Bharti Airtel -Reliance Jio Tariffs Hike: మొబైల్‌ ఫోన్‌ వినియోగదార్లకు వరుసగా రెండు షాక్‌లు తగిలాయి. ప్లాన్‌ ధరలు పెంచుతూ రిలయన్స్‌ జియో ప్రకటించిన వెంటనే, భారతి ఎయిర్‌టెల్ కూడా రేట్లను పెంచింది. ఎయిర్‌టెల్‌ సిమ్‌ వినియోగించాలంటే యూజర్లు ఇకపై 10 శాతం నుంచి 21 శాతం ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాలి.

  


జులై 03 నుంచి కొత్త రేట్లు అమలు         
పెరిగిన భారతి ఎయిర్‌టెల్‌ టారిఫ్‌లు జులై 03, 2024 నుంచి అమలులోకి వస్తాయి. ఆ తేదీ నుంచి పోస్ట్‌ పెయిడ్ & ప్రి-పెయిడ్ ప్లాన్ల రేట్లు పెరుగుతాయి. ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు ప్రస్తుతం ఉన్న రేట్లు జులై 02వ తేదీ వరకు వర్తిస్తాయి.


భారతదేశంలోని టెలికాం కంపెనీలు ఆర్థికంగా బలంగా ఉండాలంటే "ప్రతి వినియోగదారు నుంచి వచ్చే సగటు ఆదాయం" (ARPU) రూ. 300 పైగా ఉండాలని భారతి ఎయిర్‌టెల్ స్టాక్ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లకు తెలిపింది. ARPUనకు తగ్గట్లుగా వ్యాపార నమూనా ఉండాలని వెల్లడించింది. ARPU రూ. 300 దాటితే... నెట్‌వర్క్ టెక్నాలజీ & స్పెక్ట్రమ్‌ కోసం పెద్ద మొత్తంలో అవసరమయ్యే పెట్టుబడులు అందుబాటులోకి వస్తాయని, మూలధనంపై సాధారణ రాబడిని పొందగమని తాము నమ్ముతున్నట్లు ఎక్సేంజ్‌ పైలింగ్‌లో భారతి ఎయిర్‌టెల్‌ పేర్కొంది. సామాన్య ప్రజల బడ్జెట్‌పై ఎలాంటి భారం లేకుండా, ఎంట్రీ-లెవల్ ప్లాన్‌ రేట్లను చాలా తక్కువ మొత్తంలో (రోజుకు 70 పైసల కంటే తక్కువ) పెంచినట్లు వెల్లడించింది.


నిన్న ప్లాన్‌ రేట్లు పెంచిన రిలయన్స్ జియో          
గురువారం, రిలయన్స్ జియో కూడా తన మొబైల్ ప్లాన్‌ రేట్లను 12 శాతం నుంచి 27 వరకు పెంచింది. జియో కొత్త టారిఫ్‌లు కూడా జులై 03, 2024 నుంచి అమల్లోకి వస్తాయి. జులై 02వ తేదీ వరకు ప్రస్తుత రేట్లే అమల్లో ఉంటాయి. రిలయన్స్‌ జియో... తన నెలవారీ (28 రోజులు) ప్లాన్‌లు, 2 నెలల ప్లాన్లు (56 రోజులు), 3 నెలల ప్లాన్లు (84 రోజులు), వార్షిక ప్లాన్ల (335 & 336 రోజులు) మొత్తాన్ని పెంచింది. 


28 రోజుల ప్లాన్‌ ధరలను 27 శాతం వరకు, 84 రోజుల ప్లాన్లను 20 శాతం వరకు రిలయన్స్‌ జియో పెంచింది. డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లు, పోస్ట్ పెయిడ్ టారిఫ్‌ రేట్లను సైతం జియో పెంచింది. దీంతో... కొత్త ప్లాన్లు కనిష్టంగా రూ. 189 నుంచి గరిష్టంగా రూ. 3,599 వరకు చేరాయి. ప్రస్తుతం ఇవి కనిష్టంగా రూ. 155 - గరిష్టంగా రూ. 2,999 మధ్యలో ఉన్నాయి. జియో యాడ్‌-ఆన్‌ ప్లాన్ల కొత్త ధరలు కనిష్టంగా రూ. 29 నుంచి గరిష్టంగా రూ. 69 వరకు ఉన్నాయి. 


పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్ల విషయానికి వస్తే... ప్రస్తుతం రూ. 299 ప్లాన్‌ జులై 03 నుంచి రూ. 349 అవుతుంది. ప్రస్తుతం రూ. 399గా ఉన్న ప్లాన్‌ కోసం జులై 03 నుంచి రూ. 449 చెల్లించాల్సి వస్తుంది.


వాస్తవానికి, టెలికాం కంపెనీలు ఈ ఏడాది ప్రారంభంలోనే టారిఫ్‌ రేట్లు పెంచాల్సి ఉంది. అయితే, లోక్‌సభ ఎన్నికలు ముగిసే వరకు ఆగాయి.


మరో ఆసక్తికర కథనం: భారీగా పెరిగిన జియో రీఛార్జ్ ప్లాన్స్ ధరలు, ఎంతో తెలిస్తే గుండె గుభేల్!