India's Exports To US Rise Despite Trump's Fears: 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో (2024 ఏప్రిల్-డిసెంబర్ కాలం) అమెరికాకు భారతదేశం నుంచి ఎగుమతులు 5.57 శాతం పెరిగి 59.93 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. భారత ప్రభుత్వ ఈ డేటాను విడుదల చేసింది. అమెరికా మార్కెట్‌లో భారతీయ ఉత్పత్తులకు బలమైన డిమాండ్‌ కారణంగా ఎగుమతులు పెరిగాయని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. 

భారత ప్రభుత్వ డేటా ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో ‍‌అమెరికా నుంచి భారత్ దిగుమతులు 1.91 శాతం పెరిగి 33.4 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

2024 డిసెంబర్‌ నెలలో, అమెరికాకు ఎగుమతి అయిన భారతదేశ ఉత్పత్తుల విలువ 8.49 శాతం పెరిగి 7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అదే నెలలో, దిగుమతుల విలువ 9.88 శాతం పెరిగి 3.77 బిలియన్ డాలర్లకు చేరుకుంది. డిసెంబర్‌ నెల అంటే, అమెరికా కొత్త అధ్యక్షుడుగా డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం సాధించిన సమయం. అమెరికా ఎన్నికలలో ట్రంప్‌ గెలిచినప్పటికీ భారత్‌ నుంచి అగ్రరాజ్యానికి ఎగుమతులు పెరిగాయి. అంటే, భారత్‌ మార్కెట్‌పై ట్రంప్‌ వాణిజ్య విధానాల భయం పెద్దగా ప్రభావం చూపలేదని అర్ధం చేసుకోవచ్చు.

ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే, రానున్న నెలల్లో భారత్‌ - అమెరికా మధ్య వాణిజ్యం మరింత పెరుగుతుందని చాలా మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో రెండు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం 93.4 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇదే సమయంలో, భారతదేశం - చైనా మధ్య వాణిజ్యం (India-China Trade) విలువ 94.6 బిలియన్ డాలర్లుగా నమోదైంది.

అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సుంకాల యుద్ధాన్ని ‍‌(Tariff war) మొదలు పెడతారన్న అంచనాలు ఉన్నాయి. అమెరికా దిగుమతి చేసుకునే చైనా ఉత్పత్తులపై అధిక కస్టమ్స్‌ సుంకాలు విధించవచ్చని భావిస్తున్నారు. అమెరికా - చైనాల మధ్య ఏర్పడే వాణిజ్య యుద్ధం భారతీయ ఎగుమతిదారులకు భారీ అవకాశాలను సృష్టిస్తుందని నిపుణులు లెక్కలు వేస్తున్నారు. 

2021-22 సంవత్సరం నుంచి, భారతదేశానికి అమెరికా అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతోంది. భారతదేశం మొత్తం ఎగుమతుల్లో అమెరికా వాటా దాదాపు 18 శాతం కాగా, దిగుమతుల్లో ఆరు శాతానికి పైగా ఉంది. ద్వైపాక్షిక వాణిజ్యంలో ఇది దాదాపు 11 శాతం.

అయితే, వాణిజ్య సుంకాల విషయంలో, చైనాతో పాటు భారత్‌ కూడా డొనాల్డ్ ట్రంప్ రాడార్‌లో ఉంది. గత హెచ్చరిలను ట్రంప్‌ అమల్లోకి తీసుకొచ్చి కొన్ని భారతీయ ఉత్పత్తులపై అదనపు సుంకాలు విధిస్తే, అది ద్వైపాక్షిక వాణిజ్యంపై ప్రభావం చూపుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా ఇలాంటి చర్యలకు దిగితే భారత్ కూడా ఘాటుగా ప్రతిస్పందించాలని ఆర్థిక పరిశోధన సంస్థ 'గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్' (GTIR) వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ సూచించారు.

2018లో, భారతీయ ఉక్కు & అల్యూమినియంపై అమెరికా పన్ను విధించినప్పుడు, భారతదేశం 29 అమెరికన్ ఉత్పత్తులపై సుంకాన్ని పెంచి ప్రతీకారం తీర్చుకుంది. ఆ సుంకాల వసూళ్లతో భారతదేశం సమాన ఆదాయాన్ని తిరిగి పొందింది.

మరో ఆసక్తికర కథనం: డ్రాగన్‌ తోకను వదిలేస్తున్న ఆపిల్‌ - పెరగనున్న 'మేడ్‌ ఇన్‌ ఇండియా ఐఫోన్‌'లు