LIC IPO: ఎల్‌ఐసీ ఇష్యూ ధరను కంపెనీ రూ.949గా నిర్ణయించినట్టు తెలిసింది. అప్పర్‌ బ్యాండ్ ధరకే షేర్లను కేటాయిస్తున్నట్టు సమాచారం. దేశంలోనే అతిపెద్దదైన ఈ ఐపీవోకు అంచనాలకు మించే స్పందన లభించింది. షేర్ల కేటాయింపు జరగని వాళ్లకే శుక్రవారం నుంచే రీఫండ్‌ మొదలైంది. కేటాయింపు చేసిన వారికి సోమవారం డీమ్యాట్‌ ఖాతాల్లో షేర్లు జమ అవుతాయి. బహుశా ఆ మరుసటి రోజే లిస్టింగ్‌ అవుతుందని అంటున్నారు.


ఎల్ఐసీ ఇష్యూ మే 4న మొదలైంది. 9న ముగిసింది. ధరల శ్రేణిని రూ.902-949గా నిర్ణయించారు. బిడ్డింగ్‌ వేసేందుకు చివరి రోజైన సోమవారం నాటికి 2.95 రెట్లు సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. పాలసీ హోల్డర్లు, రిటైల్‌ ఇన్వెస్టర్లు, ఉద్యోగుల నుంచి ఈ ఐపీవోకు మంచి స్పందన లభించింది. యాంకర్‌ బుక్‌ను మినహాయిస్తే 162 మిలియన్ షేర్లను ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. ఏకంగా 478.3 మిలియన్ల షేర్లకు బిడ్డింగ్స్‌ వచ్చాయి.


ఈ ఇష్యూకు 7.3 మిలియన్ల కన్నా ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. దాంతో 14 ఏళ్ల క్రితం అనిల్‌ అంబానీ రిలయన్స్‌ పవర్‌ షేర్ల అమ్మకం రికార్డును బ్రేక్‌ చేసింది. 2008లో ఆ ఇష్యూకు 4.8 మిలియన్ల మంది దరఖాస్తు చేసుకోగా ఎల్‌ఐసీకి 7.3 మిలియన్ల మంది బిడ్డింగ్‌ వేయడం గమనార్హం.


ఎల్ఐసీ వివరాలు


LICలో 3.5 శాతం వాటా విక్రయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రూ.21,000 కోట్లతో పబ్లిక్‌ ఇష్యూకు వస్తోంది. మే 4న మొదలయ్యే ఇష్యూ 9న ముగుస్తుంది. భారత్‌ స్టాక్‌మార్కెట్లలో అతిపెద్ద ఇష్యూ ఇదే కావడం గమనార్హం. ఐపీవోకు దరఖాస్తు చేసేవారు కొన్ని కీలక వివరాలు తెలుసుకోవడం ముఖ్యం.


సబ్‌స్క్రిప్షన్‌ తేదీ: ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ 2022, మే4, బుధవారం మొదలవుతుంది. మే 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.


ప్రైస్‌ బ్యాండ్‌ : ఎల్‌ఐసీ షేర్ల ధర రూ.902 - 949గా నిర్ణయించారు. ఒక్కో షేరు ఫేస్‌ వాల్యూ రూ.10గా ఉండనుంది. పాలసీ హోల్డర్లకు  రూ.60, రిటైల్‌ ఇన్వెస్టర్లు, ఉద్యోగులకు రూ.45 వరకు డిస్కౌంట్‌ ఇస్తున్నారు.


ఆఫర్‌ వివరాలు: అప్పర్‌ బ్యాండ్‌ ధరకు ఎల్‌ఐసీలో 3.5 శాతం వాటా విక్రయించడం ద్వారా ప్రభుత్వం రూ.21,000 కోట్లు సమీకరించనుంది. ఇది మొత్తంగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ఐపీవో. 221,374,920 ఈక్విటీ షేర్లను విక్రయిస్తున్నారు. మొత్తం ఆఫర్లో 50 శాతం క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్లు, 35 శాతం రిటైల్‌ ఇన్వెస్టర్లు, మిగిలిన 15 శాతం నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లకు రిజర్వు చేశారు.


ఎన్ని లాట్లు ఇస్తారు: ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్‌కు బిడ్‌ దాఖలు చేయొచ్చు. ఒక లాట్‌లో 15 షేర్లు ఉంటాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లు 14 లాట్లు అంటే 210 షేర్లకు బిడ్‌ వేయొచ్చు. మొత్తం రూ.1,99,290 అవుతుంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు, ఎల్‌ఐసీ ఉద్యోగులు, ఎల్‌ఐసీ పాలసీదారులు గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.