ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమాలు ఈ నెల 28న విజయవాడ సమీపంలోని తాడిగడపలో నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి సూపర్ స్టార్ రజనీ కాంత్ హజరు కానున్నారు. మహనీయుడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు మే 28న జరుగనున్నాయి. ఎన్టీఆర్‌ శత జయంతి సభ, ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్‌సైట్ కమిటీ నేతృత్వంలో ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలు, ఎన్టీఆర్ అసెంబ్లీ ప్రసంగాలు, పుస్తకావిష్కరణ జరుగనుంది. ఇందులో భాగంగా తాడిగడప‌లో వంద అడుగుల రోడ్‌లో సభా ప్రాంగణానికి తెలుగు దేశం నేతలు భూమి పూజ చేశారు. 
సీనీ రాజకీయ రంగాల్లో ఆయనే నెంబర్ వన్...
 ఎన్టీఆర్‌ శత జయంతి కమిటీ చైర్మన్‌ తొండెపు దశరధ జనార్ధన్ మాట్లాడుతూ ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామనిన చెప్పారు. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్‌ ఒక చరిత్ర సృష్టించారని తెలిపారు. సీనియర్ జర్నలిస్టు వెంకట నారాయణ రచించిన ఎన్టీఆర్‌ చారిత్రక ప్రసంగాలు & అసెంబ్లీ ప్రసంగాలు’’ పుస్తకం ఆవిష్కరణ చేయనున్నట్లు వివరించారు. వెబ్‌సైట్, సావనీర్ హైదరాబాద్‌లో త్వరలోనే ఆవిష్కరిస్తామని చెప్పారు. 
28న జరగబోయే సభకు చంద్రబాబుతోపాటుగా సూపర్ స్టార్ రజనీకాంత్, శాసన సభ్యుడు, ఎన్టీఆర్ వారసుడు, బాలకృష్ణ కూడా పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. నందమూరి తారకరామారావు పేరుతో ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ను నారా లోకేష్ ప్రారంభించనున్నట్లు జనార్దన్ తెలిపారు.
ఎన్టీఆర్ అంటే చరిత్ర...
ఎన్టీఆర్ అంటేనే ఒక చరిత్ర అని మాజీ పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణ అన్నారు. సినిమా, రాజకీయ రంగాల్లో ప్రత్యేక శైలి ఎన్టీఆర్ కే సొంతమన్నారు. చరిత్రలో‌ గుర్తు ఉండిపోయేలా ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారని అన్నారు. కమిటీ ఛైర్మన్ టి.డి.జనార్ధన్ ఆధ్వర్యంలో అనేక సభలు జరుపుతున్నారన్నారు. ప్రజలు కూడా ఎన్టీఆర్‌ ‌చరిత్ర గురించి ఆసక్తిగా తెలుసుకుంటున్నారని అన్నారు. నేటి తరం కూడా నందమూరి తారక రామారావు గురించి ఆసక్తిగా వినడం గొప్ప విషయమని అన్నారు.
సినీ, రాజకీయ రంగాల్లో రారాజు ఎన్టీఆర్‌: దేవినేని ఉమ 
సినీ, రాజకీయ రంగాల్లో రారాజు ఎన్టీఆర్‌ అని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు కొనియాడారు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో సీఎం అయిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావని గుర్తు చేశారు. పేదలను దృష్టిలో ఉంచుకుని అనేక సంక్షేమ పథకాలు అమలు‌ చేశారన్నారు. వంద సభలు నిర్వహించి, మే 28 శత జయంతిని గొప్పగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు, అభిమానులు, నాయకులు పాల్గొంటున్నట్లు తెలియజేశారు.
ఒకే వేదిక పై ముగ్గురు ...
నందమూరి తారక రామారావు శత జయంతి సభల్లో భాగంగా ముగ్గురు ఫేమస్ సెలబ్రిటీలు ఒకే వేదిక పై కనిపించటం సంతోషకరమని మాజీ శాసన సభ్యుడు బోడె ప్రసాద్ అన్నారు. తన నియోజకవర్గంలో ఎన్టీఆర్‌ శత జయంతి ‌వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. చంద్రబాబు, బాలకృష్ణ, రజనీకాంత్ ఒకే వేదిక మీద చూడటం కనుల విందుగా ఉంటుందన్నారు. లక్షల మంది అభిమానులు ఈ శత జయంతి ఉత్సవాల్లో భాగం అవుతున్నారని తెలిపారు. ఎన్టీఆర్‌ చరిత్ర, ఆయన గొప్పతనం గురించి అందరూ తెలుసుకోవాలని పేర్కొన్నారు.