Chinese Garlic Sales In India: మన దేశంలో చాలా వంటకాల్లో వెల్లుల్లి (Garlic) ఉండాల్సిందే. ముఖ్యంగా, ఇది లేకుండా నాన్‌వెజ్‌ వండరు. రోడ్‌ సైడ్‌ ఫుడ్‌ కోర్ట్‌ల నుంచి స్టార్‌ హోటళ్ల వరకు దీనికి భారీ డిమాండ్‌ ఉంది. అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను కూరలో వేస్తే, ఆ ఫ్లేవర్‌కే నోట్లో నీళ్లూరతాయి. అంతేకాదు, వెల్లుల్లిని, వెల్లుల్లి నూనెను ఔషధంగా కూడా ఉపయోగిస్తుంటారు. అయితే, వెల్లుల్లి నందు చైనా వెల్లుల్లి వేరు. అది "స్లో పాయిజన్‌"తో సమానం.


భారతదేశంలో చైనా వెల్లుల్లి దిగుమతులపై పదేళ్ల క్రితం, 2014లోనే నిషేధం విధించారు. అయిన్నప్పటికీ, అది ఇప్పటికీ ఇండియన్‌ మార్కెట్లలో కనిపిస్తోంది, వంటల్లోకి & ఒంట్లోకి చేరుతోంది. సామాన్య ప్రజలకే కాదు, చాలామంది వ్యాపారులకు కూడా దేశీయ వెల్లుల్లికి - చైనా వెల్లుల్లి మధ్య తేడా తెలీదు. ఈ అమాయకత్వం కారణంగా ప్రతిరోజూ కోట్లాది మంది ప్రజలు చైనా వెల్లుల్లిని తింటున్నారు, ఆరోగ్యాన్ని చేతులారా పాడు చేసుకుంటున్నారు.


చైనీస్ వెల్లుల్లిలో పురుగుమందుల మోతాదు అధికంగా ఉంటుంది, అందువల్ల ఆ పదార్థం ప్రజల ఆరోగ్యానికి హానికరం. చైనీస్ వెల్లుల్లిని ఎక్కువగా వాడితే క్యాన్సర్‌ వచ్చే ముప్పు కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు.. భారతీయ వెల్లుల్లిలో చాలా ప్రయోజనకరమైన పోషకాలు ఉన్నాయంటున్నారు.


మన దేశంలోకి ఎలా వస్తోంది?
కొందరు వ్యాపారులు చెప్పిన వివరాల ప్రకారం.. ఆఫ్ఘనిస్థాన్ మీదుగా చైనీస్ వెల్లుల్లిని భారత్‌లోకి అక్రమంగా తరలిస్తున్నారు. దేశీయ వెల్లుల్లి ధరలు విపరీతంగా పెరగడంతో, కొందరు వ్యాపారులు అధిక లాభాల కోసం, తక్కువ ధరకు దొరికే చైనా వెల్లుల్లిని విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు. తొలుత, ఈ దిగుమతులు నేపాల్ ద్వారా వచ్చాయి. ఈ విషయాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని ఆ మార్గాన్ని మూసివేసింది. దీంతో, అక్రమార్కులు రూట్‌ మార్చారు. చైనా నుంచి ఆఫ్ఘనిస్థాన్‌కు సరుకు పంపుతున్నారు. భారతదేశంలోకి ప్రవేశించే ముందు, ఆఫ్ఘన్‌లో పండిన వెల్లుల్లి అని లేబుల్ వేస్తున్నారు.


పెరిగిన దేశీయ వెల్లుల్లి ధరలు
"భారత ప్రభుత్వం పదేళ్ల క్రితం వెల్లుల్లి సహా చైనా నుంచి వ్యవసాయ దిగుమతులను నిషేధించింది. అయితే, దేశీయ వెల్లుల్లి సప్లై గత రెండు నెలలుగా క్షీణించింది. దానివల్ల రేటు భారీగా పెరిగింది. హోల్‌సేల్ మార్కెట్‌లో దేశీయ వెల్లుల్లి కిలోకు 350 రూపాయలకు, రిటైల్‌ మార్కెట్‌లో కిలోకు 400 రూపాయలకు పెరిగింది" - ఒక వ్యాపారి


ఈ ఏడాది వెల్లుల్లి ధరలు కిలో రూ.400 కు చేరడం ఇది రెండోసారి. మొదటిసారి జనవరిలో ఆ స్థాయికి వెళ్లాయి. అప్పుడు పంటకు మంచి రేటు వస్తుండేసరికి రైతులు పెద్ద మొత్తంలో వెల్లుల్లి విక్రయించారు. గిడ్డంగుల్లో దాచిన నిల్వలను కూడా బయటకు తీసి అమ్మేశారు. సప్లై పెరిగే సరికి ధర క్రమంగా తగ్గుముఖం పట్టింది. గిడ్డంగుల్లో నిల్వలు నిండుకోవడంతో ప్రస్తుత సరఫరా సంక్షోభం తలెత్తింది, ఇప్పుడు మళ్లీ రేట్లు పెరిగాయి. 


వెల్లుల్లిని ప్రధానంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లో సాగు చేస్తారు. కర్ణాటక, మహారాష్ట్రలో కొంత వరకు ఉత్పత్తి ఉంటుంది. ప్రపంచంలో వెల్లుల్లిని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం చైనా. 


రెండిటికీ తేడా ఏంటి?
దేశీయ వెల్లుల్లి, చైనీస్ వెల్లుల్లి మధ్య సులభంగా గుర్తించదగిన తేడాలు కనిపిస్తాయి. ఇండియన్‌ వెల్లుల్లి కంటే చైనా వెల్లుల్లి పరిమాణంలో పెద్దగా ఉంటుంది. చైనా పంట రెబ్బలు కొంచెం దూరంగా ఉంటే, ఇండియన్‌ వెల్లుల్లి రెబ్బలు ఒకదానికొకటి అతుక్కుని ఉంటాయి. అంతేకాదు, చైనీస్ వెల్లుల్లి ఘాటు తక్కువగా ఉంటుంది, దేశీయ వెల్లుల్లి చాలా ఘాటైన వాసన వస్తుంది. దేశీయ వెల్లుల్లితో పోలిస్తే చైనీస్ వెల్లుల్లి ధర 30 నుంచి 40 శాతం తక్కువ ఉంటుంది. చైనీస్ వెల్లుల్లి కంటే దేశీ వెల్లుల్లి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అయితే, చైనీస్ వెల్లుల్లిలాగే పెద్ద రెబ్బలు, తక్కువ ఘాటు ఉన్న పంట ఈశాన్య రాష్ట్రాల్లోనూ పండుతుంది.ప్రపంచంలో ఇప్పటికే కొన్ని దేశాలు చైనా వెల్లుల్ని నిషేధించినప్పటికీ, భారత్‌లాగే, ఆయా దేశాల్లోనూ దానిని దొంగచాటుగా విక్రయిస్తున్నారు. 


మరో ఆసక్తికర కథనం: మరో ప్రాణం తీసిన "పని ఒత్తిడి" - ఐదు పేజీల లేఖ రాసి బజాజ్ ఫైనాన్స్ మేనేజర్‌ ఆత్మహత్య