Blackstone - Care Hospitals: తెలుగు రాష్ట్రాల్లో పాపులర్‌ హాస్పిటల్‌ చైన్‌ అయిన కేర్‌ హాస్పిటల్స్‌ యాజమాన్య పగ్గాలు మరోమారు చేతులు మారబోతున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రైవేట్ ఈక్విటీ గ్రూప్ అయిన బ్లాక్‌స్టోన్, రూ. 7,800- 8,000 కోట్లకు ఈ హైదరాబాదీ హాస్పిటల్‌ను కొనబోతోంది. కొనుగోలు చేసే రేసులో మిగిలి ఉన్న ఏకైక పోటీదారు (sole bidder) ఇదే. మన దేశంలో, అతి పెద్ద హెల్త్‌కేర్ బయింగ్స్‌లో ఒకటిగా ఈ డీల్‌ నిలవబోతోంది. టెమాసెక్‌కు చెందిన సింగపూర్ ఆధారిత హాస్పిటల్స్ ప్లాట్‌ఫామ్ షీర్స్ హెల్త్‌కేర్ (Sheares Healthcare) ఈ రేసులో చివరి వరకు పోటీ పడినా, దాని కంటే ఎక్కువ మొత్తాన్ని బ్లాక్‌ స్టోన్‌ ఆఫర్‌ చేసింది.


ఈ రెండు కంపెనీలు షార్ట్‌లిస్ట్‌లో ఉన్నా, బ్లాక్‌స్టోన్‌ను మించి ఆఫర్‌ చేయలేక షీర్స్ హెల్త్‌కేర్ వైదొలిగినట్లు తెలుస్తోంది. మొత్తం 2,400 పైగా పడకల సామర్థ్యమున్న ఈ హాస్పిటల్‌ చైన్‌ ప్రస్తుతం TPG గ్రోత్ ప్లాట్‌ఫామ్, ఎవర్‌కేర్ చేతిలో ఉంది. ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకులు రోత్‌స్‌చైల్డ్, బార్ల్కేస్‌ కలిసి అమ్మకం ప్రతిపాదన మీద TPGకి సలహాలు ఇస్తున్నాయి.


మారిన ఓనర్లు
2016 జనవరిలో కేర్‌ హాస్పిటల్స్‌లో 72 శాతం వాటాను అడ్వెంట్‌ క్యాపిటల్‌ నుంచి రూ. 2000 కోట్లకు అబ్రాజ్‌ కొనుగోలు చేసింది. అయితే, ఫండ్స్‌ మిస్‌యూజ్‌తో దుబాయికి చెందిన ఈ సంస్థ పతనమైంది. 2019లో కేర్‌ హాస్పిటల్స్‌ పగ్గాలు ఎవర్‌కేర్‌ గ్రూప్‌ చేతికి వచ్చాయి.


కొవిడ్‌-19 తర్వాత హెల్త్‌ కేర్‌ సెక్టార్‌కు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. కొవిడ్‌-19 సమయంలో వచ్చిన అతి భారీ లాభాల కారణంగా ప్రస్తుతం కేర్‌ హాస్పిటల్స్‌ ఆర్థిక పరిస్థితి కూడా బ్రహ్మాండంగా ఉంది. ఆసుపత్రి విలువ పెరిగింది. దీంతో, కేర్‌ హాస్పిటల్స్‌ నుంచి బయటపడటానికి ఇదే సరైన సమయంగా TPG భావిస్తోంది. దక్షిణ భారతదేశ హెల్త్‌ కేర్‌ సెక్టార్‌లో అడుగు పెట్టాలని అనుకుంటున్న వారికి  కేర్‌ హాస్పిటల్స్‌ సరిగ్గా సూటవుతుంది.


హెల్త్‌ కేర్ అసెట్స్‌ కోసం కొంతకాలంగా వెతుకుతున్న బ్లాక్‌స్టోన్‌కి ఇదే మొట్టమొదటి హాస్పిటల్‌ డీల్‌. అనుకున్న మొత్తానికి ఇది పూర్తయితే, 2018లో జరిగిన IHH-Fortis లావాదేవీ తర్వాత మన దేశంలో రెండో అతి పెద్ద హెల్త్‌ కేర్‌ బైఔట్‌గా ఇది నిలుస్తుంది. ఈ లావాదేవీ పూర్తయితే, బ్లాక్‌స్టోన్‌కు మొత్తం దక్షిణాసియా ఆరోగ్య సంరక్షణ మార్కెట్‌లో ప్రెజెన్స్‌ను ఇస్తుంది.


100 పడకలతో ప్రారంభమై..
1997లో, సింగిల్‌ బ్రాంచ్‌తో కేర్‌ హాస్పిటల్స్‌ ప్రారంభమైంది. అప్పుడు, డాక్టర్ బి సోమరాజు, డాక్టర్ ఎన్ కృష్ణారెడ్డి, మరికొందరు కార్డియాక్‌ స్పెషలిస్ట్‌లు (గుండె వైద్య నిపుణులు) కలిసి 100 పడకల సామర్థ్యంతో ఈ కార్డియాక్‌ ఇన్‌స్టిట్యూట్‌ను నెలకొల్పారు. ఇప్పుడు అది పెరిగి భారీ స్థాయిలో విస్తరించింది. ప్రస్తుతం, దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో 17 హెల్త్‌కేర్ ఫెసిలిటీల నెట్‌వర్క్‌గా మారింది. 2,400 పైగా పడకలతో, 30 క్లినికల్ స్పెషాలిటీలను అందిస్తోంది. భారతదేశంతో పాటు బంగ్లాదేశ్‌లోనూ హెల్త్‌ కేర్‌ బిజినెస్‌ చేస్తోంది. ఢాకాలో 1,000 పడకలతో రెండు ఆసుపత్రులు ఉన్నాయి.