క్లారిటీ ప్లీజ్..!
అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.. ఈ కొత్త సంవత్సరం.. మీ కలలు నెరవేరాలని, ఆశలు తీరాలని, ఆకాంక్షలు ఫ్రతిఫలించాలని ఏబీపీ దేశం కోరుకుంటోంది. తెలుగునేలపై ఏబీపీ అడుగుపెట్టి ఐదునెలలు గడిచింది. ఈ ఐదు నెలల కాలంలో తెలుగు ప్రజల అభిరుచులు, ఆలోచనలు, ఆకాంక్షలకు అద్దం పట్టేలా కార్యక్రమాలను.. వార్తలను వీక్షకులకు అంది‌వ్వడానికి ప్రయత్నించాం. ఇంకా మెరుగ్గా ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం.  


"దేశం అడుగుతోంది.." కార్యక్రమం ఫార్మాట్ మీకు తెలుసు.. ప్రజల తరపున ప్రజా ప్రభుత్వాన్ని, వ్యక్తులను ప్రశ్నించే ప్రోగ్రామ్ ఇది. కొత్త సంవత్సరం అనగానే ప్రతి ఒక్కరూ రిజల్యూషన్లు అనుకుంటుంటారు. ప్రజల రిజల్యూషన్లు మనం చెప్పలేం కాబట్టి.. వారి కోరికలు, ఆశలు ఏంటి.. ? ఏ విషయాల్లో భంగ పడుతున్నారు.. అనుమానపడుతున్నారు, అవమానపడుతున్నారు.. ఇవన్నీ ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలకు చాలా విషయాల్లో కన్ఫ్యూజన్, వారి బాధలను తీర్చాల్సినది ప్రభుత్వాలే కాబట్టి.. ఇందులోని టాపిక్స్ ప్రభుత్వాలను ఉద్దేశించే ఉంటాయ్.. 


2021... మరో కరోనా సంవత్సరంగా ముగిసింది. సెకండ్‌ వేవ్ గుప్పిట్లో చిక్కుకుని దేశమంతా భీతిల్లిపోయిన దృశ్యాలు మన మనసుల్లో చెదరలేదు. ఎక్కడికక్కడ రోదనలు, వేదనలు, దహనాలు... దహించుకుపోయే వాస్తవాలివి. మన ప్రజారోగ్య వ్యవస్థ డొల్లతనాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన ఘటనలు అవి. కరోనా ఫస్ట్ వేవ్ ముగియగానే పండుగ కాదని జాగ్రత్తలు తీసుకోని సమాజాన్ని, జాగృతం చేయని ప్రభుత్వాన్ని సెకండ్‌వేవ్ ఎన్ని ఇబ్బందులకు గురి చేసిందో చూశాం. 


మళ్లీ అదే కథ.. ఇప్పుడు ఒమిక్రాన్ రూపంలో కరోనా థర్డ్ వేవ్ ముంగిట ఉన్నాం. ఇప్పుడైతే ప్రభుత్వం అంతా రెడీ అంటోంది. అయినా ఏదో మూల అందరికీ అనుమానం ఉంటుంది. అసలు టైమ్ వచ్చాక ఆక్సిజన్ సిలిండర్ దొరకదు. ఆసుపత్రిలో బెడ్డు ఉండదు. ఈ ప్రజలు కోరుకుంటోంది వైద్యం, కాస్త భరోసాని మాత్రమే. పొద్దున ప్రజలతో భారీ ర్యాలీలు నిర్వహించి.. రాత్రికి జాగ్రత్తగా ఉండాలంటూ జాతినుద్దేశించి ప్రసంగిస్తుంటే ప్రజలు ఏమనుకుంటారు.. ? భయం లేనిది ప్రభుత్వానికా.. ప్రజలకా ? అనుకుంటారా లేదా.. మరి కేంద్రం థర్డ్ వేవ్‌పై భరోసా ఇవ్వగలుగుతుందా.. ఒమిక్రాన్‌‌ను ఏ మేరకు ఆపగలుగుతుందో ?


