Netweb Technologies IPO: సర్వర్ మేకింగ్ దిగ్గజం నెట్‌వెబ్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్ (Netweb Technologies IPO) త్వరలోనే తన IPOని తీసుకు రాబోతోంది. ఈ ఐపీఓ ద్వారా రూ. 700 కోట్లు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. మార్కెట్ రెగ్యులేటర్ 'సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా'కి (SEBI) ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌ (IPO) పత్రాలను ఈ కంపెనీ సమర్పించింది. 


కంపెనీ సమర్పించిన పత్రాల ప్రకారం, నెట్‌వెబ్ టెక్నాలజీస్‌ దాదాపు రూ. 700 కోట్ల సైజ్‌తో పబ్లిక్‌ ఆఫర్‌ను తీసుకురాబోతోంది. ఇందులో రూ. 257 కోట్ల విలువైన ఫ్రెష్‌ షేర్లను జారీ చేయనున్నారు. మిగిలిన మొత్తం 'ఆఫర్ ఫర్ సేల్' ‍‌(OFS) వాటా. 
OFS ద్వారా మొత్తం 85 లక్షల షేర్లను కంపెనీ ప్రమోటర్లు విక్రయించనున్నారు. కంపెనీ ప్రమోటర్లు నవీన్ లోధ, వివేక్ లోధ, సంజయ్ లోధ, అశోక్ బజాజ్ ఈ కంపెనీలో తమ వాటాలను ఆఫ్‌లోడ్‌ చేయబోతున్నారు.


ఐపీఓ ప్రకటించడానికి ముందు, రూ. 51 కోట్ల ప్రి-ఐపీవో ప్లేస్‌మెంట్ కోసం కూడా కంపెనీ సన్నాహాలు చేస్తోంది. నెట్‌వెబ్ టెక్నాలజీస్  ప్రి-ఐపీవో ప్లేస్‌మెంట్ మీద ఇన్వెస్టర్లు ఆసక్తి చూపి, వాళ్లకు ఈ కంపెనీ షేర్లను కేటాయిస్తే, IPO సైజ్‌  రూ. 700 కోట్ల కంటే కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DHRP) ప్రకారం, నెట్‌వెబ్ టెక్నాలజీస్‌ IPO పరిమాణం రూ. 600 నుంచి రూ. 700 కోట్ల మధ్య ఉండవచ్చు.


ఐపీవో డబ్బును కంపెనీ ఎలా ఉపయోగిస్తుంది?
ఫ్రెష్‌ షేర్ల విక్రయం ద్వారా వచ్చిన డబ్బు మాత్రమే కంపెనీ అకౌంట్‌కు వెళ్తుంది. OFS రూట్‌లో అమ్మగా వచ్చిన మొత్తం ప్రమోటర్ల సొంత ఖాతాల్లోకి వెళ్తుంది, ఈ డబ్బుతో కంపెనీకి సంబంధం ఉండదు. జాతీయ మీడియా రిపోర్ట్‌ల ప్రకారం.. ఫ్రెష్‌ షేర్ల అమ్మకం ద్వారా వచ్చిన డబ్బులో రూ. 28.02 కోట్లను వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం కంపెనీ ఖర్చు చేస్తుంది. మూలధన వ్యయం కోసం రూ. 32.77 కోట్లను వెచ్చిస్తుంది. మిగిలిన మొత్తంతో కార్పొరేట్ అవసరాలను తీర్చుకుంటుంది. 


బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో (NSE) షేర్లు లిస్ట్‌ అవుతాయి.


కంపెనీ వ్యాపారం - ఆర్థిక స్థితి
నెట్‌వెబ్ టెక్నాలజీస్ దిల్లీ కేంద్రంగా పని చేసే సంస్థ, ఇది సర్వర్‌లను తయారు చేసే వ్యాపారంలో ఉంది. దేశంలోని ఓరిజినల్‌ ఎక్విప్‌మెంట్‌ను తయారు చేసే అతి కొన్ని కంపెనీల్లో ఇది ఒకటి. ఈ కంపెనీ కూడా ప్రభుత్వ PLI స్కీమ్‌కు ఎంపికైంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో కార్యకలాపాల ఆదాయం 73 శాతం పెరిగి రూ. 247.03 కోట్లకు చేరింది. 2022-21 ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం రూ. 142.79 కోట్లు మాత్రమే. 2022 సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 14.72 కోట్లుగా ఉంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.