Are Syamala Latest Statement: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తన ప్రాధాన్యత తగ్గిందని, తనను పార్టీకి దూరం పెడుతున్నారంటూ వస్తున్న వార్తలపై పార్టీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల అత్యంత ఘాటుగా స్పందించారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారానికి ముగింపు పలుకుతూ, తన సోషల్ మీడియాలో ఆమె వీడియో పోస్టు చేశారు. . వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ అధికార ప్రతినిధిగా గుర్తింపు పొందిన ఆరె శ్యామల తన రాజకీయ భవిష్యత్తుపై వస్తున్న పుకార్లపై ఘాటైన ప్రకటన చేశారు. గత కొన్ని రోజులుగా ఆమెను పార్టీ దూరం పెడుతోందని, పొమ్మనకుండా పొగ పెడుతున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఆమె స్వస్తి పలికారు. తన నిబద్ధతను శంకిస్తున్న వారికి, తనపై కుట్రలు చేస్తున్న వారికి ఆమె గట్టి సమాధానం ఇచ్చారు.
పదవుల కోసం రాలేదు.. ప్రేమ కోసం వచ్చాను!
తనకు కౌంట్డౌన్ మొదలైందంటూ చీకట్లో చప్పుడు చేసే వారికి ఒకటే సమాధానమని శ్యామల పేర్కొన్నారు. నేను పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదు. కేవలం జగనన్న ఆశీస్సులతో ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకోవడం కోసమే వచ్చాను. ఆ ప్రేమ ఉన్నంత వరకు నన్ను ఎవరూ ఆపలేరు అని ఆమె స్పష్టం చేశారు. తన రాజకీయ ప్రయాణం ఎవరి కరుణతోనో మొదలుకాలేదని, తన గొంతు, నిబద్ధత , జగన్ పై ఉన్న నమ్మకమే తన బలమని ఆమె చెప్పారు.
అది కడుపుమంటే!
తాడేపల్లిలో తనకు వ్యతిరేకంగా పరిస్థితులు మారుతున్నాయని, కొందరు తనను పార్టీకి దూరం చేసేందుకు పొగ పెడుతున్నారని వస్తున్న కథనాలపై శ్యామల వ్యంగ్యంగా స్పందించారు. పొగ ఎక్కువగా వస్తోందంటే.. కొందరిలో కడుపుమంట ఎక్కువగా ఉందన్న మాటే అని ఆమె ఎద్దేవా చేశారు. పుకార్లతోనో, కుట్రలతోనో తనను జగనన్నకు దూరం చేయడం ఎవరి వల్లా సాధ్యం కాదని ఆమె తేల్చి చెప్పారు.
నా స్వరానికి ఇది ఎండ్ కాదు.. స్టార్ట్!
తనను సైలెంట్ చేయాలని చూసే ప్రతి ప్రయత్నం తన గళాన్ని మరింత గట్టిగా మారుస్తుందని శ్యామల హెచ్చరించారు. ఇది తన కౌంట్డౌన్ కాదని, తన పోరాటానికి ఒక బలమైన ఆరంభం అని ఆమె పేర్కొన్నారు. ప్రతి రోజూ వైఎస్ జగన్ కలలు కన్న ఆంధ్రప్రదేశ్ దిశగా తాను అడుగులు వేస్తున్నానని, జగనన్న నమ్మకం తనను ఎల్లప్పుడూ నిలబెడుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
సినీ నటిగా, పాపులర్ యాంకర్గా రాణించిన శ్యామల.. గత ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీలో చేరి పార్టీ గొంతుకగా మారారు. అయితే, ఇటీవల పార్టీ కార్యక్రమాల్లో ఆమె పెద్దగా కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ కారణంగానే ఆమె చేసిన ఈ తాజా ప్రకటనతో ఆ పుకార్లన్నింటికీ చెక్ పడినట్లయింది.