వ్యవసాయ చట్టాలు...
వ్యవసాయ చట్టాలపై రైతులోకం ఏవిధంగా రగిలిపోయిందో అందరం చూశాం. ఏడాది పాటు అలుపెరగని రైతుల పోరాటఫలం ఆ సాగు చట్టాల రద్దు. ప్రస్తుతానికి చట్టాలు రద్దయితే చేశారు. కానీ.. ఏవో అనుమానాలు. యూపీ ఎన్నికల కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ స్టంట్ అంటే కాదనలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. దానిని బలపరిచేలా ప్రభుత్వం వ్యాఖ్యలు సైతం ఉన్నాయి. రైతు చట్టాల కథ ముగిసిపోలేదని, మళ్లీ ఇంకో రూపంలో ముందుకొస్తామని వ్యవసాయమంత్రి తోమర్ మళ్లీ ప్రకటించారు. దాని ఉద్దేశ్యం మరోసారి రైతుల జీవితాలతో చెలగాటం ఆడటమేనా..?  క్లారిటీ ప్లీజ్‌..


20 లక్షల కోట్ల ప్యాకేజీ..
కరోనా వేళ 20లక్షల కోట్ల ప్యాకేజీ అన్నారు. నేరుగా ఎవరికీ బెనిఫిట్‌ రాలేదు. ఈ చట్రంలో అట్టడుగున ఉన్న పేదవాడి నుంచి ఆ పైన ఉన్న మధ్యతరగతి, చిన్న , కుటీర పరిశ్రమలు ఏవీ కూడా తమకు లాభం జరిగిందని చెప్పలేదు. మరి డబ్బులు ఏమయ్యాయి..? ఎక్కడొచ్చింది బెనిఫిట్‌..? ఇవి కాదన్నట్లు మళ్లీ జనాల మీద బాదుడే బాదుడు. ఉచిత విద్యుత్ పీకేసేలా రాష్ట్రాలకు స్క్రూలు బిగిస్తున్నారు. ఎక్కడా చిన్న సందు లేకుండా ప్రజలు ఆర్డర్ చేసుకునే ఆహారం మీద జీఎస్‌టీలు వేస్తున్నారు. పెట్రోలు మీద లక్షల కోట్లు బాదేస్తారు. జనాల బెనిఫిట్‌కు పైసా కూడా ఇవ్వరు. 50-60 లు పెంచేసి 5-10 తగ్గించి పండుగ చేసుకోండి అంటారు. జనాలు నిజంగానే పండుగ చేసుకుంటున్నారా.. ప్రధాని నరేంద్ర మోదీ గారూ అంతర్జాతీయంగా ఎక్కువ రేటున్నప్పుడు పెట్రోలు తక్కువ రేటుకు వచ్చేది. ఇప్పుడు అంతర్జాతీయంగా తగ్గినా భారత్‌లో రేట్లు పెరుగుతున్నాయి. ఆ లెక్కన ఈ ప్రభుత్వం పెంచింది రెట్టింపు కన్నా ఎక్కువ. ముడి చమురు ధరలు గతం కన్నా తగ్గుతుండగా మరి పెట్రో ధరలు ఎందుకు తగ్గించరు.. క్లారిటీ ప్లీజ్‌...


అక్కడ అలా.. ఇక్కడ మరోలా!
కేంద్రంలో అలా ఉంటే.. రాష్ట్రాల్లో పరిస్థితులు మరోలా ఉన్నాయి. ఏపీలో పరిస్థితి చిందరవందర గందరగోళంలా ఉంది. అక్కడన్నీ Extreemeగా ఉంటాయి. మద్యపాన నిషేధం కోసం మద్యం విక్రయిస్తారు. ఖర్చులు తగ్గించడం కోసం శాసనమండలి రద్దు చేస్తుంటారు. మళ్లీ బుద్దిపుట్టినప్పుడు.. అంటే మెజార్టీ రాగానే లేకపోతే రెండు మూడు నెలలకే మనసు మారుతుంది. ప్రభువు మనసెరిగి మసులుకోవడం ఎలాగో చేతకాక, ఆ తర్వాత ఉన్న సలహాసంఘం, అధికార గణం, సైన్యం అంతా కన్ఫ్యూజన్‌లోనే ఉంటుంది. రాజధాని ఏదో తెలీని ఏపీ ప్రజలు. ఏ నిర్ణయం ఎంతకాలమో అధికారులకు తెలియదు. తర్వాత ఏంటో చెప్పని ప్రభుత్వం. ఇలా అంతా గజిబిజిగానే ఉంటుంది. క్లారిటీ ఎప్పుడోస్తుందో..


రాజధానిపై రగడ.. 
రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీకి రాజధానిగా అమరావతిని ఖరారు చేశారు. ఎన్నికల ముందు వరకూ అదే రాజధాని అన్న ఈ ప్రభుత్వం ఆ తర్వాత మనసు మార్చుకుంది. మూడు రాజధానులను మనవాడాలనుకుంది. కానీ.. అది ఏంగేజ్‌మెంట్ దశలోనే ఆగిపోయాక, మళ్లీ మొదటి నుంచి మొదలుపెడదాం అంటోంది. ఇంకోవైపు అమరావతిలో పనులు మొదలయ్యాయి. మళ్లీ  మెరుగైన, నాణ్యమైన చట్టం అంటూ కొత్త సంగతి చెప్పింది. అది ఎప్పుడు నెలలోనా, ఏడాదిలోనా, ఎప్పటికీనా.. అప్పటివరకూ ఈ రాజధానిపై కన్ఫ్యూజన్ ఉండాల్సిందేనా.. మూడు రాజధానులు అన్నదే ప్రభుత్వ ఉద్ధేశ్యం  కావొచ్చు. కానీ ప్రభుత్వ చర్యలు ఇంకో రకంగా ఉంటున్నాయి. అందుకే ఈ కన్ఫ్యూజన్.. దీనిపై క్లారిటీ ప్లీజ్..!


మద్యపాన నిషేధం.. 
మద్య నిషేధం అన్నది ప్రభుత్వ విధానం. కానీ మద్యం ఆదాయం సరాసరి పాతికవేల కోట్లు. సేల్స్ పెరగడం ఒక్కటే కాదు. రేట్లు కూడా ఏపీలో టాప్‌లోనే ఉన్నాయ్‌. మొన్నటిదాకా అయితే ఓన్ బ్రాండ్లు మాత్రమే ఉండేవి. ఓన్‌ అంటే ఏపీలో తయారయ్యేవని అర్థం. ఇప్పుడు ప్రీమియం బ్రాండ్లకు పర్మిషన్ ఇచ్చారు. బంపర్‌ ఆఫర్‌గా రేట్లు కాస్త తగ్గించారు. మొదట మద్యాన్ని తగ్గించడానికి రేట్లు పెంచాం అన్నారు. ఇప్పుడు రేట్లు ఎక్కువున్నాయి కాబట్టి స్మగ్లింగు అవుతోంది అంటున్నారు. పైగా నాటుసారా, గంజాయికి అలవాటు పడ్డారు అని సమర్థింపులు ఉన్నాయి. సేల్స్ పెరిగింది ఎందుకని అడిగితే పెరుగుట విరుగుట కోరకే అనే పాతసామెతలు చెబుతున్నారు. కానీ జనాలు ఏ సామెతలు వాడుతున్నారో మీకు తెలుసా? వ్యవసాయానికి మీటర్లు లేవు అంటారు. మళ్లీ కేంద్రం అడుగుతోంది అంటారు. జనాల ఆస్తిని జనాలకు ఇవ్వడానికే పథకం పెడతారు. అన్నీ ఫ్రీగా ఇస్తామంటారు. చివరికి డబ్బులు కట్టాలంటారు. పబ్లిక్‌ బాగా ఇబ్బంది పడే స్కూలు ఫీజులు , పెట్రో రేట్లు, కూరగాయలు, ఇసుక, సిమెంట్, రేట్లు మాత్రం తగ్గించరు. కానీ వాళ్లు అడగని సినిమా రేట్ల వెంట పడతారు. అది కూడా హేతుబద్ధంగా లేకపోవడంతో బోల్తా పడే పరిస్థితి. ఒక్కసారి తగ్గించాక మళ్లీ కమిటీ వేస్తున్నారంటే.. సరిగ్గా లేదనే అర్థం వస్తోంది. ఏపీలోనే బాగా తగ్గించేసి థియేటర్ వాళ్లని చిరు ఉద్యోగులను ఇబ్బంది పెడతారు. తెలంగాణలోనేమో రేట్లు పెంచేసి జనాల జేబులకు చిల్లుపెడతారు. ఏం చేస్తున్నారు.. ? ఏంటీ కన్ఫ్యూజన్.. ఏది బెటర్. 


