Nirmala Sitharaman On 5-Day Work Week For Banks: సోమవారం నుంచి శుక్రవారం వరకు పని, శని & ఆదివారాలు సెలవులు.. వెరసి, వారంలో ఐదు రోజులు పని. బ్యాంక్‌ ఉద్యోగుల సుదీర్ఘకాల డిమాండ్‌ ఇది.


17% జీతం పెంపును ఇటీవలే సాధించిన బ్యాంక్‌ ఉద్యోగులు, వారంలో ఐదు రోజుల పనికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి వస్తుందని ఆశిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం, బ్యాంకు అసోసియేషన్‌ - బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ మధ్య వివిధ అంశాలపై ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో, దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రకటనకు ముందే, బ్యాంకు ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని దినాలకు గ్రీన్ సిగ్నల్‌ లభిస్తుందన్న ఆశలు పెరిగాయి. అయితే, లక్షలాది మంది బ్యాంకు ఉద్యోగులకు ఈ విషయంలో నిరాశ ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. '5-డే వీక్లీ' కోసం మరికొంత కాలం వేచి ఎదురు చూడాల్సి ఉంటుంది. 


కీలక వ్యాఖ్యలు చేసిన ఆర్థిక మంత్రి
ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, బ్యాంకుల్లో 5 రోజుల పని దినాలకు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు. ఈ నెల 14న, ఐఐటీ గౌహతిలో జరిగిన వికాస్ భారత్ అంబాసిడర్ క్యాంపస్ డైలాగ్‌లో ఆర్థిక మంత్రి మాట్లాడారు. ఆ సమయంలో, బ్యాంకు ఉద్యోగుల పని- వ్యక్తిగత జీవితం మధ్య సమతౌల్యం గురించి, వారంలో 5 రోజులు పని చేయడం గురించి, బ్యాంకుల్లో కొనసాగుతున్న చర్చల గురించి విలేకర్లు ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన ఆర్థిక మంత్రి, వదంతులు పట్టించుకోవద్దని సూటిగా చెప్పారు.


దీనికిముందు, మార్చి 8న, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) - వివిధ బ్యాంకుల ఉద్యోగుల సంఘాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. బ్యాంకు ఉద్యోగుల జీతాలు పెంచేందుకు రెండు పక్షాల మధ్య అంగీకారం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం, వివిధ ప్రభుత్వ బ్యాంక్‌ల ఉద్యోగుల జీతం 17 శాతం పెరుగుతుంది. జీతంతో పాటు, డియర్‌నెస్ అలవెన్స్ పెంపు, మరికొన్ని ప్రయోజనాలపైనా చర్చ జరిగింది.


బ్యాంకు ఉద్యోగుల సుదీర్ఘకాల డిమాండ్‌పై మాత్రం ఆ చర్చల్లో స్పష్టత రాలేదు. ప్రస్తుతం, బ్యాంకు ఉద్యోగులకు ప్రతి ఆదివారం సెలవు లభిస్తోంది. నెలలో మొదటి & మూడో, ఐదో శనివారం బ్యాంకులు తెరిచి ఉంటాయి, రెండు & నాలుగో శనివారం రోజుల్లో సెలవులు వస్తున్నాయి.


ప్రతి నెలా రెండు &నాలుగో శనివారాల్లో సెలవులు ఇస్తున్న విధంగానే మొదటి, మూడు, ఐదో శనివారాల్లోనూ సెలవులు ఇవ్వాలని బ్యాంకు ఉద్యోగులు గట్టిగానే అడుగుతున్నారు. బ్యాంక్ యూనియన్లు - అసోసియేషన్ మధ్య ఒప్పందం తర్వాత.. దానికి ఆమోదం కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖకు పెంపారు. ఈ ఫైల్‌ అక్కడ పెండింగ్‌లో ఉందని సమాచారం. సార్వత్రిక ఎన్నికల ప్రకటనకు ముందే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి వస్తుందని భావించారు. అయితే ఇప్పటి వరకు అలాంటిదేమీ జరగలేదు. ఇప్పట్లో అలాంటి నిర్ణయం వెలువడదని ఆర్థిక మంత్రి స్పష్టమైన సూచన చేశారు.


కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన వెంటనే దేశంలో ప్రవర్తన నియమావళి అమల్లోకి వస్తుంది. ఆ తర్వాత, ఉద్యోగుల సెలవులపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిని బట్టి, బ్యాంకు ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని విధానం అమలవుతుందా, లేదా అనేది కొత్త ప్రభుత్వం నిర్ణయిస్తుందని స్పష్టంగా అర్ధమవుతోంది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి