Mahindra BE 6 Price, Range And Features Telugu: మహీంద్రా, తన ప్రీమియం ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ BE 6కు కీలకమైన ఇంటీరియర్‌ అప్‌డేట్లను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆధునిక డిజైన్‌, ఎక్కువ రేంజ్‌ & అత్యాధునిక ఫీచర్లతో మార్కెట్‌లో మంచి ఆదరణ పొందుతున్న ఈ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీకి ఇప్పుడు మరింత ప్రీమియం అనుభూతిని అందించే మార్పులు రానున్నాయి. వీటిలో ముఖ్యంగా మూడు స్క్రీన్‌ల సెటప్‌, కొత్త డ్యాష్‌బోర్డ్‌ డిజైన్‌, కొత్త అప్‌హోల్స్టరీ కలర్‌ కాంబినేషన్‌ ఉన్నాయి. ఈ మార్పులు మిడ్‌-లైఫ్‌ ఫేస్‌లిఫ్ట్‌లో కాకుండా మోడల్‌ ఇయర్‌ అప్‌డేట్‌లో భాగంగా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Continues below advertisement

రాబోయే మార్పులు ఇవే!ప్రస్తుతం Mahindra XEV 9e & XEV 9S మోడళ్లలో మూడు స్క్రీన్‌ల సెటప్‌ను కంపెనీ అందిస్తోంది. ఇదే సెటప్‌ను త్వరలో BE 6లో కూడా అందించే అవకాశం ఉంది. అయితే ఇది అన్ని వేరియంట్లలో ఉంటుందా లేదా టాప్‌ స్పెక్‌ వేరియంట్లకే పరిమితం చేస్తారా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతం మూడు స్క్రీన్‌ల సెటప్‌ ప్రీమియం కార్లలో వేగంగా ప్రాచుర్యం పొందుతోంది. టాటా మోటార్స్‌ కూడా కొన్ని మోడళ్లలో ఈ ఫీచర్‌ను అందిస్తోంది. దీంతో ఈ ఫీచర్‌ చేరితే BE 6 పోటీ విభాగంలో మరింత బలంగా నిలిచే అవకాశం ఉంది.

ఇంటీరియర్‌లో మరో ముఖ్యమైన మార్పు డ్యాష్‌బోర్డ్‌ డిజైన్‌కు సంబంధించినది. ప్రస్తుతం ఉన్న BE 6లో డ్రైవర్‌ చుట్టూ హాలో ఆకారంలో ఉండే ప్రత్యేక లూప్‌ డిజైన్‌ను కంపెనీ ఉపయోగిస్తోంది. అయితే దీనివల్ల రెండో కప్‌ హోల్డర్‌కు సరిపడా స్థలం లేకపోవడం, వైర్‌లెస్‌ ఛార్జర్‌ & USB Type-C పోర్ట్‌లను ముందు ప్రయాణికుడు సులభంగా ఉపయోగించలేకపోవడం వంటి అంశాలు వినియోగదారుల దృష్టికి వచ్చాయి. ఈ కారణంగా ఇప్పుడు మరింత సంప్రదాయ శైలిలో ఉండే డ్యాష్‌బోర్డ్‌ను కంపెనీ సిద్ధం చేస్తోంది. ఇది పూర్తిగా కొత్త స్టాండర్డ్‌ డిజైన్‌గా వస్తుందా లేదా ప్రస్తుత డిజైన్‌తో పాటు మరో ఎంపికగా అందుబాటులో ఉంటుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Continues below advertisement

ఇది కూడా చదవండి: Mahindra Scorpio N ఫేస్‌లిఫ్ట్‌లో అదిరిపోయే అప్‌డేట్లు.. ఈ కొత్త ఫీచర్లు చూస్తే కొనాలనిపించాల్సిందే!

అప్‌హోల్స్టరీలో కూడా మార్పు చేయనుంది మహీంద్రా. ప్రస్తుతం ఉన్న బ్లాక్‌ & గ్రే కలర్‌ థీమ్‌కు బదులుగా కొత్త బ్లాక్‌ & టాన్‌ కలర్‌ కాంబినేషన్‌ను అందించనుంది. ఈ కొత్త రంగుల కలయిక క్యాబిన్‌కు మరింత ప్రీమియం లుక్‌ను తీసుకురానుంది.

ఇప్పటికే Mahindra BE 6లో పెద్ద టచ్‌స్క్రీన్‌, డిజిటల్‌ డ్రైవర్‌ డిస్‌ప్లే, కనెక్టెడ్‌ టెక్నాలజీ, ఆధునిక భద్రతా ఫీచర్లు వంటి విస్తృతమైన ఫీచర్ల జాబితా అందుబాటులో ఉంది. ఇప్పుడు రాబోయే ఈ అప్‌డేట్లతో ఈ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ మరింత ఆకర్షణీయంగా మారే అవకాశముంది. ముఖ్యంగా త్వరలో మార్కెట్‌లో పోటీని పెంచనున్న Tata Sierra EV & Hyundai Creta Electric వంటి ప్రత్యర్థి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వడంలో ఈ మార్పులు కీలక పాత్ర పోషించనున్నాయి.

ఇది కూడా చదవండి: కొత్త టయోటా హైలక్స్‌ వచ్చేసింది.. 360 డిగ్రీ కెమెరా, 204hp డీజిల్‌ ఇంజిన్‌తో అదిరిపోయే పికప్‌

ధరలుప్రస్తుతం Mahindra BE 6 ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.18.90 లక్షల నుంచి రూ.26.90 లక్షల వరకు ఉంది. కొత్త అప్‌డేట్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ధరలో స్వల్ప పెరుగుదల ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. పోల్చితే Tata Sierra EV ధరలు రూ.18.79 లక్షల నుంచి రూ.25.99 లక్షల వరకు ఉండగా, Hyundai Creta Electric ధరలు రూ.18.03 లక్షల నుంచి రూ.23.67 లక్షల వరకు ఉన్నాయి.

అయితే కొత్త అప్‌డేట్లతో కూడిన Mahindra BE 6 ఎప్పుడు మార్కెట్‌లోకి వస్తుందనే విషయంపై కంపెనీ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ ఈ కొత్త ఫీచర్లు చేరితే BE 6 ప్రీమియం ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ విభాగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.