రైతన్న కష్టాలకు ఎవరు కారణం.. 
రాజులు రాజులు కొట్లాడుకుంటే నడుమ వందలాది బంట్లు చనిపోయినట్లుగా ప్రభుత్వాలు, పార్టీల మధ్య కొట్లాటలో తెలంగాణ రైతు నలిగిపోతున్నాడు. కాళేశ్వరం తెచ్చాం, కోటి ఏకరాల మాగాణం అని చెప్పిన ఆ ప్రభుత్వమే ఇవాళ వరి వేస్తే ఉరే సరి అంటోంది. యాసంగి పంటను కొంటారో లేదో తర్వాత ఇప్పుడు రోడ్లమీద ఉన్న వడ్లను కొనేటోడు లేకుండా పోయాడు. రైతులు ధాన్యం మీద ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు చూశాం. దీనికి కారణం ఎవరు.. క్లారిటీ ప్లీజ్‌...!


సరే ప్రభుత్వాలు ఇలాగే ఉన్నాయిలే కాస్తన్నా రిలాక్స్ అవుదాం అనుకునే స్పోర్ట్స్ , సినిమా రంగాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇంతవరకూ విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి ఎందుకు తీసేశారో స్పష్టమైన ప్రకటన రాలేదు. దక్షిణాఫ్రికా టూర్ బయలుదేరే ముందు కోహ్లీ ఒకటి చెప్పాడు. అది వాస్తవం కాదంటూ, బీసీసీఐ ఇంకోటి చెబుతోంది. ఎవరు చెప్పేది నిజమో కూడా తెలీదు.. బీసీసీఐ క్లారిటీ ప్లీజ్‌...!


ఫ్యాన్స్‌కు మరో‘సారీ’..
రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ బడ్జెట్ సినిమా RRR మళ్లీ వాయిదా పడింది. మూడు సంవత్సరాలు రిలీజ్ డేట్ వాయిదా పడిన సినిమా ఇది. 2020లో తొలిసారి వాయిదా పడిన ఆర్ఆర్ఆర్ ఈ 7న విడుదల కావాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా విడుదల చేయడం లేదని ఆర్ఆర్ఆర్ యూనిట్ ప్రకటించింది. ఇంకో వారంలో సినిమా వస్తుందనుకుంటే.. మళ్లీ మరోసారి వాయిదా పడింది.. ! ఎప‌్పటికో తెలీదు.. అంతా కన్ఫ్యూజన్ .. 


వినోదం ఆహ్లాదం కూడా మనిషికి అవసరమైనవే కాబట్టి చివరి రెండు విషయాలను కూడా ప్రస్తావించాం. ఇవి పక్కన పెడితే. జనం నిజంగా సఫర్ అవుతున్నవి. ఇబ్బంది పడుతున్నవి చాలా ఉన్నాయి. ఈ ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు తాత్కాలికంగా తప్పించుకుంటున్నాయి తప్పితే, సమస్య పరిష్కారం చూపడం లేదు. 
దేశం అడుగుతోంది.. ఏబీబీ దేశం అడుగుతోంది.. క్లారిటీ ప్లీజ్..!