Union Budget 2023:


సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి చివరి బడ్జెట్‌ ఇదే. అందుకే మౌలిక సదుపాయాలు, నిర్మాణం, తయారీ, క్యాపెక్స్‌, డిఫెన్స్‌, రైల్వేస్‌, పీఎస్‌యూ బ్యాంకులపై నిర్మలా సీతారామన్‌ ఎక్కువ ఫోకస్‌ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి ఒకటి లోపే కొన్ని కంపెనీల షేర్లు కొనిపెట్టుకోమని మోతిలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ సిద్ధార్థ్‌ ఖేమ్కా సూచిస్తున్నారు.


జేకే సిమెంట్‌ (టార్గెట్‌ ధర రూ.3490)


తాజా త్రైమాసికంలో సిమెంటు రంగం పుంజుకొంటుందని అంచనా. వార్షిక ప్రాతిపదికన 10 శాతం పెరుగుతుందని విశ్లేషిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే మౌలిక సదుపాయాలు, రియల్‌ ఎస్టేట్‌కు డిమాండ్ పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. లైమ్‌స్టోన్‌ గనుల కేటాయింపులో విధాన మార్పులు వచ్చే అవకాశం ఉంది. అలాగే జేకే సిమెంట్‌ ఎబిటా FY22-25కి 13 శాతానికి పైగా ఉంటుందని మోతీలాల్‌ ఓస్వాల్‌ అంచనా వేస్తోంది.


భారత్‌ ఫోర్జ్‌ (టార్గెట్‌ ధర రూ.1015)


కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్లు రక్షణ రంగానికి ఊతమిస్తోంది. సైనిక యంత్రాలు, వాహనాలు, ఆర్టిలరీ వంటివి రూపొందించేందుకు స్వదేశీ కంపెనీలకే ఆర్డర్లు ఇస్తోంది. దాంతో డిఫెన్స్‌  కంపెనీలకు రీరేటింగ్‌ లభించింది. ఈ బడ్జెట్‌లోనూ ప్రభుత్వం మరిన్ని కేటాయింపులు చేయనుంది. భారత సైన్యం నుంచి ఆర్టిలరీ గన్స్‌, ఇతర ఆయుధాల కోసం ఆర్డర్లు రానున్నాయి. ప్రస్తుతం గరుడ 105ఎంఎం తుపాకీని అమెరికాలో పరీక్షిస్తున్నారు. ఇవన్నీ విజయవంతమైతే రాబోయే కాలంలో స్వదేశీ డిఫెన్స్‌ కంపెనీలకు విపరీతమైన ఆర్డర్లు వస్తాయి.


కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ (టార్గెట్‌ ధర రూ.310)


రాబోయే బడ్జెట్‌లో మౌలిక సదుపాయాల రంగానికి పెద్ద పీట వేయనున్నారు. రహదారులు, హైవేలు, నీటి పారుదల, పట్టణ నీటి పారుదల నిర్వహణలో కేఎన్‌ఆర్‌ ఈపీసీ ప్రాజెక్టులు చేపడుతుంది. ప్రస్తుతం కంపెనీకి ఎలాంటి రుణాలు లేవు. అసెట్‌ బేస్‌ను పెంచుకోవడం, అన్ని ప్రాజెక్టులను యాజమాన్యం చురుకుగా పర్యవేక్షిస్తుండటంతో లాభాలు ఆశిస్తోంది. FY22-24 ఆర్థిక ఏడాదిలో 14 శాతం రాబడిని అంచనా వేస్తున్నారు.


ఎస్‌బీఐ లైఫ్‌ (టార్గెట్‌ ధర రూ.1600)


ఈ బడ్జెట్‌ సెషన్లో ప్రభుత్వం బీమా నియంత్రణ సవరణ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ షేరు మెరుగైన రాబడి అందిస్తుందని మోతీలాల్‌ అంచనా వేస్తోంది. మెరుగైన పథకాలు ప్రవేశపెట్టడం, ప్రీమియం పెరుగుదలతో వృద్ధి కనిపిస్తోంది. పోటీ కంపెనీలతో పోలిస్తే 20 శాతం వృద్ధి నమోదు చేసింది. దేశ వ్యాప్తంగా 22,000 శాఖలు ఉన్నాయి. మార్కెట్‌ వాటాను మరింత పెంచుకోనుంది.


క్యుమిన్స్‌ ఇండియా (టార్గెట్‌ ధర రూ.1775)


క్యాపిటల్‌ ఎక్స్‌పెండీచర్‌కు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో క్యుమిన్స్‌ ఇండియా షేరు పెరిగే అవకాశం ఉంది. ఈ కంపెనీ డీజిల్‌, ప్రత్యామ్నాయ ఇంధన ఇంజిన్లు, పవర్‌ జనరేటర్‌ సెట్లను ఉత్పత్తి చేస్తుంది. క్యాపెక్స్‌ సైకిల్‌ వల్ల కంపెనీ లాభపడనుంది. ఇప్పటికే ఫ్యూయెల్‌ అగ్నోస్టిక్‌ ఇంజిన్‌ వ్యవస్థ రూపకల్పన కోసం టాటా మోటార్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ-బస్‌ మార్కెట్‌ కోసం లిథియమ్‌ ఐరన్‌ పాస్ఫేట్‌ బ్యాటరీలు ఉత్పత్తి చేయాలనుకుంటోంది. కమొడిటీ ధరలూ తగ్గుతుండటం కంపెనీకి మేలు చేయనుంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.