Apple Mumbai Store Launch: భారతదేశంలో ఆపిల్ తొలి రిటైల్ స్టోర్ ఇవాళ (మంగళవారం, 18 ఏప్రిల్‌ 2023) ముంబైలో ప్రారంభమైంది. ఆపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ (Apple CEO Tim Cook), ఉదయం 11 గంటలకు అధికారికంగా ఈ స్టోర్‌ను లాంచ్‌ చేశారు. దీని కోసమే ఆయన నిన్న ఇండియా చేరుకున్నారు. ఆపిల్‌ ముంబై స్టోర్‌ను యాపిల్‌ బీకేసీగా (Apple BKC) పిలుస్తున్నారు. ముంబయిలోని ఖరీదైన బాంద్రా కుర్లా ప్రాంతంలో ఉన్న మాల్‌లో ఈ స్టోర్‌ ఉంది.


ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, నాణ్యమైన ఆపిల్‌ ఉత్పత్తులను అమ్మే ఈ స్టోర్‌ను చాలా నిరాడంబరంగా ప్రారంభించారు. మేళతాళాలు, రిబ్బన్ కటింగ్స్‌ లాంటివేమీ పెట్టుకోలేదు. నలుపు రంగ టీ షర్ట్‌ వేసుకుని ఈ కార్యక్రమానికి వచ్చిన టిమ్‌ కుక్‌, సింపుల్‌గా బీకేసీ యాపిల్ స్టోర్‌ గేట్‌ను తెరిచి పట్టుకోవడంతో స్టోర్‌ లాంచ్‌ అయింది. అయితే, మీడియా హడావిడి బాగానే కనిపించింది. యాపిల్‌ సిబ్బంది పచ్చరంగు ఫుల్‌హ్యాండ్‌ టీ షర్ట్స్‌తో కనిపించారు. వందలాది మంది ప్రజలు, ఆపిల్ అభిమానులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ స్టోర్‌లో ఆపిల్‌ ఉత్పత్తుల అమ్మకం నేటి నుంచి ప్రారంభమైంది.


సోమవారం మధ్యాహ్నం ముంబై చేరుకున్న టిమ్‌ కుక్‌, ముకేష్ అంబానీ ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశం అయ్యారు. బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్‌తో కలిసి వడ పావ్ తిన్నారు. టాటా సన్స్ ఛైర్మన్ ఎన్‌.చంద్రశేఖరన్‌తో సహా కొందరు ప్రముఖ వ్యాపారవేత్తలు, ఇతర ప్రముఖులను కూడా ఆయన కలిశారని సమాచారం.


ఐఫోన్ తయారీ కంపెనీ ఆపిల్‌ రెండో రిటైల్‌ స్టోర్‌ కూడా ఈ నెల 20న (గురువారం) దిల్లీలో ప్రారంభం కానుంది. దిల్లీ సాకేత్ ప్రాంతంలోని హై-ఎండ్ మాల్‌లో ఏర్పాటు చేసిన ఆపిల్‌ స్టోర్‌ తలుపులు టిమ్‌ కుక్‌ అన్‌లాక్ చేస్తారు. ఈ స్టోర్‌ను యాపిల్‌ సాకేత్‌గా (Apple Saket) పిలుస్తున్నారు. 


రిటైల్ స్టోర్ అద్దె రూ. 42 లక్షలు
ముంబైలోని ఆపిల్‌ రిటైల్‌ స్టోర్‌ విస్తీర్ణం 20,806 చదరపు అడుగులు. దీనిని 133 నెలలకు లీజుకు తీసుకున్నారు. దిల్లీలో తెరవనున్న స్టోర్ దీని కంటే చిన్నది. అయితే రెండింటి లీజ్‌ ధరలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. ముంబై రిటైల్ దుకాణం అద్దె రూ. 42 లక్షలుగా తెలుస్తోంది.


US టెక్ దిగ్గజం భారతదేశంలో తన మొదటి ఆన్‌లైన్ స్టోర్‌ను 2020లోనే ప్రారంభించింది, ఆన్‌లైన్‌ ద్వారా అమ్మకాలు సాగిస్తోంది. ఆ తర్వాత త్వరలోనే రిటైల్ స్టోర్‌ను తెరుస్తారని అంతా భావించారు. అయితే.. దేశీయ అమ్మకాల్లో ఎక్కువ మొత్తాన్ని దేశీయంగా తయారు చేయని గ్లోబల్ కంపెనీలు తమ సొంత బ్రాండ్ అవుట్‌లెట్‌లను మన దేశంలో ప్రారంభించకుండా కేంద్ర ప్రభుత్వం కఠినమైన నియమాలు విధించింది. దీంతో పాటు కరోనా కూడా విజృభించింది. దీంతో ఈ రెండు స్టోర్లు చాలా కాలం పాటు పెండింగ్‌లో ఉన్నాయి, ఎట్టకేలకు ముంబయి రిటైల్‌ స్టోర్‌ ఓపెన్‌ అయింది.


ప్రధాని మోదీతో భేటీ కోసం ప్రయత్నాలు
ముంబయి, దిల్లీ స్టోర్ ప్రారంభోత్సవాల మధ్య ఉన్న గ్యాప్‌లో, ప్రధాని నరేంద్ర మోదీతో టిమ్‌ కుక్‌ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రధాని అప్పాయింట్‌మెంట్‌ కూడా అడిగారట. భారత్‌ను ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా మార్చేందుకు మోదీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది, ఈ విభాగంలోకి వచ్చే కంపెనీలను ప్రోత్సహిస్తోంది. ఆపిల్‌ తయారీ భాగస్వాములైన ఫాక్స్‌కాన్‌ (Foxconn Technology Group), పెగాట్రాన్‌ (Pegatron Corp) కోసం బిలియన్ డాలర్ల ప్రోత్సాహకాలను అందించింది.


చైనాను మించిన అసెంబ్లింగ్‌ కార్యకలాపాలు
2016లో ఆపిల్‌ CEO తొలిసారి భారత్‌కు వచ్చారు. మళ్లీ ఏడు సంవత్సరాల తర్వాత భారత్‌లో అడుగు పెట్టారు. ప్రస్తుతం, భారతదేశ ఐఫోన్‌ల విక్రయాలు ఆల్ టైమ్ హైకి చేరాయి, మన దేశం నుంచి వార్షిక ఐఫోన్ ఎగుమతి బిలియన్ డాలర్లకు చేరుకుంది. బీజింగ్‌-వాషింగ్‌టన్‌ మధ్య సంబంధాలు చెడడంతో, చైనాను మించిన అసెంబ్లింగ్‌ కార్యకలాపాలను విస్తరించేందుకు ఆపిల్‌ కంపెనీ భారత్‌ వైపు చూస్తోంది.