FASTag Rules Change From August 1st: గురువారం (ఆగస్టు 1వ తేదీ) నుంచి ఫాస్ట్‌ట్యాగ్ నిబంధనల్లో మార్పులు రానున్నాయి. ఆగస్టు మొదటి తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీని కోసం ప్రజలు తమ ఫాస్టాగ్ ఖాతాలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. లేకపోతే వారికి టోల్ ప్లాజా వద్ద కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మీరు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే మీ ఫాస్టాగ్ బ్లాక్‌లిస్ట్ అవుతుంది. కాబట్టి ఈ విషయాల్లో మీరు కచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిందే.


కొత్త ఫాస్టాగ్ రూల్ ఏంటి?
ఫాస్టాగ్‌కి రూల్స్‌లో వచ్చిన అతిపెద్ద ఛేంజ్ ఏంటంటే మీరు కేవైసీ ప్రాసెస్‌ను అప్‌డేట్ చేయాలి. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కొత్త నిబంధన ప్రకారం ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం నుంచి వాడుతున్న ఫాస్టాగ్ ఖాతాలను మార్చాలి. దీని కోసం ఫాస్టాగ్ యూజర్లు తన ఖాతా ఇన్సూరెన్స్ తేదీని చెక్ చేయాలి. అవసరమైతే దాన్ని మార్చుకోవాలి.


Also Read: మహీంద్రా థార్ 5 డోర్స్‌ వెర్షన్‌ ROXXలో అదిరిపోయే ఫీచర్ - సేల్స్ దుమ్ములేపాలని టార్గెట్


అదే సమయంలో మూడు సంవత్సరాల వయస్సు ఉన్న ఫాస్టాగ్ ఖాతాలు వారి కేవైసీని మళ్లీ అప్‌డేట్ చేయాలి. ఫాస్టాగ్ సేవ కోసం కేవైసీ పూర్తి చేయడానికి గడువు అక్టోబర్ 31వ తేదీ వరకు ఉంది. యూజర్లు, కంపెనీలు తమ ఫాస్టాగ్ ఖాతా కేవైసీ అప్‌డేషన్ ప్రక్రియను అక్టోబర్ 31వ తేదీ నాటికి పూర్తి చేయవచ్చు. అయితే మీ ఫాస్టాగ్ ఖాతా కేవైసీ ప్రక్రియ ఆగస్టు 1వ తేదీ నాటికి ఒక్కసారి కూడా పూర్తి కాకపోతే అది వెంటనే బ్లాక్ లిస్ట్ అవుతుంది. 


మీ ఫోన్ నంబర్‌ని ఫాస్టాగ్‌కి లింక్ చేయండి
ఫాస్టాగ్ నిబంధనలలో మరో మార్పు ఏమిటంటే.... మీ ఫాస్టాగ్ ఖాతా మీ వాహనం, వాహన యజమాని ఫోన్ నంబర్‌కు లింక్ చేయాలి. ఏప్రిల్ నుంచి ఒక్క వాహనానికి మాత్రమే ఫాస్టాగ్ ఖాతాను వినియోగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీనితో పాటు వాహనం రిజిస్ట్రేషన్ నంబర్‌కు ఖాతాను లింక్ చేయడం కూడా అవసరం. ఇందుకోసం వాహనం ముందు, పక్క ఫొటోలను కూడా పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 1న లేదా ఆ తర్వాత కొత్త వాహనం కొనుగోలు చేసే వారు వాహనం కొనుగోలు చేసిన మూడు నెలల్లోగా తమ రిజిస్ట్రేషన్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవాలి.



Also Read: 4 లక్షల స్కూటర్లు వెనక్కి తీసుకుంటున్న సుజుకి- మీ దగ్గర ఉంటే వెంటనే షోరూమ్‌కి తీసుకెళ్లండి