LPG Cylinder Price Reduced From 01 June 2024: లోక్‌సభ ఎన్నికల ఫలితాల ముందు LPG వినియోగదార్లకు ఊరట లభించింది. ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCs) ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను తగ్గించాయి. లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections 2024) ప్రక్రియ ప్రారంభమైన తర్వాత వంట గ్యాస్‌ సిలిండర్ల ధర వరుసగా మూడోసారి తగ్గింది.


ప్రభుత్వ చమురు కంపెనీలు జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఈ రోజు (01 జూన్‌ 2024) నుంచి దేశంలోని వివిధ నగరాల్లో ఎల్‌పీజీ సిలిండర్ల ధర సుమారు రూ. 70 తగ్గింది. 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్లను వినియోగించేవాళ్లకు ఈ ప్రయోజనం దక్కుతుంది.


ఈ రోజు నుంచి మీ నగరంలో కొత్త ధరలు
తాజా కోత తర్వాత... దిల్లీలో 19 కిలోల సిలిండర్ ధర రూ. 69.50 తగ్గి రూ. 1676కు  (Commercial LPG Cylinder Price Today) చేరుకుంది. కోల్‌కతాలో కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్‌ రూ. 1,787కు అందుబాటులోకి రానున్నాయి. ముంబై ప్రజలు ఇప్పుడు బ్లూ సిలిండర్ కోసం రూ. 1,629 చెల్లించాల్సి ఉంటుంది. చెన్నైలో దీని ధర ఈ రోజు నుంచి రూ. 1,840.50 అవుతుంది.


గత నెలల్లోనూ తగ్గుదల
గత రెండు నెలల్లో కూడా కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను తగ్గించారు. మే 01న, 19 కిలోల సిలిండర్‌ ధర రూ. 19 తగ్గింది. దీనికిముందు, ఏప్రిల్‌ 01న రూ. 35 తగ్గింది. ఏప్రిల్‌కు ముందు వరుసగా మూడు నెలలపాటు వాణిజ్య సిలిండర్ల ధరలు పెరిగాయి.


సామాన్యులకు మాత్రం 3 నెలలుగా రిక్తహస్తం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఈ ఏడాది మహిళా దినోత్సవం (08 మార్చి 2024) సందర్భంగా దేశీయ ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలను ‍‌(Domestic LPG Cylinder Price) రూ. 100 తగ్గిస్తున్నట్లు మార్చిలో ప్రకటించారు. ఇంట్లో వంటకు ఉపయోగించే ఎల్‌పీజి సిలిండర్‌ రేటు తగ్గడం అదే చివరిసారి. అప్పటి నుంచి, అంటే 3 నెలలుగా 14 కిలోల సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదు.


తెలుగు రాష్ట్రాల్లో 14 కిలోల గ్యాస్‌ సిలిండర్ ధరలు
హైదరాబాద్‌లో 14.2 కేజీల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ‍‌(14 KGs Gas Cylinder Price In Hyderabad) రూ. 855కి అందుబాటులో ఉంది. విజయవాడలోనూ దేశీయ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ‍‌(14 KGs Gas Cylinder Price In Vijayawada) కోసం రూ. 855 చెల్లించాలి. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో దాదాపు ఇదే ధర ఉంది, రవాణా ఛార్జీల వల్ల అతి స్వల్పంగా మారొచ్చు.


మార్చి నెలలో, పీఎం ఉజ్వల యోజన (Pradhan Mantri Ujjwala Yojana -  PMUY) లబ్ధిదార్లకు మాత్రం కేంద్ర ప్రభుత్వం బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. 2024 మార్చి 07న, ఈ పథకం కింద ఒక్కో సిలిండర్‌కు రూ. 300 చొప్పున సబ్సిడీని ప్రకటించింది. దీంతో, పీఎం ఉజ్వల యోజన లబ్ధిదార్లకు పీఎంయూవై సబ్సిడీ రూ. 300 + రూ. 100 డిస్కౌంట్‌ కలిపి, మొత్తం రూ. 400 తగ్గింది. ఫైనల్‌గా, ఒక్కో సిలిండర్ రూ. 503 కే అందుబాటులోకి వచ్చింది. ఉజ్వల యోజన లబ్ధిదార్లకు ఈ రాయితీ 2025 మార్చి 31 వరకు వర్తిస్తుంది. 


ఏప్రిల్‌ నెలలో లోక్‌సభ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు (జూన్ 01) చివరి దశ ఓటింగ్ జరుగుతోంది. 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడవుతాయి.


మరో ఆసక్తికర కథనం: గ్లోబల్‌గా దిగొస్తున్న గోల్డ్‌ రేటు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి