YS Jagan Sensational Comments On TDP Reports: తాము చిన్నప్పటి నుంచీ చూస్తూనే ఉన్నామని.. తిరుపతి (Tirupati) లడ్డూలో ఉన్న రుచి వేరే ఏ లడ్డూలో ఉండదని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ (YS Jagan) అన్నారు. ప్రతి 6 నెలలకోసారి టెండర్లు పిలుస్తారని.. తక్కువకు ఎవరు కోట్ చేస్తే వాళ్లకు టెండర్ అప్రూవ్ చేస్తారని చెప్పారు. ఇది రొటీన్ ప్రక్రియ అని ఇందులో ప్రభుత్వానికి సంబంధం ఉండదని స్పష్టం చేశారు. 'ప్రసిద్ధి చెందిన టీటీడీ బోర్డులో కేంద్ర మంత్రులు, సీఎంలు కూడా విశిష్ట వ్యక్తులను రికమండ్ చేస్తారు. అలాంటి కూర్పుతో కూడిన బోర్డు టీటీడీ బోర్డు. అక్కడ ఉన్న వారు తప్పు చేయాలన్నా చేయలేని విధంగా వ్యవస్థ ఉంటుంది. పారదర్శకతతో దేవుడికి ఇంకా ఎలా మంచి చేయాలో అన్న ఆలోచనతో పని చేస్తుంటారు. ఇక్కడ టెండర్ల ప్రక్రియలో అదే జరిగింది. ఆ టెండర్లో వచ్చిన వారికి ఒకరికే ఇచ్చే పరిస్థితి లేదు. సప్లై చేసే వాళ్లు ల్యాబ్స్‌ నుంచి క్వాలిటీ చెక్ చేయించుకొని ట్యాంకర్లలో ఉన్న పదార్థాలు క్వాలిటీ నిర్దారిస్తూ సర్టిఫికెట్స్‌తో వస్తారు. తిరుమల వచ్చిన తర్వాత కూడా 3 టెస్టులు చేస్తారు. వాటిల్లో పాస్ అయితేనే ఏ వాహనం అయినా ముందుకు వెళ్తుంది. ఆ టెస్టుల్లో ఏ టెస్టు ఫెయిల్ అయినా వాహనాన్ని వెనక్కి పంపేస్తారు. చంద్రబాబు టైంలో 2014- 19 మధ్య 14 నుంచి  15 సార్లు ట్యాంకర్లను వెనక్కి పంపించారు. 2019-24 18సార్లు రిజెక్ట్ చేశాం.' అని జగన్ పేర్కొన్నారు.


ఇలా జరిగింది


బోర్డు అప్రూవ్‌ చేసిన కంపెనీ జూన్ 12 నుంచి సప్లై చేసిందని.. చంద్రబాబు సీఎం అయిన తర్వాత సప్లై మొదలైందని జగన్ అన్నారు. 'జూన్ 12, 21, 25, జులై 4న టెస్టుల్లో పాస్ అయ్యి ముందుకు కదిలాయి. జులై 6న రెండు జులై 12న మరో రెండు ట్యాంకర్లలో పదార్థాలు టెస్టులు ఫెయిల్ అయ్యాయి. ఈ టెస్టులు ఫెయిలైతే వెనక్కి పంపించేశారు. డౌట్ ఉంటే సీఎఫ్‌టీఆర్‌ఐకి కూడా పంపిస్తారు. ఇక్కడ మాత్రం గుజరాత్‌కు పంపించారు. తొలిసారిగా ఇది జరిగింది. గుజరాత్‌లోని ఎన్డీడీబీ పరీక్షించి రిపోర్టు ఇచ్చారు. ఇంతలోనే ఆ ట్యాంకర్లు వెనక్కి పంపేశారు. వాళ్లకు షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చారు. వాడని నెయ్యి అని క్లియర్‌గా తెలుస్తున్నా చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే ఆ నెయ్యి వాడారని రెండు నెలల తర్వాత సెప్టెంబర్‌ 18న ఎందుకు అన్నారు.' అని ఈవో మాట్లాడిన మాటలు ప్లే చేశారు.


'టీడీపీ ఆఫీస్‌లో రిపోర్ట్ రిలీజ్ చేశారు'


ఆ నెయ్యిని వాడకంలోకి తీసుకొని రావడం లేదని ఈవో క్లియర్‌గా చెప్పినా చంద్రబాబు సెప్టెంబర్‌ 18న ఎలా అబద్దాలు ఆడారని జగన్ ప్రశ్నించారు. జంతువు కొవ్వు లడ్డూల్లో కలిసిందని భక్తులు తిన్నారని దుష్ప్రచారం చేశారని.. సెప్టెంబర్‌ 19న గుజరాత్ నుంచి తెప్పించిన రిపోర్టును టీడీపీ ఆఫీస్‌లో రిలీజ్ చేశారని మండిపడ్డారు. 'ఆ రిపోర్టు బయటకు వచ్చిన తర్వాత కూడా టీటీడీ ఈవో ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. నెయ్యిని పక్కన పెట్టేసినట్టు చెప్పారు. తర్వాత సెప్టెంబర్ 22న ఈవో తాను సంతకం చేసి ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చారు. అనుమానం ఉన్న నెయ్యిని రహస్యంగా ఆ శాంపిల్స్‌ను పరీక్షించామన్నారు. ఎప్పుడైతే జంతువులకు సంబంధించిన కొవ్వు ఉందని గుర్తించామో వెనక్కి పంపేశామన్నారని చెప్పారు. అంత రహస్యమైన రిపోర్టు టీడీపీ ఆఫీస్‌ నుంచి ఎందుకు రిలీజ్ చేశారు.' అని జగన్ ప్రశ్నించారు. 


ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా సెప్టెంబర్ 22న ప్రెస్ మీట్ పెట్టిన చంద్రబాబు మళ్లీ జంతువు కొవ్వును వాడారని అబద్దాలు చెప్పారని జగన్ మండిపడ్డారు. ట్యాంకర్లు వచ్చేశాయి.. వాడేశారని దుష్ప్రచారం చేశారన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే తిరుమల ప్రసాదాన్ని వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'టీటీడీ ప్రతిష్టను వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి సంబంధించిన పేరు ప్రఖ్యాతలను ఇలా అబద్దాలతో తగ్గించడం కుట్రపూరితమే. ఇది అపవిత్ర కాదా అని అడుగుతున్నాను. ఎడీడీబీ రిపోర్టు చూస్తే అదీ కచ్చితమైన రిపోర్టు కాదు. వాళ్లే డిస్‌క్లైమర్ రాశారు.' అని జగన్ తెలిపారు.


Also Read: YS Jagan: 'రాష్ట్రంలో రాక్షస రాజ్యం' - తిరుమల లడ్డూ టాపిక్ డైవర్ట్ చేయడానికే డిక్లరేషన్ టాపిక్ తెచ్చారన్న జగన్, ప్రభుత్వ తీరుపై ఆగ్రహం