Adani Group: గురువారం (02 మార్చి 2023), అదానీ గ్రూప్‌ కంపెనీల భారీ డీల్స్‌ (block deals) జరిగాయి. గ్రూప్‌లోని నాలుగు కంపెనీల షేర్లను అదానీ గ్రూప్‌ సెకండరీ మార్కెట్‌లో విక్రయించింది. బ్లాక్ డీల్స్‌ జరిగిన అదానీ గ్రూప్ నాలుగు కంపెనీలు -  అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ (Adani Ports and Special Economic Zone), అదానీ గ్రీన్ ఎనర్జీ (Adani Green Energy), అదానీ ట్రాన్స్‌మిషన్ ( Adani Transmission), ఫ్లాగ్‌షిప్‌ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ (Adani Enterprises).


ఈ 4 కంపెనీల్లో షేర్లను విక్రయించడం ద్వారా మొత్తం రూ. 15,446 కోట్లను ‍‌(1.87 బిలియన్ డాలర్లు) అదానీ గ్రూప్‌ సమీకరించింది. ఈ లావాదేవీలు వరుస బ్లాక్ డీల్‌ల ద్వారా జరిగాయి. SB అదానీ ఫ్యామిలీ ట్రస్ట్ ఈ షేర్లను అమ్మేసింది. అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ GQG పార్ట్‌నర్స్‌ (ఇది ఒక FII) కైవసం చేసుకుంది.  విక్రయించింది.


అమ్మకం వివరాలు
ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం... అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్ క్యాపిటల్‌లో 3.39% లేదా 38.7 మిలియన్ షేర్లను GQG పార్ట్‌నర్స్‌ కైవసం చేసుకుంది. ఒక్కో షేరును రూ. 1,410.86 చొప్పున $660 మిలియన్ల విలువైన (రూ. 5,460 కోట్లు) వాటాను కొనుగోలు చేసింది. 


అదానీ పోర్ట్స్‌లో, 88.6 మిలియన్ షేర్లు లేదా 4.1% వాటాను కొనుగోలు GQG పార్ట్‌నర్స్‌ చేసింది. ఇందుకోసం $640 మిలియన్లు (రూ. 5,282 కోట్లు) ఖర్చు చేసింది. 


అదానీ ట్రాన్స్‌మిషన్‌లో 2.55% వాటాను $230 మిలియన్లకు (రూ. 1,898 కోట్లు) కొనుగోలు చేసింది.


అదానీ గ్రీన్ ఎనర్జీలో 3.51% వాటాను $340 మిలియన్లకు (రూ. 2,806 కోట్లు) దక్కించుకుంది.


భారతదేశపు ప్రత్యేక మౌలిక సదుపాయాల అభివృద్ధిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా GQG పార్ట్‌నర్స్‌ ఒక వ్యూహత్మక పెట్టుబడిదారుగా మారిందని, బ్లాక్‌ డీల్స్‌ తర్వాత గ్రూప్ ఒక ప్రకటన విడుదల చేసింది.


అప్పులు తీర్చడానికేనా?
ఈ లావాదేవీల వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని అదానీ గ్రూప్‌ అధికారికంగా వెల్లడించలేదు. రుణాల్లో కొంతమేర తిరిగి చెల్లించడానికి ఈ నిధులను అదానీ గ్రూప్‌ ఉపయోగించుకోవచ్చని విశ్వసనీయ సమాచారం. 


హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఆరోపణల తర్వాత కోల్పోయిన పెట్టుబడిదార్ల విశ్వాసాన్ని తిరిగి పొందడానికి అదానీ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా, కొన్ని రుణాలను వాటి గడువుకు ముందుగానే చెల్లించడానికి సిద్ధపడింది. $690 మిలియన్ల నుంచి $790 మిలియన్ల వరకు విలువైన షేర్-బ్యాక్డ్ లోన్‌లను మార్చి చివరి నాటికల్లా ముందస్తుగానే చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు గత నెల రోజులుగా చెబుతోంది. 


గత సంవత్సరం ACC, అంబుజా సిమెంట్స్ కొనుగోలు కోసం తీసుకున్న $4.5 బిలియన్ల అప్పులో, ఇప్పుడు వచ్చిన డబ్బు నుంచి $500 మిలియన్ రుణాన్ని తిరిగి చెల్లించవచ్చని తెలుస్తోంది. ఈ రుణాన్ని ఈ నెలలోనే తిరిగి చెల్లించాల్సి ఉంది.


బ్లాక్‌ డీల్స్‌ కారణంగా అదానీ గ్రూప్‌లోని అన్ని షేర్లలో గురువారం భారీ పెరుగుదల కనిపించింది. అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ విల్మార్, అదానీ పవర్ 5 శాతం చొప్పున లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్ కూడా 3.45 శాతం లాభంతో ముగిసింది. అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.7.86 లక్షల కోట్లకు చేరుకుంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.