AP Budget 2024: రైతుల జీవనోపాధిని బలోపేతం చేయడానికి వ్యవసాయంలో గణనీయమైన ఉత్పత్తి సాధించి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వ సమగ్ర వ్యూహాన్ని రూపందించింది. దీనిలో భాగంగా ధరల స్థిరీకరణ నిధి, పంట భీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ మొదలైన చర్యల ద్వారా రైతులకు ఆర్థిక సహాయం లభించింది. వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకం కింద లక్షా 60 కౌలుదారులకు, 93 వేల అటవీ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు 53 లక్షల 53 వేల మంది ఖాతాల్లో 33,300 కోట్ల రూపాయలు జమ చేసింది. 


వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా ద్వారా 54 లక్షల 55 వేల మంది రైతుల ఖాతాల్లో 7, 802 కోట్ల రూపాయల బీమా అందిస్తోంది. వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాల ద్వారా 2019 నుంచి 73 లక్షల 88 వేల మంది రైతులకు 1,835 కోట్ల రూపాయలు అందించింది. 


10,778 రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతు ఇంటి వద్దే సేవలు అందిస్తోంది. 19 లక్షలకుపైగా ఉన్న వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌లకు కోతలు లేని రోజువారీ 9 గంటల నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తోంది. 2019 నుంచి ఈ పథకం ద్వారా 37,374 కోట్ల రూపాయల సబ్సిడీ అందిస్తోంది. కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు పంటలు విక్రయించే వారి కోసం 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద 22 లక్షల 85 వేల మంది రైతులకు 1,977 కోట్ల రూపాయలు అందించింది. మరో 1200 కోట్ల రూపాయలు ఈ నెలలో ఇయ్యబోతోంది. 


127కొత్త వైఎస్‌ఆర్‌ వ్యవసాయ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ద్వారా పంట కోత అనంతర మౌలిక సదుపయాలు కల్పించింది. వైఎస్‌ఆర్‌ యంత్రసేవా పథకం ద్వారా వ్యవసాయ యంత్రాలను అందిచేయడమే కాకుండా గ్రామ యువతకు డ్రోన్ పైలట్ శిక్షణ అందించారు. 


ఉద్యనవన రంగం అభివృద్ధి కోసం 17 లక్షల 27 వేల మంది రైతులకు లబ్ధి చేకూరేలా వివిధ పథకాల ద్వారా 4,363 కోట్ల రూపాయలు అందించాం. 2,356 మంది గ్రామస్థాయి ఉద్యానవన సహాయకులను నియమించింది. ంట నిల్వ కోసం 462 వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కేంద్రాలు 84 సౌర శీతల గిడ్డంగులు, 2,905 ప్యాక్ హౌస్‌లును ఏర్పాటు చేసింది. 


జగన్న పాల వెల్లువ పథకం ద్వారా రైతులకు లబ్ధి కలిగేలా అమూల్‌ సంస్థతో చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ చేశాం. దీని వల్ల ప్రత్యక్షంగా 5 వేల మందికి, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి కలుగుతోంది. వైఎస్‌ఆర్‌ పశు బీమా పథకం ద్వారా పశువులకు బీమా సౌకర్యం కల్పించాం. వైఎస్‌ఆర్‌ సంచార పశు ఆరోగ్య సేవ ద్వారా 340 సంచార పశు వైద్యశాలల సేవలను రైతలకు ఇంటి వద్దే అందిస్తున్నాం. 


వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా కింద 2 లక్షల 43 వేల మంది మత్స్యకార కుటుంబాలకు చేపల వేట నిషేధ కాలంలో 4 వేల నుంచి పది వేల వరకు  ఆర్థిక సాయం చేస్తున్నాం. 20,034 మత్స్యకారుల పడవలకు వాడే డీజిల్‌ ఆయిల్‌పై లీటర్‌కు 6 రూపాయల 3 పైసల నుంచి 9 రూపాయల సబ్సిడీ పెంచడం జరిగింది. అకాల మరణానికి గురైన వారికి ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయల పరిహారం ఇస్తున్నాం. 


అంతర్జాతీయ ప్రమాణాలతో 10 ఫిషింగ్ హార్బర్‌లు నిర్మించాం. గ్రామస్థాయిలో ఆక్వా రైతులు ఉపయోగించే పనిముట్లు పరీక్షించే సౌకర్యాలను అందించడానికి 35 సమీకృత మత్స్య సంపద ప్రయోగ శాలలు ఏర్పాటు చేసింది. 2000 ఫిష్‌ ఆంధ్రా రిటైల్‌ దుకాణాలు స్థాపించాం. 


మత్స్య సంపద ఉత్పత్తిని ప్రోత్సహించి దాని నియంత్రణ పర్యవేక్షణ కోసం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మత్స్య సంపద అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేశాం. పశ్చిమగోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన ఫిషరీ సైన్సెస్‌ విశ్వవిద్యాలయం ఏప్రిల్‌ 1, 2022 నుంచి పని చేస్తోంది.