రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, తన తండ్రి చంద్రబాబుకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ నారా లోకేశ్ ట్వీట్ చేయడంపై ఎంపీ నందిగామ్ సురేష్ కౌంటర్ ఇచ్చారు. దోమల ద్వారా చంద్రబాబుకు హాని చేసే ప్రయత్నం చేస్తున్నారని నారా లోకేశ్ ఆరోపిస్తున్నారని ఎంపీ ఎద్దేవా చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, ఎవరికీ భయపడని వ్యక్తి దోమలకు భయపడుతున్నారా? అని నందిగామ్ సురేష్ అన్నారు.


చంద్రబాబుకు హాని చేసే ఉద్దేశం, ఆలోచన, అవసరం మాకు ఎవరికీ లేదు. హాని చేసే ఉద్దేశం ఉంటే గింటే మీకే ఉండాలి. గతంలో చంద్రబాబు కూడా వెన్నుపోటుతో అధికారం చేజిక్కించుకున్నారు. ఇప్పుడు తండ్రి నుంచి అలాగే అధికారం లాక్కోవాలని లోకేశ్ అనుకుంటున్నారేమో. తండ్రి ఆలోచనలే కొడుక్కి వచ్చి ఉంటాయి కదా? జైల్లో ఉన్న బాబును అడ్డు తొలగించుకుని పార్టీని లాక్కుందాం అనుకుంటున్నారేమో. జైళ్ల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి. అసెంబ్లీలో బాలకృష్ణ హావభావాలు ఎంత నీచంగా, అసహ్యంగా ఉన్నాయో చూడండి. బూతుల హావభావాలు, వ్యాఖ్యలు చేస్తున్నారు. లోకేశ్ ఢిల్లీలో ఎందుకు దాక్కున్నారు? ఆంధ్రకు వెళ్తే అరెస్ట్ చేస్తారని భయపడుతున్నారు.


‘‘చంద్రబాబు హాని జరిగితే టీడీపీ వల్లనే తప్ప ఇంకెవరూ కారణం కారు. సూట్ కేసులు మోసిన అంశంలో లోకేశ్ కూడా ఉన్నారు. తప్పు చేశారు కాబట్టే భయపడుతున్నారు. రఘురామ కృష్ణంరాజు దగ్గర ఆశ్రయం పొందుతున్నారు. పార్లమెంట్ లోపల గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేసి, ఫోటోలు వచ్చాయి కదా ఇక చాలు అన్నారు. అంటే ఆయనకు ఫోటో కావాలి తప్ప తండ్రి మీద చిత్తశుద్ధి లేదు. మీ ముఖానికి ఢిల్లీలో సానుభూతి, మద్దతు దొరుకుతుందా? మెంటల్ సర్టిఫికేట్ ఉన్న వ్యక్తి బాలకృష్ణ ఎమ్మెల్యే పదవికి అనర్హుడు. మెంటల్ సర్టిఫికేట్ ఆధారంగా బాలకృష్ణను అనర్హుడిగా ప్రకటించాలి. బాబును చూస్తే వెన్నుపోటు వీరుడు అంటారు. ఎక్కడా గెలవకపోయినా తండ్రి సీఎం అయితే తాను మంత్రి అవ్వొచ్చు అని లోకేశ్ ను చూస్తే గుర్తొస్తుంది’’ అని నందిగామ్ సురేష్ ఎద్దేవా చేస్తూ మాట్లాడారు.


చంద్రబాబు భద్రతపై ఓ పోస్ట్ చేసిన నారా లోకేశ్


చంద్రబాబును అక్రమ అరెస్ట్ చేయించింది, జైలులోనే అంతం చేసేందుకే అనే అనుమానాలు బలపడుతున్నాయన్నారు నారా లోకేష్‌. ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి బెయిల్ రాకుండా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంపేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న ప్రతిపక్షనేతకి జైలులో హాని తలపెట్టేలా సర్కారు కుట్ర సాగుతోందని మండిపడ్డారు. ‌బాబుకు జైలులో భద్రత లేదని... విపరీతమైన దోమలు కుడుతున్నాయని చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరానికి చెందిన గంజేటి వీరవెంకట సత్యనారాయణ  డెంగీతో మరణించారని చెప్పారు లోకేష్. చంద్రబాబును కూడా  ఇలాగే చేయాలని కుతంత్రాలు అమలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకి ఏం జరిగినా జగన్ దే బాధ్యతని వార్నింగ్ ఇచ్చారు. 


చంద్రబాబు భద్రతపై మొదటి నుంచి టీడీపీ అనుమానం 


చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించినప్పటి నుంచి ఆయన భద్రతపై టీడీపీ లీడర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సెక్యూరిటీ రీజన్స్‌ ఒక కారణమైతే అక్కడి సౌకర్యాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ములాఖత్‌ తర్వాత మాట్లాడిన భువనేశ్వరికానీ, యనమల రామకృష్ణుడు కానీ ఈ దోమల విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. దోమలు విపరీతంగా ఉన్నాయన్నారు. వాటి నివారణకు చర్యలు తీసుకోడం లేదని ఆరోపించారు. నెట్‌ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని సౌకర్యాలు కల్పించడంలో శ్రద్ధ పెట్టలేదని విమర్శించారు.