Israel-Hamas War Impact: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఫలితంగా దలాల్ స్ట్రీట్‌తో సహా గ్లోబల్ మార్కెట్లలో ఎలాంటి భారీ విక్రయాలు కనిపించనప్పటికీ, ఇజ్రాయెల్‌తో కనెక్ట్‌ అయిన కొన్ని ఇండియన్‌ కంపెనీలపైకి మార్కెట్‌ ఫోకస్‌ మళ్లింది.


ఇజ్రాయెల్‌లోని హైఫా పోర్ట్‌ను నిర్వహిస్తున్న అదానీ పోర్ట్స్ షేర్లు ఈ రోజు (సోమవారం, 09.10.2023‌) 4% పైగా నష్టంతో, BSEలో ఇంట్రాడే కనిష్ట స్థాయి రూ.794.15కి పడిపోయాయి. ఇజ్రాయెల్‌కు చెందిన టారో ఫార్మాస్యూటికల్‌లో మెజారిటీ వాటా ఉన్న సన్ ఫార్మాస్యూటికల్ షేర్లు దాదాపు 2% తగ్గాయి.


టెల్ అవీవ్ కేంద్రంగా పని చేసే టెవా ఫార్మాస్యూటికల్‌పై పడే ప్రభావం కారణంగా, జెనరిక్ డ్రగ్‌మేకర్ డా. రెడ్డీస్, లుపిన్ కూడా ఇన్వెస్టర్ల ఫోకస్‌లో ఉన్నాయి.


భారత ప్రభుత్వ రంగ మైనింగ్‌ కంపెనీ NMDC, ఆభరణాల కంపెనీలు కళ్యాణ్ జ్యువెలర్స్, టైటన్‌కు కూడా ఇజ్రాయెలీ కనెక్షన్ ఉందని బ్లూమ్‌బెర్గ్‌ డేటా చూపుతోంది.


టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), విప్రో, టెక్ మహీంద్ర, ఇన్ఫోసిస్ వంటి IT మేజర్లతో పాటు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), లార్సెన్ & టూబ్రో (L&T) కూడా ఇజ్రాయెల్‌లో ఉనికిని కలిగి ఉన్నాయి.


వీటిపైనా వార్‌ ఎఫెక్ట్‌
మిడిల్ ఈస్ట్‌లోని వివాదం ఈ 14 ఇండియన్‌ స్టాక్స్‌ మీదే కాదు, చమురు మార్కెటింగ్ కంపెనీలపైనా (OMCలు) నెగెటివ్‌ ఎఫెక్ట్‌ చూపుతోంది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా ఇంటర్నేషనల్‌ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు & వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలకు ముందు దేశంలో చమురు ధరలను పెంచడం OMCలకు చాలా కష్టమైన పని. 


G20 సమ్మిట్‌లో ప్రకటించిన 'ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరోప్' ఎకనమిక్ కారిడార్ నిర్మాణంపై యుద్ధం ప్రభావం చూపుతుందనే భయంతో ఇర్కాన్‌, జూపిటర్‌ వాగన్స్‌, RVNL, IRFC వంటి రైల్వే స్టాక్స్‌ తలో 5-6% పడిపోయాయి. ఈ కారిడార్ రైల్వే సంబంధిత కంపెనీలతో పాటు నౌక నిర్మాణ పరిశ్రమకు కూడా సానుకూలంగా ఉంటుంది. కాబట్టి, షిప్పింగ్ కార్పొరేషన్ షేర్లు ఈ రోజు దాదాపు 5% పడిపోయాయి.


మిడిల్‌ ఈస్ట్‌లో తలెత్తిన భౌగోళిక-రాజకీయ అనిశ్చితి, పెరిగిన ముడి చమురు రేట్లు, యుద్ధం కలిసి ఇన్వెస్టర్లలో ఆందోళనలకు మరింత ఆజ్యం పోశాయి. 


ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం వల్ల ఇండియన్‌ స్టాక్ మార్కెట్‌పై ప్రస్తుతానికి పెద్దగా ఎఫెక్ట్‌ లేకపోయినా, ప్రపంచ మార్కెట్ల నుంచి వచ్చే సిగ్నల్స్‌ ఆధారంగా ఇండియన్‌ స్టాక్స్‌ పని చేస్తాయి. యుద్ధం ప్రారంభ దశలో ఉంది కాబట్టి దాని ప్రభావం ఎలా, ఎంత ఉంటుందన్న ఇప్పుడే అంచనా వేయడం కొంచం కష్టమైన పని. మరో రెండు, మూడు రోజులు గడిస్తే పరిస్థితిపై ఫుల్‌ పిక్చర్‌ కనిపిస్తుంది.


ఈక్విటీ మార్కెట్లతో పాటు బాండ్ మార్కెట్‌లోనూ అస్థిరత కనిపించే అవకాశం ఉంది. వడ్డీ రేట్లు మరింత పెరగడం వల్ల బాండ్ ఈల్డ్స్‌ తగ్గుతాయి, చమురు ధరలు మరింత పెరుగుతాయి. ఇది, ఇది క్యాపిటల్ మార్కెట్, బ్యాంకింగ్ రంగం, వాణిజ్య లోటు, కరెంట్ ఖాతా లోటు, ఆర్థిక లోటుపై కొంతమేర ప్రభావం చూపవచ్చు.


ఇదే కీలకమైన పాయింట్‌
హమాస్‌కు ప్రధాన సపోర్టర్‌ అయిన ఇరాన్ కూడా ఈ యుద్ధంలోకి దిగుతుందా, లేదా అనే దానిపై భారతదేశంపై ప్రభావం చాలా వరకు ఆధారపడి ఉంటుంది. ఇరాన్‌ గనక వార్‌ ఫీల్డ్‌లోకి అడుగు పెడితే, చమురు సరఫరాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. దీనివల్ల ముడి చమురు రేట్లు పెరుగుతాయి, మన మార్కెట్‌లో రిస్క్‌ పెరుగుతుంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: ఏడాదిలోపే రెట్టింపు రిటర్న్స్‌ ఇచ్చిన పెన్నీ స్టాక్స్‌, వీటిలో ఒక్కటైనా మీ దగ్గరుందా?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial