ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షం సహకరించకపోయినా పర్వాలేదు కానీ అడ్డుకోవద్దని వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. టీడీపీతో కలిసి రఘురామకృష్ణరాజు కేంద్ర ప్రభుత్వ శాఖల వద్ద అనేక ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపిచారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు ప్రతిపక్షం అన్ని పనులను అడ్డుకుంటోందని ఆరోపించారు. తమ మాటలను కేంద్రం ఆలకించడం లేదు కానీ ప్రతిపక్షం ఫిర్యాదు చేస్తే మాత్రం వెంటనే స్పందిస్తోందని ఎంపీలు ఆరోపించారు. 


ఫెడరల్ స్ఫూర్తికి కేంద్రం విఘాతం : పిల్లి సుభాష్ 


ప్రజాస్వామ్యంలో నిర్మాణాత్మక సూచనలు చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షానిదని.. కానీ ఏపీ  ప్రతిపక్షం అభివృద్ధికి అడ్డుపుల్ల వేయడమే పనిగా పెట్టుకుందని వైఎస్ఆర్‌సీపీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ ఆరోపించారు.  ఇందుకు పావుగా ఎంపీ రఘురామకృష్ణ రాజును ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు.  హడ్కో రుణాల మంజూరు నిలుపుదల చేయించాలంటూ ఒక పిటిషన్ పెట్టించారని..  గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను ఎలాగైనా ఆపించాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రాజీనామా చేస్తానని చెప్పి, పారిపోయారని మండిపడ్డారు.  తెలుగుదేశం పార్టీ నుంచి ప్రత్యక్ష సహాయం తీసుకుంటూ రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఎంతమందికి పని కల్పించామన్నదే ముఖ్యం తప్ప, ఎంత పని జరిగిందన్నది ముఖ్యం కాదని పిల్లి సుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యానించారు. పేదవాడి ఇంటిస్థలాన్ని చదును చేయడానికి ఈ పథకాన్ని ఒప్పుకోకపోవడం దురదృష్టకరమన్నారు. చంద్రబాబు నాయుడు, రఘురామకృష్ణ రాజు ఇద్దరూ కలిసి పిటిషన్లు పెట్టి స్టే తీసుకొచ్చారని విమర్శించారు. రూ. 55,580 కోట్లతో పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించాలని సీఎం జగన్, ప్రధానిని కలిసినప్పుడు పదే పదే కోరారని.. సెంట్రల్ వాటర్ కమిషన్ సహా పలు విభాగాలు ఆమోదించినా సరే, కేంద్రం ఆమోదించకపోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు.  ముఖ్యమంత్రి, ఎంపీలు ఎన్నిసార్లు అడగాలని అసహనం వ్యక్తం చేశారు. ఫెడరల్ స్ఫూర్తి అంటే ఇదేనా?అని పిల్లు సుభాష్ మండిపడ్డారు. 


అన్యాయం జరిగిందని మోడీ చెప్పారు .. న్యాయం చేయండి : వంగా గీత 


ఏపీ విభజన అశాస్త్రీయమని, కాంగ్రెస్ అన్యాయంగా విడదీసిందని ప్రధాని సభలో అన్నారని .. మరి న్యాయం చేయాలని మరో ఎంపీ వంగా గీత కోరారు.  పోలవరం ప్రాజెక్టు కేవలం ఏపీకి మాత్రమే ఉపయోగపడేది అనుకోవద్దని దేశం మొత్తానికి ఉపయోగపడుతుందన్నారు.  అక్కడ ఉత్పత్తయ్యే 970 మెగావాట్ల విద్యుత్తు అందరూ వాడుకోవచ్చని గుర్తు చేశారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ను ఎప్పుడైనా ప్రశంసించారా? కనీసం ప్రస్తావించారా? అని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో, ప్రతిపక్షానికి కూడా అంతే బాధ్యత ఉందని వంగా గీత స్పష్టం చేశారు. నిధులిచ్చే సంస్థలకు ప్రతిపక్షాలు లేఖలు రాస్తూ అడ్డుపడుతున్నారని ఆరోపించారు.  మాట్లాడితే అప్పులు, అప్పులు అంటున్నారు. గతంలో ఏ ప్రభుత్వమూ అప్పు చేయలేదా? అప్పు లేకుండా ఏ ప్రభుత్వమైనా ఉందా? అని ప్రశ్నించారు.  కేంద్రంలో ఏ శాఖ దగ్గరకు వెళ్లినా ప్రతిపక్షాలు ఇచ్చిన ఫిర్యాదులే కనిపిస్తున్నాయన్నారు.