జర్మన్‌కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ (Audi) నుంచి ఈ ఏడాది కనీసం మూడు కార్లు భారతదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఆడీ తన సరికొత్త కారు ఆర్ఎస్ 5 స్పోర్ట్‌ బ్యాక్‌ను ఇటీవల ఇండియాలో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏ4 ఫేస్‌లిఫ్ట్ తర్వాత ఐదో మోడల్‌గా ఇది ఎంట్రీ ఇచ్చింది. ఈ కారు లాంచ్ అనంతరం ఆడీ ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ మీడియా సంస్థలతో మాట్లాడుతూ.. 2021 చివరికల్లా మరో మూడు కార్లను విడుదల చేసే అవకాశం ఉందని చెప్పారు. 



ఆడీ నుంచి రాబోయే మరిన్ని ఉత్పత్తుల గురించి చెప్పమని మీడియా ప్రశ్నించగా.. 'గత నెలలో మూడు కార్లను విడుదల చేశాం. ఈ నెల ఆర్ఎస్ 5 స్టోర్ట్‌ బ్యాక్ కారును తీసుకొచ్చాం. అతి త్వరలోనే ఇంకో కారు లాంచ్ చేయబోతున్నాం. తర్వాత ఒకటి.. ఆపై మరొకటి.. ఇలా ఈ ఏడాది చివరికల్లా మొత్తం మూడు కార్లను తీసుకొచ్చే యోచనలో ఉన్నామని' తెలిపారు.  అయితే ఏ మోడల్స్ వస్తాయనే విషయాలను మాత్రం బల్బీర్ వెల్లడించలేదు. దీంతో ఆడీ నుంచి మూడు కార్ల వివరాలు, ఫీచర్లపై ఊహాగానాలు మొదలయ్యాయి. 



జూలైలో నెలలో ఆడీ ఈ-ట్రోన్ (e-tron) 50, ఈ-ట్రోన్ 55 అనే రెండు వేరియంట్‌లను విడుదల చేసింది. ఇక ఈ నెలలో ఆర్ఎస్ 5 స్పోర్ట్‌ బ్యాక్ కారును తీసుకొచ్చింది. జూలైలో ఈ-ట్రోన్ సిరీస్ లాంచ్ సమయంలో ఈ ఏడాది ఇండియాలో కనీసం ఒక ఎలక్ట్రిక్ కారును తీసుకొస్తామని బల్బీర్ చెప్పారు. దీంతో ఈసారి విడుదల కాబోయే మూడు కార్లలో కనీసం ఒక ఎలక్ట్రిక్ కారు ఉండే ఛాన్స్ ఉంది.  



ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడీ కార్లలో ఈ-ట్రోన్ జీటీ, ఆర్ఎస్ ఈ-ట్రోన్ జీటీ ఫోర్ డోర్ కోపే సెడాన్‌లు మాత్రమే ఎలక్ట్రిక్ వాహానాలుగా ఉన్నాయి. ఇవి కాకుండా ఈ-ట్రోన్ ఎస్‌యూవీలు ఉన్నాయి. కాబట్టి వీటిలో కనీసం ఒకటి లేదా రెండు భారతదేశంలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.  


ఇతర మోడల్స్ విషయానికి వస్తే.. న్యూ జెన్ ఆడీ క్యూ3 ఎస్‌యూవీ, క్యూ 5 ఫేస్‌లిఫ్ట్ ఉన్నాయి. వీటిని ఇండియాకు తీసుకొచ్చేందుకు సంస్థ కొంతకాలంగా ప్రయత్నిస్తోంది. అయితే కొవిడ్19 మహమ్మారి కారణంగా వీటి లాంచ్ వాయిదా పడుతూ వస్తోంది. ఈ రెండు మోడల్స్‌ను కూడా ఇండియాకు తీసుకొచ్చే అవకాశం ఉంది. 


Also Read: Tesla Cars : టెస్లాకు పన్నులు తగ్గించేది లేదన్న కేంద్రం..! ఒక్కో కారు ఎంత రేటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!