LIC IPO subscription status: భారతీయ జీవిత బీమా కంపెనీ ఐపీవో (LIC IPO)కు మంచి స్పందనే లభిస్తోంది. ఇష్యూ మొదలైన మూడో రోజుకు 1.32 రెట్లు సబ్‌స్క్రైబ్‌ చేసుకున్నారు. క్యూఐబీ కోటాకు 55 శాతం, హై నెట్‌వర్త్‌ ఇండివిజ్యువల్‌ కోటాలో 68 శాతం, రిటైల్‌ పోర్షన్‌కు 1.19 రెట్లు, ఉద్యోగుల కోటాలో 2.94 రెట్లు, పాలసీదారుల కోటాలో 3.87 రెట్లు స్పందన లభించింది. ప్రస్తుతానికి ఐపీవో పరంగా సందడి కనిపిస్తోంది.


ఇన్వెస్టర్ల నుంచి స్పందన లభిస్తున్నా ఆశించిన స్థాయిలో మాత్రం మూమెంటమ్‌ లేదు. గ్రే మార్కెట్లో ప్రీమియం పడిపోవడమే ఇందుకు ఉదాహరణ. ఇష్యూ ఆరంభమైన రెండో రోజు గ్రే మార్కెట్‌ ప్రీమియం (LIC GMP) రూ.85గా ఉంది. మూడో రోజుకు ఇది 50 శాతం పడిపోయింది. ఏకంగా రూ.42కు వచ్చేసింది. మరో నాలుగు రోజుల సమయం ఉండటంతో జీఎంపీ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి నెలకొంది.


'భారత దేశంలో బీమా రంగం ఇంకా అభివృద్ధి చెందలేదు. ప్రతి భారతీయుడితో ఎల్‌ఐసీ బ్రాండ్‌తో అనుబంధం ఉంది. ఇప్పుడు వాళ్లు లిస్టింగ్‌కు వస్తున్నారు. అన్‌లిస్టెడ్‌ నుంచి లిస్టెడ్‌ కంపెనీగా వారి ప్రయాణం ఆరంభం అవుతోంది. ఎల్‌ఐసీ కచ్చితంగా భారత క్యాపిటల్‌ మార్కెట్లో టార్చ్‌బేరర్‌గా ఉంటుంది' అని కొటక్‌ ఏంఎంసీ నీలేశ్‌ షా అంటున్నారు.


'ఇండియన్‌ క్యాపిటల్‌ మార్కెట్లలో ఎల్‌ఐసీ ఐపీవో ఒక మైలురాయి. అంచనా వేసినట్టుగానే ఇన్వెస్టింగ్‌ కమ్యూనిటీ నుంచి భారీ స్పందన లభిస్తోంది. కొత్త ఇన్వెస్టర్లనూ మార్కెట్లోకి ఆకర్షిస్తోంది. పేటీఎం మనీలో ఎల్‌ఐసీ ఐపీవోలో ఇన్వెస్ట్‌ చేస్తున్న ప్రతి ముగ్గురులో ఒకరు కొత్తవారే' అని పేటీఎం మనీ సీఈవో వరుణ్ శ్రీధర్‌ అన్నారు.


ఎల్ఐసీ వివరాలు


LICలో 3.5 శాతం వాటా విక్రయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రూ.21,000 కోట్లతో పబ్లిక్‌ ఇష్యూకు వస్తోంది. మే 4న మొదలయ్యే ఇష్యూ 9న ముగుస్తుంది. భారత్‌ స్టాక్‌మార్కెట్లలో అతిపెద్ద ఇష్యూ ఇదే కావడం గమనార్హం. ఐపీవోకు దరఖాస్తు చేసేవారు కొన్ని కీలక వివరాలు తెలుసుకోవడం ముఖ్యం.


సబ్‌స్క్రిప్షన్‌ తేదీ: ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ 2022, మే4, బుధవారం మొదలవుతుంది. మే 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.


ప్రైస్‌ బ్యాండ్‌ : ఎల్‌ఐసీ షేర్ల ధర రూ.902 - 949గా నిర్ణయించారు. ఒక్కో షేరు ఫేస్‌ వాల్యూ రూ.10గా ఉండనుంది. పాలసీ హోల్డర్లకు  రూ.60, రిటైల్‌ ఇన్వెస్టర్లు, ఉద్యోగులకు రూ.45 వరకు డిస్కౌంట్‌ ఇస్తున్నారు.


ఆఫర్‌ వివరాలు: అప్పర్‌ బ్యాండ్‌ ధరకు ఎల్‌ఐసీలో 3.5 శాతం వాటా విక్రయించడం ద్వారా ప్రభుత్వం రూ.21,000 కోట్లు సమీకరించనుంది. ఇది మొత్తంగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ఐపీవో. 221,374,920 ఈక్విటీ షేర్లను విక్రయిస్తున్నారు. మొత్తం ఆఫర్లో 50 శాతం క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్లు, 35 శాతం రిటైల్‌ ఇన్వెస్టర్లు, మిగిలిన 15 శాతం నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లకు రిజర్వు చేశారు.


ఎన్ని లాట్లు ఇస్తారు: ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్‌కు బిడ్‌ దాఖలు చేయొచ్చు. ఒక లాట్‌లో 15 షేర్లు ఉంటాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లు 14 లాట్లు అంటే 210 షేర్లకు బిడ్‌ వేయొచ్చు. మొత్తం రూ.1,99,290 అవుతుంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు, ఎల్‌ఐసీ ఉద్యోగులు, ఎల్‌ఐసీ పాలసీదారులు గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.