2023-24 సంవత్సరానికి తయారు బడ్జెట్‌కు ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ బడ్జెట్‌ సుమారు  రూ.2.79 లక్షల కోట్లుగా ఉన్న బడ్జె‌ట్‌కు ఈ ఉదయం సమావేశమైన కేబినెట్‌ ఓకే చెప్పింది. దీంతో పది గంటలకు పద్దును ఆర్థికమంత్రి బుగ్గనరాజేంద్రనాథ్ రెడ్డి సభలో ప్రవేశ పెట్టనున్నారు. సాధారణ బడ్జెట్‌ను బుగ్గన ప్రవేశ పెట్టనున్నారు. వ్యవసాయ బడ్జెట్‌ను కాకాణి గోవర్దన్ రెడ్డి సభ ముందు ఉంచుతారు. 
కేబినెట్ సమావేశానికి ముందు మీడియాతో మాట్లాడిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి... అన్ని వర్గాలను ఆదుకునేలా, అభివృద్ధి చేసేలా బడ్జెట్ ఉంటుందని చెప్పారు. పేదలు, బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలకు నిధులు ఎక్కువ ఉంటాయని పేర్కొన్నారు. పారిపాలనలో కొత్తగా చేసిన మార్పుల ప్రకారమే కేటాయింపులు కూడా ఉంటాయని తెలిపారు. 


శాసనసభలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి బడ్జెట్ ప్రవేశ పెడితే... శాసన మండలిలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా బడ్జెట్‌ చదవనున్నారు.  వార్షిక బడ్జెట్ పూర్తైన వెంటనే వ్యవసాయ బడ్జెట్‌ను కాకాణి గోవర్దన్ రెడ్డి సభ ముందు ఉంచుంతారు. ఈ బడ్జెట్‌ను మండలిలో పశుసంవర్దక శాఖ మంత్రి అప్పలరాజు ప్రవేశ పెట్టనున్నారు. అంతకు ముందు బడ్జెట్‌ ప్రతులకు ప్రత్యేక పూజలు చేయించారు. తన ఛాంబర్‌లోనే అధికారుల సమక్షంలో పూజలు జరిగాయి. 


ఇప్పటికే బడ్జెట్ గురించి అధికార పార్టీ నేతలు స్పందిస్తూ.. అన్ని రంగాల అభివృద్ధిని సమ్మి­ళితం చేస్తూ ఆయా రంగాలకు బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. అమ్మ ఒడి, వైఎస్సార్‌ రైతు భరోసా, పేదల గృహాలతో పాటు వ్యవసాయం, సాగునీరు, విద్య, వైద్య రంగాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చారు. వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ పథకాలకు తగినన్ని కేటాయింపులు చేయనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ­కు బడ్జెట్‌లో తగిన కేటాయింపులు ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్‌లో ప్రత్యే­కం­గా నిధులు కేటాయింపులు చేస్తున్నారు. మహిళలు, పిల్లల కోసం ప్రత్యేకంగా కేటాయింపులు చేయనున్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ సరఫరా కోసం సబ్సిడీకి నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.


ఆర్థిక సర్వే
శాసన సభలోని సీఎం చాంబర్‌లో 2022-23 సామాజిక ఆర్థిక సర్వేను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి బుధవారం (మార్చి 15) విడుదల చేశారు. అనంతరం ప్రణాళికశాఖ కార్యదర్శి విజయ్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ ప్రగతిలో ఏపీ నంబర్‌ వన్‌ అని అన్నారు. రూ.13.17 కోట్లు జీఎస్డీపీ నమోదైందని అన్నారు. గతంతో పోల్చితే రూ.1.18 లక్షల కోట్లు జీఎస్డీపీ పెరిగిందని ఆయన తెలిపారు.


మొత్తం భారత దేశం సరాసరి కన్నా ఏపీ తలసరి ఆదాయం ఎక్కువగా ఉందని వివరించారు. సేవా రంగంలో  18.91 శాతం, వ్యవసాయంలో 13.18 శాతం, పరిశ్రమలలో 16.36 శాతం చొప్పున వృద్ధి నమోదైందని వివరించారు. 36 శాతం కంట్రిబ్యూషన్‌ వ్యవసాయం నుంచి వస్తోందని తెలిపారు. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి కనిపిస్తోందని, ఆలిండియా యావరేజ్‌ కన్నా ఏపీ తలసరి ఆదాయం ఎక్కువ అని అన్నారు. ఏపీ అభివృద్ధి 16.2 శాతం నమోదైందని అన్నారు. విద్య, ఆరోగ్య రంగాల్లో అనుహ్య అభివృద్ధి సాధించామని, శిశు మరణాలు గణనీయంగా తగ్గాయని విజయ్‌ కుమార్‌ వెల్లడించారు.