Nikhil Ravishankar : భారత్‌ సంతతికి చెందిన చాలా మంది అంతర్జాతీయంగా కీలక పదవులు చేపడుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోనే నిఖిల్ రవిశంకర్‌ చేరారు. ఐదేళ్లుగా ఎయిర్ న్యూజిలాండ్‌లో వివిధ హోదాల్లో పని చేస్తున్న నిఖిల్ రవిశంకర్‌ ఇప్పుడు సీఈవోగా బాధ్యత చేపట్టనున్నారు. అక్టోబర్ నుంచి పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. 

"ప్రస్తుతం ఎయిర్‌లైన్ చీఫ్ డిజిటల్ ఆఫీసర్‌గా ఉన్న నిఖిల్ 20 అక్టోబర్ 2025న CEOగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఎయిర్ న్యూజిలాండ్‌లో ఉన్న దాదాపు ఐదేళ్లలో నిఖిల్ విమానయాన రంగం , విమానయాన సంస్థ పురోభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఎయిర్‌లైన్ టెక్నాలజీ బ్యాక్‌బోన్, లాయల్టీ ప్రోగ్రామ్ ఇలా చాలా విప్లవాత్మక మార్పులకు ఆయన నాయకత్వం వహించారు." అని ఎయిర్ న్యూజిలాండ్ కీలక ప్రకటన చేసింది. 

ఎయిర్‌లైన్‌లో చేరడానికి ముందు రవిశంకర్‌ వివిధ సంస్థల్లో పని చేసి తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. వెక్టర్‌లో చీఫ్ డిజిటల్ ఆఫీసర్‌గా, యాక్సెంచర్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేసి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందారు. 

ఎయిర్ న్యూజిలాండ్ ప్రకటనపై రవిశంకర్ కూడా స్పందించారు. "ఎయిర్ న్యూజిలాండ్‌కు నాయకత్వం వహించడానికి అవకాశం లభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. వినయంతో ఇచ్చిన బాధ్యతను వినయంతో స్వీకరించి న్యాయం చేస్తానని అన్నారు. విమానయాన సంస్థల్లో పని చాలా రిస్క్‌తో కూడుకొని ఉంటుందని తీసుకునే ప్రతి నిర్ణయం కూడా భద్రతాపరమైన కోణంలో తీసుకోవాల్సి ఉంటుంది" అని అన్నారు.   

ఎయిర్ న్యూజిలాండ్ అంతర్జాతీయ చాలా గుర్తింపు పొందిన సంస్థ. ఈ సంస్థ ప్రతి రోజూ నాలుగు వందలకుపైగా విమానాలను నడుపుతోంది. ఇందులో బోయింగ్‌ 777, బోయింగ్‌ 787, ఎయిర్‌బస్‌ 320, ఇలా ముఖ్యమైన 100కుపైగా విమానాలు కలిగి ఉంది. ఇటు భారత్‌తో కూడా మంచి స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉంది.