President Droupadi Murmu | న్యూఢిల్లీ: ‘సైబర్ భద్రతలో సామర్థ్యాన్ని నిరూపించడానికి కేంద్రం నిరంతరం కృషి చేస్తోంది. డిజిటల్ మోసాలు, సైబర్ క్రైమ్, డీప్ఫేక్ లాంటివి సామాజిక, ఆర్థిక అంశాలతో పాటు దేశ భద్రతకు పొంచి ఉన్న సవాళ్లు’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఎన్టీయే ప్రభుత్వం రూ.12 వేల కోట్లు కేటాయించింది.
ఇటీవల కన్నుమూసిన మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్కు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. కుంభమేళాలో తొక్కిసలాటలో చనిపోయిన వారికి పార్లమెంట్ నివాళి అర్పిస్తోంది. రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్నాం. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళా జరిగే సమయంలో ఈ ఏడాది పార్లమెంట్ సమావేశం ప్రారంభించాం. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 3 రెట్ల వేగంతో పనిచేస్తోంది. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారనుంది.
ఇండియాలో ఏఐ మిషన్
భారత్ను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇండియాలో ఏఐ మిషన్ ప్రారంభమైంది. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రారంభించాం. డిజిటల్ ఇండియాగా దేశాన్ని తీర్చిదిద్దే ప్రక్రియ కొనసాగుతోంది. ఎంఎస్ఎంఈల కోసం క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ తీసుకొచ్చారు. ఈ బడ్జెట్లో పేదలు, మహిళలు, రైతులతో పాటు యువతకు అధిక ప్రాధాన్యత ఉండనుంది. పీఎం ఆవాస్ యోజన ద్వారా లక్షల ఇండ్లు నిర్మించి పేదలకు అందించాం. వారి సొంతింటి కలను ఎన్డీయే సర్కార్ నేర్చింది.
8వ వేతన సవరణ సంఘం ఏర్పాటు
రాజ్యాంగం అమలులోకి రాక ముందు దేశంలో అమలవుతున్న చట్టాలను కేంద్ర ప్రభుత్వం సమీక్షించి ప్రస్తుత కాలానికి తగ్గట్లుగా మార్పులు చేయనుంది. అటల్ టన్నెల్, సోన్ మార్గ్ టన్నెల్ నిర్మాణం జరిగింది. మౌలిక వసతుల అభివృద్ధిపై ఫోకస్ చేస్తున్నాం. దేశాభివృద్ధి కోసం వేగంగా నిర్ణయాలు తీసుకుంటూనే అంతర్జాతీయంగా కీలక పాత్ర పోషిస్తోంది భారత ప్రభుత్వం. ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించి 8వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేశామని’ రాష్ట్రపతి ముర్ము ప్రసంగంలో పేర్కొన్నారు.
శనివారం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పీచ్ ముగిసిన తర్వాత 2024-25 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెడతారు. ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2025-26ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఎన్డీయే 3.0 సర్కార్ ఏర్పాటయ్యాక ప్రవేశపెడుతున్న తొలి పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో అన్ని వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. వరుసగా 8వ సారి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగా నిలవనున్నారు.
Also Read: Budget 2025: కొత్త పన్ను విధానం Vs పాత పన్ను విధానం - బడ్జెట్ ముందు వీటి తేడాలు తెలుసుకోండి