LIC IPO: భారతీయ జీవిత బీమా (LIC IPO) ఐపీవోకు స్పందన బాగా వస్తోంది. ఇష్యూ నాలుగో రోజూ ఇన్వెస్టర్లు ఐపీవోకు దరఖాస్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు 1.5 రెట్ల మంది సబ్‌స్క్రైబ్‌ చేసుకున్నారు. మే 4న మొదలైన ఇష్యూ 9న ముగియనుంది.


ఎల్‌ఐసీ 16,20,78,067 షేర్లకు బిడ్లు పిలవగా ఇప్పటి వరకు 24,33,13,395 ఈక్విటీ షేర్లకు సబ్‌స్క్రైబ్‌ చేసుకున్నారు. అంటే మొత్తంగా 1.5 రెట్లు స్పందన లభించింది. రిటైల్‌, ఉద్యోగులు, పాలసీ హోల్డర్లు సహా మొత్తం ఐదు కోటాల్లో వంద శాతం సబ్‌స్క్రైబ్‌  చేశారు. పాలసీ హోల్డర్ల కోటాకు 4.6 రెట్లు, ఉద్యోగుల కోటాకు 3.31 రెట్లు స్పందన వచ్చింది. క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయర్స్‌ కోటాకు 0.67 రెట్లు, నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ కోటాకు 0.87 రెట్లు సబ్‌స్క్రైబ్‌ చేసుకున్నారు.


ఎల్ఐసీ వివరాలు


LICలో 3.5 శాతం వాటా విక్రయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రూ.21,000 కోట్లతో పబ్లిక్‌ ఇష్యూకు వస్తోంది. మే 4న మొదలయ్యే ఇష్యూ 9న ముగుస్తుంది. భారత్‌ స్టాక్‌మార్కెట్లలో అతిపెద్ద ఇష్యూ ఇదే కావడం గమనార్హం. ఐపీవోకు దరఖాస్తు చేసేవారు కొన్ని కీలక వివరాలు తెలుసుకోవడం ముఖ్యం.


సబ్‌స్క్రిప్షన్‌ తేదీ: ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ 2022, మే4, బుధవారం మొదలవుతుంది. మే 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.


ప్రైస్‌ బ్యాండ్‌ : ఎల్‌ఐసీ షేర్ల ధర రూ.902 - 949గా నిర్ణయించారు. ఒక్కో షేరు ఫేస్‌ వాల్యూ రూ.10గా ఉండనుంది. పాలసీ హోల్డర్లకు  రూ.60, రిటైల్‌ ఇన్వెస్టర్లు, ఉద్యోగులకు రూ.45 వరకు డిస్కౌంట్‌ ఇస్తున్నారు.


ఆఫర్‌ వివరాలు: అప్పర్‌ బ్యాండ్‌ ధరకు ఎల్‌ఐసీలో 3.5 శాతం వాటా విక్రయించడం ద్వారా ప్రభుత్వం రూ.21,000 కోట్లు సమీకరించనుంది. ఇది మొత్తంగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ఐపీవో. 221,374,920 ఈక్విటీ షేర్లను విక్రయిస్తున్నారు. మొత్తం ఆఫర్లో 50 శాతం క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్లు, 35 శాతం రిటైల్‌ ఇన్వెస్టర్లు, మిగిలిన 15 శాతం నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లకు రిజర్వు చేశారు.


ఎన్ని లాట్లు ఇస్తారు: ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్‌కు బిడ్‌ దాఖలు చేయొచ్చు. ఒక లాట్‌లో 15 షేర్లు ఉంటాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లు 14 లాట్లు అంటే 210 షేర్లకు బిడ్‌ వేయొచ్చు. మొత్తం రూ.1,99,290 అవుతుంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు, ఎల్‌ఐసీ ఉద్యోగులు, ఎల్‌ఐసీ పాలసీదారులు గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.