలిసి CY21లో 46.4 శాతం లాభపడ్డాయి. మార్కెట్‌లో ఒడిదొడుకుల కారణంగా, టాప్‌-10లో ఉన్న 7 కంపెనీల మార్కెట్‌ విలువ 2022లో క్షీణించింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.