Petrol And Diesel Prices Will Not Be Reduced: సార్వత్రిక ఎన్నికల ముందు, దేశంలో పెట్రో రేట్లను (Petro Prices) కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తుందని ఎదురు చూసిన ప్రజలకు నిరాశే మిగిలింది. ధరల తగ్గింపునకు ఇప్పట్లో అవకాశం లేదని కేంద్ర పెట్రోలియం శాఖ ఖరాఖండీగా చెప్పింది. 


గత కొన్ని నెలలుగా, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గాయి, బ్యారెల్‌కు 70-80 డాలర్ల రేంజ్‌లో ఉన్నాయి. కాబట్టి, ఇంధన ధరల తగ్గింపునకు ఇది అనుకూల సమయంగా అంతా భావించారు.


కేంద్ర ప్రభుత్వం, పెట్రోల్ & డీజిల్ ధరలను (petrol, diesel prices today) తగ్గించే ప్రయత్నంలో ఉందని కొందరు అధికార్లు చెప్పినట్లు గతంలో నేషనల్‌ మీడియాలో రిపోర్ట్స్‌ వచ్చాయి. రేట్ల తగ్గింపుపై అతి త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తుందని వార్తలు రాశాయి. రెండు ఫ్యూయల్స్‌ మీద గరిష్టంగా రూ. 4-6 రేంజ్‌లో కటింగ్స్‌ పడే అవకాశం ఉందని ఓ వర్గం; లీటర్‌కు రూ. 10 వరకు తగ్గొచ్చని మరో వర్గం చెప్పినట్లు రిపోర్ట్‌ చేశాయి. 


అప్పటి వరకు రేట్ల తగ్గింపు అవకాశం లేదు
నమ్మకమైన సమాచారం అంటూ నేషనల్‌ మీడియా రాయడం, ఆ వార్తలను లోకల్‌ మీడియా కూడా కవర్‌ చేయడంతో.. చమురు ధరలు తగ్గుతాయని దేశ ప్రజలంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ, దేశంలో పెట్రోల్‌ & డీజిల్‌ రేట్లను ఇప్పట్లో తగ్గించేది లేదని పెట్రోలియం మంత్రిత్వ శాఖ కుండ బద్ధలు కొట్టింది.


ఎర్ర సముద్రంలో ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయని, ఒడుదొడుకులు తగ్గి రేట్లు స్థిరపడే వరకు తగ్గింపు అవకాశం లేదని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి స్పష్టం చేశారు.


ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు (రష్యా-ఉక్రెయిన్‌, ఇజ్రాయిల్‌-హమాస్‌ యుద్ధం) చమురు ఉత్పత్తులు, వాటి ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని కేంద్ర మంత్రి చెప్పారు. ఎర్ర సముద్రం (Red Sea), సూయెజ్‌ కాల్వ (Suez Canal) ద్వారా 12 శాతం ఇంటర్నేషనల్‌ షిప్పింగ్‌ ట్రాఫిక్‌, 18 శాతం ఆయిల్‌, 4-8 శాతం CNG ట్రాన్స్‌పోర్ట్‌ జరుగుతోందన్నారు. 


ఎర్ర సముద్రంలో వ్యాపార నౌకలపై హౌతీ దాడులు, హౌతీ బోట్లపై యూఎస్‌ ప్రతిదాడులతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతూ, తగ్గుతూ తీవ్రస్థాయిలో మారుతున్నాయని హర్దీప్‌ సింగ్‌ పురి చెప్పారు. ఈ నేపథ్యంలో, దేశంలో తగినంత చమురును అందుబాటులో ఉంచడం, ధరలను స్థిరంగా ఉంచడమే తమ మొదటి లక్ష్యమని స్పష్టం చేశారు.


ఈ రోజు, WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 0.25 డాలర్లు పెరిగి 72.95 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌కు 0.16 డాలర్లు పెరిగి 78.41 డాలర్ల వద్ద ఉంది.


ఇంధన కంపెనీలతోనూ చర్చలు జరపలేదట
దేశంలో ఇంధనం రేట్లు తగ్గించేందుకు, ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌ (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌ (HPCL)తో చర్చలు జరిపినట్లు వచ్చిన వార్తలపైనా హర్దీప్‌ సింగ్‌ పురి స్పందించారు. రేట్‌ కటింగ్స్‌ కోసం OMCలతో ఎలాంటి చర్చలు జరపలేదన్నారు.


ఇంధన ధరలు తగ్గితే దేశ ప్రజల మీద ఆర్థిక భారం గణనీయంగా తగ్గుతుంది. మొదట రవాణా వ్యయాలు తగ్గుతాయి. ఫలితంగా ఆహార పదార్థాల ధరలు దిగి వస్తాయి. నవంబర్‌లో మూడు నెలల గరిష్ట స్థాయి 5.55%కి పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణాన్ని ‍‌(retail inflation in India) కూడా ఇది తగ్గిస్తుంది.


గత రెండు సంవత్సరాల్లో (2021 నవంబర్‌లో, 2022 మే నెలలో), కేంద్ర ప్రభుత్వం రెండు విడతలుగా ఇంధనం రేట్లను తగ్గించింది. రెండు విడతల్లో కలిపి... పెట్రోల్‌ మీద ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.13 & డీజిల్‌ మీద లీటరుకు రూ.16 చొప్పున తగ్గించింది. ఫలితంగా చమురు ధరలు దిగి వచ్చినా, ఇప్పటికీ సామాన్యుడు భరించలేని స్థాయిలోనే ఉన్నాయి.


మరో ఆసక్తికర కథనం: గోల్డెన్‌ ఛాన్స్, భారీగా పడిన పసిడి రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి