Crude Oil Imports: భారతదేశ ఆర్థిక బండి కదలాలంటే ఇంధనం తప్పనిసరి. మన దేశంలో ముడి ఇంధనం, పెట్రోలియం ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా, ముడి చమురు అవసరం ఏటికేడు విపరీతంగా పెరుగుతోంది. ఫలితంగా, ముడి చమురు అవసరాల భర్తీ కోసం దిగుమతులపై ఆధారపడటమూ పెరుగుతోంది. దేశీయంగా ముడి చమురు ఉత్పత్తి అతి స్వల్పంగా ఉండడం వల్ల దిగుమతుల వైపు చూడక తప్పట్లేదు. ఆధారపడాల్సిన అవసరం గత ఆర్థిక సంవత్సరంలో ఇంకా పెరిగింది. 


2022-23 ఆర్థిక సంవత్సరంలో (FY23) దేశ ముడి చమురు అవసరాల్లో 87.3 శాతం దిగుమతుల ద్వారా భర్తీ అయింది. దీనికిముందు, 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇది 85.5 శాతంగా ఉంది. కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేసే 'పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్' (PPAC) ఈ డేటాను విడుదల చేసింది.


గత సంవత్సరాల్లో ముడి చమురు దిగుమతులు
ముడి చమురు దిగుమతులకు సంబంధించి మునుపటి గణాంకాలను పరిశీలిస్తే, 2020-21 సంవత్సరంలో దేశ అవసరాల్లో 84.4 శాతాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నాం. 2019-20 సంవత్సరంలో 85 శాతం, 2018-19లో 83.8 శాతంగా ఇది ఉంది.


ముడి చమురు దిగుమతి గణాంకాలు పెట్రోలియం ఉత్పత్తుల దేశీయ వినియోగంపై ఆధారపడి ఉంటుంది. దీనిలో పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతుల లెక్కలు ఉండవు, ఎందుకంటే అవి దేశీయ డిమాండ్‌కు ప్రాతినిధ్యం వహించవు. సంవత్సరానికి 250 మిలియన్ టన్నుల ముడి చమురు శుద్ధి సామర్థ్యం ఉన్న భారత్‌, ప్రపంచంలో మూడో అతి పెద్ద ముడి చమురు వినియోగదారు & అగ్ర దిగుమతి దేశాల్లో ఒకటి. పెట్రోలియం ఉత్పత్తుల నికర ఎగుమతిదారు కూడా.


పెరిగిన దిగుమతుల విలువ
2022-23 ఆర్థిక సంవత్సరంలో, పెట్రోలియం ఉత్పత్తుల దేశీయ వినియోగం ఏడాది ప్రాతిపదికన 10 శాతం పెరిగి రికార్డు స్థాయిలో 222.3 మిలియన్ టన్నులకు చేరుకుంది. ముఖ్యంగా రవాణా ఇంధనాలకు (పెట్రోల్ & డీజిల్) బలమైన డిమాండ్‌ కనిపించింది. అదే సమయంలో, దేశీయ ముడి చమురు ఉత్పత్తి ఏడాది ప్రాతిపదికన 1.7 శాతం క్షీణించి 29.2 మిలియన్ టన్నులకు చేరుకుంది. 2022-23లో, ముడి చమురు దిగుమతి వార్షిక ప్రాతిపదికన 9.4 శాతం పెరిగి 232.4 మిలియన్ టన్నులకు చేరుకుంది. విలువ పరంగా చూస్తే, FY22లోని ముడి చమురు దిగుమతులు $120.7 బిలియన్ల నుంచి FY23లో $158.3 బిలియన్లకు పెరగనున్నాయని PPAC డేటా చూపుతోంది.


దిగుమతి చేసుకునే ముడి చమురుపై భారతదేశం ఆధారపడటం ఏటికేడు పెరుగుతున్న నేపథ్యంలో, దానిని తగ్గించాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. అయినప్పటికీ, పెట్రోలియం ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఖరీదైన చమురు దిగుమతులను తగ్గించడం కోసం భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు దేశీయ చమురు ఉత్పత్తిలో మందగమనం అతి పెద్ద అడ్డంకిగా మారింది. రవాణా, పరిశ్రమల్లో విద్యుత్ వంటి అవసరాల కోసం జీవ ఇంధనాలు, ఇతర ప్రత్యామ్నాయ ఇంధనాల కోసం ప్రభుత్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ముడి చమురు పరిశోధన & ఉత్పత్తి ఒప్పందాలను మరింత ఆకర్షణీయంగా మార్చడం, చమురు & గ్యాస్ అన్వేషణ కోసం ఎక్కువ ప్రాంతాలను తెరవడం ద్వారా దేశీయంగా ముడి ఉత్పత్తిని పెంచే ప్రయత్నాలను ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా వేగవంతం చేసింది.


దిగుమతి చేసుకునే ముడి చమురుపై అధికంగా ఆధారపడటం వల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయ చమురు ధరల అస్థిరతకు గురవుతుంది. దీంతోపాటు.. విదేశీ వాణిజ్య లోటు, విదేశీ మారక నిల్వలు, రూపాయి మారకం రేటు, ద్రవ్యోల్బణంపై ప్రభావం వంటి దుష్ప్రభావాలూ ఉంటాయి.