Tirupati Laddu Controversy : తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూల తయారీకి జంతువుల కొవ్వును వైసీపీ హయాంలో వాడారన్న చంద్రబాబు వ్యాఖ్యలపై టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ ఆఫీసులో పార్టీ అధినేత జగన్ తో వైవీ సుబ్బారెడ్డి సమావేశం అయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నీచమైన ఆరోపణలు చేశారని.. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. చంద్రబాబు తాను చేసిన ఆరోపణలకు సాక్ష్యాలు ఉంటే బ యట పెట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే..న్యాయపోరాటం చేస్తానని హెచ్చరించారు. 


వైసీపీ హయాంలో ఆలయ పవిత్రత పెంచామన్న సుబ్బారెడ్డి        


తిరుమలలో వైసీపీ హయాంలో తాము తిరుమల ఆలయ పవిత్రత  పెంచామన్నారు. తాము ఏ తప్పూ చేయలేదని శ్రీవారి పాదాల వద్ద కుటుంబంతో సహా ప్రమాణం చేస్తానని..చంద్రబాబు కూడా కుటుంబంతో కలిసి ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఆధారాలు బయట పెట్టకపోయినా.. ప్రమాణానికి రాకపోయినా  పరువు నష్టం కేసులు దాఖలు చేస్తామని హెచ్చరించారు. వైసీపీని బద్నాం చేయడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని .. కేంద్రంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలే ఉన్నాయి కాబట్టి ఎలాంటి విచారణ అయినా చేసుకోవచ్చని సవాల్ చేశారు.   


నెయ్యి కాంట్రాక్టర్‌ను మార్చడంతోనే అసలు సమస్య - తిరుపతి లడ్డూ ప్రసాదంలో అపచారం అక్కడే జరిగిందా ?


నైవేద్యం కోసం నెయ్యిని రాజస్థాన్ నుంచి తెప్పిస్తామన్న సుబ్బారెడ్డి       
 
స్వామివారి సమర్పించే నైవేద్యంలో ఆర్గానిక్‌ సామాగ్రి వాడామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.  స్వామివారి నైవేద్యంలో  స్వచ్ఛమైన నెయ్యిని వాడాం..2019 నుంచి 2024 వరకు మధ్య క్వాలిటీ చెక్‌ చేసి నాణ్యత లేదని పదిసార్లు నెయ్యి ట్యాంకర్లు వెనక్కి పంపించామని.. నాణ్యత విషయంలో రాజీ పడలేదని సుబ్బారెడ్డి చెప్పారు. బహిరంగ మార్కెట్లో కొనే వస్తువుల్లో రసాయనాలు ఉంటాయని వాటిని కొనుగోలు చేయలేదన్నారు.  స్వామి వారి నైవైద్యానికి అవసరమయ్యే నెయ్యిని రాజస్థాన్ నుండి తెప్పిస్తామని అందుకు అయ్యే రవాణా ఖర్చు రూ. లక్షను ఓ దాత భరిస్తారన్నారు. తిరుమలలోనే నెయ్యి నాణ్యతను పరిశీలించడానికి ల్యాబ్ ఉందన్నారు. 


జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు


చంద్రబాబు ఆధారాలు బయట పెట్టాలని డిమాండ్          


తాను టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు ల్యాబ్ ను  అత్యాధునికంగా మార్చామని .. పకడ్బందీగా నెయ్యిని ప్రొక్యూర్ మెంట్ చేసుకున్నా చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారన్నారు. మా హయంలో ప్రతి నిర్ణయం బోర్డులోనే చర్చించి నిర్ణయం తీసుకున్నామన్నారు. తిరుమల పవిత్రత విషయంలో ఎక్కడ తప్పు జరిగినా ఊరుకనేది లేదన్నారు. తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీకి జంతువుల కొవ్వు వాడారని చంద్రబాబు ఆరోపణలు సంచలనం సృష్టింటాయి. దీనిపైనే వైవీ సుబ్బారెడ్డి చాలెంజ్ చేశారు. మరో వైపు టీటీడీలో జరిగిన విజిలెన్స్ దర్యాప్తు సందర్భంగా తనకు వచ్చిన నోటీసుల్ని వైవీ సుబ్బారెడ్డి కోర్టులో చాలెంజ్ చేశారు.