FPI investments: 2022 సంవత్సరం ప్రపంచ స్టాక్ మార్కెట్లకు కలిసి రాలేదు. ఇండియన్‌ ఈక్విటీలు కూడా ఈ ట్రెండ్ బారిన పడ్డా, ఇతర ప్రధాన మార్కెట్ల కంటే చాలా మెరుగ్గా ఉన్నాయి. ఆ సంవత్సరం FPIల (ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు) ఉదాసీనత ఏడాది పొడవునా కొనసాగింది, వాళ్లు నికర విక్రయదార్లుగా (నెట్‌ సెల్లర్స్‌) మిగిలారు. 


మార్నింగ్‌స్టార్ నివేదిక ప్రకారం... 2022 డిసెంబర్‌ చివరి నాటికి, భారత స్టాక్‌ మార్కెట్లలో FPIల హోల్డింగ్స్ $584 బిలియన్లుగా ఉన్నాయి. ఏడాది క్రితం, అంటే 2021 డిసెంబర్‌తో పోలిస్తే ఇది 11 శాతం తక్కువ. 2021 డిసెంబర్‌ చివరి నాటికి FPI హోల్డింగ్స్ $654 బిలియన్లుగా ఉన్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ మూలధనాన్ని భారీగా ఉపసంహరించుకోవడం, భారత స్టాక్ మార్కెట్ల నుంచి రాబడులు తక్కువగా ఉండడం ఎఫ్‌పీఐల పెట్టుబడులు భారీగా తగ్గడానికి ప్రధాన కారణాలు.


త్రైమాసికంగా మెరుగుదల
నివేదిక ప్రకారం... త్రైమాసిక ప్రాతిపదికన మాత్రం FPI పెట్టుబడులు పెరిగాయి. 2022 సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే, డిసెంబర్ త్రైమాసికంలో FPIల హోల్డింగ్‌లో 3% పెరిగింది. ఈ ప్రకారం, వరుసగా రెండో త్రైమాసికంలోనూ FPI హోల్డింగ్‌లు పెరిగింది. అంటే, ఇండియన్‌ ఈక్విటీస్‌లో గత ఆరు నెలలుగా ఎఫ్‌పీఐల పెట్టుబడులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో, భారత స్టాక్ మార్కెట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో ఎఫ్‌పీఐల వాటా కూడా పెరిగింది. 2022 సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ వాటా 16.97 శాతంగా ఉంటే, డిసెంబర్ త్రైమాసికంలో ఇది 17.12 శాతానికి పెరిగింది.


2021 సంవత్సరంలో స్టాక్‌ మార్కెట్లు అద్భుతంగా రాణించాయి. అయితే, 2022 సంవత్సరం మొత్తం సవాళ్లతో నిండిపోయింది. ఆ సవాళ్ల మధ్య కూడా ఇండియన్‌ ఈక్విటీలు బాగా పని చేశాయి. 2022లో BSE సెన్సెక్స్ 4.44 శాతం రాబడిని అందించగా, BSE మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.38 శాతం రాబడిని ఇచ్చింది. BSE స్మాల్ క్యాప్ ఇండెక్స్ పనితీరు పడిపోయింది, రాబడి ప్రతికూలంగా మారింది.


గత ఏడాది భారతీయ మార్కెట్ల పనితీరుపై విదేశీ మూలధనం అత్యధిక ప్రభావం చూపింది. 2022లో, విదేశీ పెట్టుబడిదార్లు భారతీయ మార్కెట్ల నుంచి 16.5 బిలియన్ డాలర్లు లేదా దాదాపు రూ. 1.21 లక్షల కోట్లను నికరంగా వెనక్కు తీసుకున్నారు. దీనికి ముందు వరుసగా మూడు సంవత్సరాలు భారతీయ మార్కెట్లో FPIలు నికర పెట్టుబడిదార్లుగా ఉన్నారు.


ఈ సంవత్సరమూ అదే కథ
ఈ సంవత్సరం ఇప్పటి వరకు 2022 ట్రెండ్ కొనసాగుతోంది. నివేదిక ప్రకారం... ఈ సంవత్సరం ఫిబ్రవరి 10 వరకు, FPIలు భారతీయ మార్కెట్ల నుంచి సుమారు $4.7 బిలియన్లను ఉపసంహరించుకున్నారు. భారత స్టాక్ మార్కెట్ ఓవర్ వాల్యుయేషన్ కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు ఇతర చవకైన మార్కెట్ల వైపు మొగ్గు చూపారని, డాలర్ల ప్రవాహాన్ని అటు వైపు మళ్లించారని నివేదిక చెబుతోంది. ఇది కాకుండా, అదానీ గ్రూప్‌-హిండెన్‌బర్గ్‌ వివాదం కూడా విదేశీ ఇన్వెస్టర్లు వెనకడుగు వేయడానికి కారణమైంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.