Cyient DLM Listing:


సైయెంట్‌ డీఎల్‌ఎం లిస్టింగ్‌ అదిరింది! సోమవారం ఈ కంపెనీ షేర్లు 51 శాతం ప్రీమియంతో స్టాక్‌ మార్కెట్లో నమోదు అయ్యాయి. పబ్లిక్‌ ఇష్యూకు ఇన్వెస్టర్ల నుంచి ఊహించని స్పందన రావడం, మార్కెట్‌  పరిస్థితులు ఆశాజనకంగా ఉండటమే ఇందుకు కారణాలు.


సైయెంట్ డీఎల్‌ఎం (Cyient DLM) ఎలక్ట్రానిక్‌ వస్తువులను ఉత్పత్తి చేస్తుంది. అలాగే వివిధ కంపెనీలకు సర్వీస్‌ ప్రొవైడర్‌గా పనిచేస్తోంది. ఒక్కో షేరుకు ఐపీవో ధర రూ.265 ఉండగా నేడు బీఎస్‌ఈలో రూ.401 వద్ద నమోదైంది. కంపెనీ ఫండమెంటల్స్‌ ఆరోగ్యకరంగా ఉన్నాయి. 2023, మార్చి నాటికి ఆర్డర్‌ బుక్‌ విలువ రూ.2342 కోట్లుగా ఉంది. ఇక ఈఎంఎస్‌ రంగానికి ప్రభుత్వం అనుకూల నిర్ణయాలు తీసుకుంటోంది. పైగా డిజిటల్‌ మానుఫ్యాక్చరింగ్‌ రంగంలో టెయిల్‌విండ్స్‌ వల్ల స్టాక్‌ మంచి ధరకు లిస్టైంది.


రూ.592 కోట్ల విలువతో వచ్చిన సైయెంట్‌ ఐపీవోకు (Cyient DLM IPO) ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. 67 రెట్లు ఎక్కువగా బిడ్డింగ్‌ చేశారు. క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు కేటాయింపుతో పోలిస్తే 90 రెట్లు ఎక్కువ దరఖాస్తు చేశారు. రిటైల్‌ ఇన్వెస్టర్లు, సంపన్నుల కోటాకు వరుసగా 49.22, 45.05 రెట్లు స్పందన వచ్చింది. 1993లో మొదలైన సైయెంట్‌ డీఎల్‌ఎం ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌ రంగంలో మెరుగ్గా రాణిస్తున్న సైయెంట్‌కు సబ్సిడరీ కంపెనీ. ఇంటిగ్రేటెడ్‌ ఎలక్ట్రానిక్‌ మానుఫాక్చరింగ్‌, సొల్యూషన్స్‌ మార్కెట్‌లో 50 శాతం వరకు వాటా ఉంది.


ఎయిరోస్పేస్‌, డిఫెన్స్‌, మెడికల్‌ టెక్నాలజీ, ఇండస్ట్రియల్‌ రంగాల్లో సైయెంట్‌ డీఎల్‌ఎం సేవలు అందిస్తోంది. స్థానిక, అంతర్జాతీయ కంపెనీలు వీరికి క్లెయింట్లుగా ఉన్నారు. బిల్డ్‌ టు ప్రింట్‌, బిల్డ్‌ టు స్పెసిఫికేషన్స్ విధానాల్లో ఉత్పత్తులు అందిస్తోంది. ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డు అసెంబ్లీ, కేబుల్ హార్‌నెస్‌, కాక్‌పిట్స్‌, ఇన్‌ ఫ్లైట్‌ సిస్టమ్స్‌, ల్యాండింగ్‌ సిస్టమ్స్‌, మెడికల్‌ డయాగ్నస్టిక్స్‌లో కీలకమైన బాక్స్‌ బిల్డ్స్‌ను తయారు చేస్తోంది.


ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్‌ మానుఫాక్చరింగ్‌, సొల్యూషన్స్‌ రంగం (EMS) ఔట్‌లుక్‌ అద్భుతంగా ఉంది. ఇందులో భారత్‌ ఈఎంఎస్‌ వాటా కేవలం 2.2 శాతమే. అంటే 20 బిలియన్‌ డాలర్లు. 32.3 శాతం సీఏజీఆర్‌ గ్రోత్‌ నమోదు చేస్తోంది. 2026 వరకు అంతర్జాతీయ మార్కెట్లో ఏడు శాతం అంటే 80 బిలియన్‌ డాలర్ల వాటా భారత్‌కు వస్తుందని అంచనా. అందుకే సైయెంట్‌ డీఎల్‌ఎం కోసం ఇన్వెస్టర్లు ఎగబడ్డారు. 


సైయెంట్‌ డీఎల్‌ఎం షేర్లు ఇష్యూ ధర రూ.265కు 50 తీసుకొని ఉంటే గంటలోనే ఆ సొమ్ము రూ.20,050కి పెరిగేది. అంటే దాదాపుగా రూ.7000 వరకు లాభం వచ్చేది.


Also Read: ఈ వారమే టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో రిజల్ట్స్‌! ట్రేడ్‌ ప్లాన్ చేసుకోండి!


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial