Adani Group Bonds: ఈ ఏడాది జనవరి నుంచి అదానీ గ్రూప్‌నకు నిరంతరం సవాళ్లు ఎదురయ్యాయి. జనవరి 24న హిండెన్‌బర్గ్ నివేదిక వచ్చిన తర్వాత జరిగిన నష్టాల నుంచి అదానీ గ్రూప్ ఇంకా కోలుకోలేదు. అయితే, నష్టాన్ని పూడ్చుకోవడానికి అనేక చర్యలు తీసుకుంది, అవి నిరంతర క్షీణతకు అడ్డుకట్ట వేయగలిగాయి. అదే పంథా కొనసాగిస్తూ, తాకట్టు పెట్టిన షేర్లలో ఎక్కువ భాగాన్ని రీడీమ్ చేసింది అదానీ గ్రూప్‌.


జాతీయ మీడియా నివేదిక ప్రకారం... 2023 మార్చి త్రైమాసికంలో, అదానీ గ్రూప్ కనీసం $3 బిలియన్ల (₹2,46,03,45,00,000) విలువైన బాండ్ల బకాయిలను చెల్లించింది. తద్వారా, తాకట్టులో ఉన్న గ్రూప్ షేర్ల వాటాను బాగా తగ్గించింది. ఇదే కాకుండా, మూడు దేశీయ మ్యూచువల్ ఫండ్‌ల బకాయిలను కూడా అదానీ గ్రూప్‌ సెటిల్ చేసిందని తెలుస్తోంది.


అదానీకి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది?
అమెరికాకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ GQG పార్టనర్స్ నుంచి అదానీ గ్రూప్‌లోకి $1.88 బిలియన్ల పెట్టుబడులు వచ్చాయి. దీనికి అదనంగా $1 బిలియన్లను ప్రమోటర్‌ గ్రూప్‌ నుంచి సేకరించింది. గడువుకు ముందే బాండ్లకు చెల్లించడం కోసం ఈ మొత్తాన్ని ఉపయోగించుకుని, తాకట్టు పెట్టిన షేర్లను విడిపించుకుందని సమాచారం.


ఏయే కంపెనీల షేర్లకు విడుదల?
నాలుగు గ్రూప్ కంపెనీలైన అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, అదానీ పోర్ట్స్ అండ్‌ సెజ్, అదానీ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌లో ప్రమోటర్లు తాకట్టు పెట్టిన షేర్లను విడిపించుకోవడానికి $2.54 బిలియన్లు వెచ్చించినట్లు అదానీ గ్రూప్ గత వారం ఫైలింగ్‌లో స్టాక్ మార్కెట్‌లకు తెలిపింది. 


ప్రమోటర్ల తాకట్టు పెట్టిన షేర్లను రీడీమ్ చేయడానికి ఒక త్రైమాసికంలో ఒక భారతీయ వ్యాపార సమూహం చేసిన అతి పెద్ద చెల్లింపు ఇదేనని మార్కెట్‌ చెప్పుకుంటోంది. హిండెన్‌బర్గ్‌ నివేదిక తర్వాత సమస్యల్లో చిక్కుకున్న అదానీ గ్రూప్, తన వ్యాపార వ్యూహంలో భారీ మార్పు చేసింది. గ్రూపు విస్తరణ ప్రణాళికలపైనే దృష్టి పెట్టకుండా, అప్పులు తగ్గించుకునేందుకు కూడా ప్రాధాన్యత ఇస్తోంది.


ఈ మ్యూచువల్ ఫండ్‌లకు కూడా చెల్లింపు
మార్చి త్రైమాసికంలో బాండ్లతో పాటు కమర్షియల్‌ పేపర్ల బకాయిలను కూడా అదానీ గ్రూప్ చెల్లించింది. వార్తల ప్రకారం.. అదానీ గ్రూప్ కనీసం రూ. 3,650 కోట్లను కమర్షియల్ పేపర్ల కోసం చెల్లించింది. ఈ వాణిజ్య పత్రాలను మూడు దేశీయ మ్యూచువల్ ఫండ్‌లకు గతంలో విక్రయించింది. ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్‌కు అత్యధికంగా రూ. 2,750 కోట్లు, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్‌కు రూ. 500 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్‌కు రూ. 450 కోట్లను అదానీ గ్రూప్‌ చెల్లించింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.