LIC IPO GMP Status: ఎల్‌ఐసీ ఇన్వెస్టర్లకు అలర్ట్‌!! గ్రే మార్కెట్లో భారతీయ జీవిత బీమా షేర్ల ప్రీమియం (LIC GMP Price) నెగెటివ్‌లో ట్రేడ్‌ అవుతోందని తెలుస్తోంది. ఎల్‌ఐసీ గ్రే మార్కెట్‌ ప్రీమియం రూ.15 నష్టంతో ఉందని అంటున్నారు. ప్రస్తుతం మార్కెట్‌ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడమే ఇందుకు కారణమని వెల్లడిస్తున్నారు.


ఎల్‌ఐసీ (LIC IPO) గ్రేమార్కెట్‌ ప్రీమియం బుధవారం రోజు నెగెటివ్‌కి చేరినట్టు మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. ఇష్యూ ఆరంభంలో ఎల్‌ఐసీ జీఎంపీ ఒక షేరుకు రూ.93-95 మధ్య ఉండేది. ఇష్యూ మొదలైన వెంటనే మార్కెట్లు పతనం అవ్వడం మొదలైంది. అదే విధంగా కంపెనీ జీఎంపీ ధర 50 శాతం చొప్పున పడిపోయింది. మే5న రూ.8-10 మధ్యన కదలాడింది. మే 16న రూ.10 వద్ద స్థిరపడింది. ఆ తర్వాత రూ.8-9 వద్ద కదలాడింది. ప్రస్తుతం నెగెటివ్‌లోకి మారింది. ఒక్కో షేరు ప్రీమియం రూ.15 నష్టంతో ఉందని తెలుస్తోంది.


అంతర్జాతీయ, ఆసియా, దేశీయ మార్కెట్లు పతనం అవుతున్నా ఎల్‌ఐసీ ఇష్యూకు మంచి స్పందనే వచ్చింది. రిటైల్‌, పాలసీ, ఉద్యోగులు, క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్ల కోటా పూర్తిగా సబ్‌స్క్రైబ్‌ అయింది. అయితే విదేశీ ఇన్వెస్టర్లు మాత్రం అంతగా ఆసక్తి చూపించడం లేదు. మార్కెట్ వాటా తగ్గిపోతుండటం, డిజిటల్‌ ప్రజెన్స్‌ తక్కువగా ఉండటం, షేరు హోల్డర్ల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోకపోవడం వంటివి నెగెటివ్‌గా మారాయి.


ఎల్‌ఐసీలో 3.5 శాతం వాటా విక్రయించడం ద్వారా రూ.20,500 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మే 4న ఇష్యూ మొదలైంది. మే9న ముగిసింది. 12న అలాట్‌మెంట్‌ జరుగుతుంది. మే16న డీమ్యాట్ ఖాతాల్లో షేర్లు క్రెడిట్‌ అవుతాయి. ఆ తర్వాతి రోజు లిస్ట్‌ అయ్యే అవకాశం ఉంది.


ఎల్ఐసీ వివరాలు


LICలో 3.5 శాతం వాటా విక్రయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రూ.21,000 కోట్లతో పబ్లిక్‌ ఇష్యూకు వస్తోంది. మే 4న మొదలయ్యే ఇష్యూ 9న ముగుస్తుంది. భారత్‌ స్టాక్‌మార్కెట్లలో అతిపెద్ద ఇష్యూ ఇదే కావడం గమనార్హం. ఐపీవోకు దరఖాస్తు చేసేవారు కొన్ని కీలక వివరాలు తెలుసుకోవడం ముఖ్యం.


సబ్‌స్క్రిప్షన్‌ తేదీ: ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ 2022, మే4, బుధవారం మొదలవుతుంది. మే 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.


ప్రైస్‌ బ్యాండ్‌ : ఎల్‌ఐసీ షేర్ల ధర రూ.902 - 949గా నిర్ణయించారు. ఒక్కో షేరు ఫేస్‌ వాల్యూ రూ.10గా ఉండనుంది. పాలసీ హోల్డర్లకు  రూ.60, రిటైల్‌ ఇన్వెస్టర్లు, ఉద్యోగులకు రూ.45 వరకు డిస్కౌంట్‌ ఇస్తున్నారు.


ఆఫర్‌ వివరాలు: అప్పర్‌ బ్యాండ్‌ ధరకు ఎల్‌ఐసీలో 3.5 శాతం వాటా విక్రయించడం ద్వారా ప్రభుత్వం రూ.21,000 కోట్లు సమీకరించనుంది. ఇది మొత్తంగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ఐపీవో. 221,374,920 ఈక్విటీ షేర్లను విక్రయిస్తున్నారు. మొత్తం ఆఫర్లో 50 శాతం క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్లు, 35 శాతం రిటైల్‌ ఇన్వెస్టర్లు, మిగిలిన 15 శాతం నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లకు రిజర్వు చేశారు.


ఎన్ని లాట్లు ఇస్తారు: ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్‌కు బిడ్‌ దాఖలు చేయొచ్చు. ఒక లాట్‌లో 15 షేర్లు ఉంటాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లు 14 లాట్లు అంటే 210 షేర్లకు బిడ్‌ వేయొచ్చు. మొత్తం రూ.1,99,290 అవుతుంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు, ఎల్‌ఐసీ ఉద్యోగులు, ఎల్‌ఐసీ పాలసీదారులు గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.