Budget 2025: బడ్జెట్ ప్రజెంటేషన్ కోసం నిర్మలమ్మ ట్యాబ్ ఎందుకు తీసుకెళ్తారు, అది ఏ బ్రాండ్?
Nirmala Sitharaman: 2021లో, ఆర్థిక మంత్రి నిర్మలమ్మ 'మేడ్ ఇన్ ఇండియా' టాబ్లెట్ను ఉపయోగించి బడ్జెట్ను సమర్పించారు. భారతదేశం డిజిటలైజేషన్ వైపు వేస్తున్న అడుగులను ఇది సూచిస్తుంది.

Union Budget 2025 Presentation With A Tablet: ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర బడ్జెట్ ప్రదర్శనలో విప్లవాత్మక మార్పులు & సరికొత్త సంప్రదాయాలు ప్రవేశపెట్టారు. నిర్మలమ్మ కంటే ముందు పని చేసిన కేంద్ర ఆర్థిక మంత్రులు, కేంద్ర బడ్జెట్ ప్రకటన కోసం పార్లమెంటుకు బ్రీఫ్కేస్ను తీసుకెళ్లారు. ఇది జంతు చర్మంతో తయారు చేసిన బ్రీఫ్కేస్ (Leather Briefcase). 2019లో, నిర్మల సీతారామన్, బ్రీఫ్కేస్కు బదులు సాంప్రదాయ 'బహి ఖాతా' (సాంప్రదాయ ఖాతా పుస్తకం)ను ఎంచుకుని బ్రీఫ్కేస్ సాంప్రదాయానికి స్వస్థి పలికారు. ఈ మార్పు సంప్రదాయం & ఆధునికత మిశ్రమాన్ని ప్రతిబింబింబించింది. 2021లో, ఆమె టాబ్లెట్ వైపు మారారు.
నిర్మల సీతారామన్, 01 ఫిబ్రవరి 2025న, వరుసగా ఎనిమిదో బడ్జెట్ను సమర్పించడానికి సిద్ధమవుతున్నారు. ఆమె పార్లమెంటుకు వెళ్లే సమయంలో, ఆమె చేతుల్లో ఉండే పౌచ్పై యావత్ దేశం దృష్టి కేంద్రీకృతం అవుతుంది. బ్రీఫ్కేస్ నుంచి ఎర్రటి వస్త్ర పౌచ్గా, ఆ తరువాత టాబ్లెట్గా మారిన పరిణామం.. భారతదేశ బడ్జెట్ ప్రజెంటేషన్లో వస్తున్న మారులను హైలైట్ చేస్తుంది.
సీతారామన్ ఎప్పుడు టాబ్లెట్కు మారారు, ఎందుకు?
2021లో, నిర్మల సీతారామన్ 'మేడ్ ఇన్ ఇండియా' టాబ్లెట్ (Made in India' tablet)ను ఉపయోగించి బడ్జెట్ సమర్పించారు. ఈ విషయం ఆనాటి ప్రధాన వార్తల్లో ఒకటిగా నిలిచింది. భారతదేశం డిజిటలైజేషన్ వైపు సాగుతోందని చెప్పడానికి గుర్తుగా, నిర్మల సీతారామన్ ట్యాబ్లెట్ను ఉపయోగించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ప్రతిపాదించిన 'డిజిటల్ ఇండియా' (Digital India) చొరవకు అనుగుణంగా ఈ మార్పు వచ్చింది. సాంకేతిక పురోగతిని స్వీకరించడానికి భారత ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో ఉన్న విషయాన్ని ఇది హైలైట్ చేసింది.
CNBCTV18 రిపోర్ట్ ప్రకారం, 2024 బడ్జెట్ ప్రజెంటేషన్ వరకు, నిర్మల సీతారామన్ ఉపయోగించిన టాబ్లెట్ను శామ్సంగ్ (Samsung) తయారు చేసింది. భారతదేశ జాతీయ చిహ్నం "నాలుగు సింహాల గుర్తు"తో అలంకరించిన ఎరుపు రంగు ఫోల్డర్లో ఈ ట్యాబ్లెట్ ఉంటుంది.
'బహి ఖాతా' లేదా టాబ్లెట్ గురించి దేశం చర్చించినప్పటికీ, ప్రాథమిక కంటెంట్ మొత్తం ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం & ఆర్థిక పత్రాల రూపంలోనే ఉంటుంది. బడ్జెట్ ప్రజెంటేషన్ సమయంలో ఆవిష్కరించే ఈ కీలకమైన పత్రాలు.. రాబోయే ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ ఆర్థిక ప్రణాళికలను, విధానాలను వివరిస్తాయి. రాబోయే సంవత్సరంలో ప్రభుత్వ పనితీరుకు రోడ్మ్యాప్లా నిలుస్తాయి.
బడ్జెట్ను ఏ సమయంలో ప్రజెంట్ చేస్తారు?
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31, 2025న ప్రారంభం అయ్యాయి. నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ఫిబ్రవరి 01న ఉదయం 11:00 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ సంవత్సరం బడ్జెట్ సెషన్ రెండు భాగాలుగా కొనసాగుతుంది. మొదటి భాగం జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు ఉంటుంది. రెండో భాగం మార్చి 10న ప్రారంభమై ఏప్రిల్ 04న ముగుస్తుంది.
మరో ఆసక్తికర కథనం: ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలోనే ఎక్కువ పన్నులు వసూలు చేస్తున్నారా?