L&T Buyback: 


ఇంజినీరింగ్‌ అండ్‌ కన్స్‌ట్రక్షన్ దిగ్గజం లార్సెన్‌ అండ్‌ టుబ్రో (L&T) గుడ్‌న్యూస్ చెప్పింది! రూ.10000 కోట్ల విలువైన షేర్లను బయ్‌ బ్యాక్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. రెండు రూపాయాల ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.3000 చెల్లిస్తామని వెల్లడించింది. టెండర్‌ ఆఫర్‌ పద్ధతిలో షేర్లను కొనుగోలు చేస్తామని తెలిపింది.


ప్రస్తుతం ఎల్‌ అండ్‌ టీ షేరు రూ.2,565 వద్ద ఉంది. మంగళవారం రూ.2616 వద్ద మొదలైన షేరు రూ.2553 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. రూ.2617 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరకు రూ.40 నష్టంతో ముగిసింది. ఏడాది కాలంలోనే ఈ షేరు విలువ 46 శాతం పెరగడం గమనార్హం. ఇప్పుడున్న మార్కెట్‌ ధరతో పోలిస్తే 3.33 కోట్ల షేర్లను 17 శాతం ప్రీమియంతో బయ్‌ బ్యాక్‌ (L&T Shares buy back) చేయనుంది.


'రెండు రూపాయల ఫేస్‌వాల్యూ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరును రూ.3000తో తిరిగి కొనుగోలు చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. మొత్తం 3,33,33,333 షేర్లను బయ్‌ బ్యాక్ చేస్తున్నాం. ఇందుకు రూ.10,000 కోట్లు కేటాయించాం' అని ఎల్‌టీ తెలిపింది. కంపెనీ షేర్‌ మార్కెట్లో లిస్టయిన తర్వాత బయ్‌ బ్యాక్‌ చేపట్టడం ఇదే తొలిసారి. ఇలా చేయడం వల్ల మార్కెట్లో షేర్ల అసలు విలువ పెరుగుతుంది. అలాగే ఒక్కో షేరుకు ఆరు రూపాయల డివిడెండ్‌ ప్రకటించింది. ఆగస్టు 2ను రికార్డు డేట్‌. ఆగస్టు 14కు ముందే ఇన్వెస్టర్ల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి.


ఇక జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో ఎల్‌టీ మెరుగైన ఫలితాలే విడుదల చేసింది. వార్షిక ప్రాతిపదికన నికర లాభం 46 శాతం పెరిగి రూ.2,493 కోట్లుగా ఉంది. ఆదాయం 34 శాతం ఎగిసి రూ.47,882 కోట్లుగా నమోదైంది. జూన్‌ త్రైమాసికంలో కంపెనీకి రూ.65,520 కోట్ల విలువైన ఆర్డర్లు వచ్చాయి. వార్షిక ప్రాతిపదికన 57 శాతం వృద్ధి నమోదు చేసింది. జూన్‌ నాటికి గ్రూప్‌ మొత్తం ఏకీకృత ఆర్డర్‌ బుక్‌ విలువ రూ.4.12 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో అంతర్జాతీయ ఆర్డర్లు 29 శాతంగా ఉన్నాయి.


మీడియం టర్మ్‌లో కంపెనీకి విలువైన ఆర్డర్లు ఉన్నాయని ఎల్‌అండ్‌టీ  (L&T Shares Buyback) తెలిపింది. ఇది వృద్ధిని కొనసాగించేందుకు ఉపయోగపడుతుందని వివరించింది. సరికొత్త అవకాశాలు వస్తాయి కాబట్టి ఇన్వెస్టర్ల విలువ పెరుగుతుందని వెల్లడించింది. 


Also Read: కొత్తిమీర కట్ట రూ.50, టమాట కిలో రూ.200 - ముంబయిలో రికార్డులు!


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు నవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial