Aadhaar Card Inactivation: ప్రస్తుత కాలంలో ఆధార్ కార్డ్ అత్యంత ముఖ్యమైన వ్యక్తిగత గుర్తింపు రుజువు పత్రంగా మారింది. ప్రభుత్వ పథకాల లబ్ధి, ప్రయాణం, పాఠశాల & కళాశాలలో ప్రవేశం, ఉద్యోగాల్లో చేరడం, బ్యాంక్ ఖాతా తెరవడం సహా ఏ ముఖ్యమైన పనైనా ఆధార్ కార్డు లేకుండా చేయలేం. 


ఆధార్ కార్డును జారీ చేసే సంస్థ 'యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా' (UIDAI) చెప్పిన సమాచారం  ప్రకారం, దేశంలోని దాదాపు అందరు పెద్ద వయసు వ్యక్తులకు (వయోజనులు) ఆధార్ నంబర్లు జెనరేట్‌ అయ్యాయి, వాళ్లకు ఆధార్‌ కార్డులు జారీ అయ్యాయి. అయితే, ఒక వ్యక్తి చనిపోతే అతని ఆధార్‌ ఏమవుతుంది, దానిని డిసేబుల్ చేయవచ్చా?


ఆధార్‌ను డీయాక్టివేట్ చేయవచ్చా?        
మరణించిన వ్యక్తి ఆధార్‌ను నిష్క్రియం ‍(డీయాక్టివేషన్‌) చేసే సదుపాయాన్ని ఉడాయ్‌ (UIDAI) ఇప్పటి వరకు కల్పించలేదు. అయితే, ప్రభుత్వం ఇప్పుడు ఆ అంశాన్ని పరిశీలిస్తోంది. IANS నివేదిక ప్రకారం... మరణించిన వారి ఆధార్‌ను డీయాక్టివేట్ చేసే ప్రక్రియపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. చనిపోయిన వ్యక్తుల ఆధార్ నంబర్‌ దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ఆధార్‌ను లాక్ చేసుకునే (Aadhaar Lock Facility) సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది.                               


నిబంధనల్లో మార్పుల ద్వారా చేయవచ్చు                                  
'రిజిస్ట్రార్ జనరల్ అండ్‌ సెన్సస్‌ కమిషనర్‌ ఆఫ్ ఇండియా' (Registrar General and Census Commissioner of India) కార్యాలయం, ఈ విషయం మీద ఉడాయ్‌ని కొన్ని సూచనలను కోరింది. జనన & మరణాల నమోదు చట్టం-1969 లోని నియమాలను మార్చడం ద్వారా, మరణించిన వ్యక్తికి చెందిన ఆధార్‌ నంబర్‌ను నిష్క్రియం చేసే మార్గం ఉంది. ఇందుకోసం, 'రిజిస్ట్రార్ జనరల్ అండ్‌ సెన్సస్‌ కమిషనర్‌ ఆఫ్ ఇండియా' కార్యాలయం మరణ ధృవీకరణ పత్రాన్ని జారీ చేయాలి. తద్వారా, మరణించిన వ్యక్తి ఆధార్‌ను రద్దు చేయడంలో అతని కుటుంబ సభ్యులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు. మరణ ధ్రువీకరణ పత్రం తయారు చేసే సమయంలోనే మృతుడి ఆధార్ కార్డు వివరాలను కుటుంబ సభ్యులు అందించాల్సి ఉంటుంది.                       


శిశువు పుట్టిన వెంటనే ఆధార్ నంబర్‌ ఇచ్చే సదుపాయాన్ని ఇటీవలే UIDAI ప్రారంభించింది. కాబట్టి, మరణించిన వ్యక్తి ఆధార్‌ను డీయాక్టివేట్ చేసే ఆప్షన్‌ను కూడా తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. శిశువు పుట్టిన వెంటనే ఆధార్‌ నంబర్‌ తీసుకోవాలంటే, దాని కోసం శిశువు చిత్రం, చిరునామా మాత్రం ఉంటే చాలు, వేలిముద్రలు & ఐరిస్‌ అవసరం లేదు. పిల్లలకు ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత వేలిముద్రలను ఆధార్‌ కార్డ్‌లో అప్‌డేట్‌ చేస్తారు.