YS Sharmila writes letter To YS Jagan over property dispute | అమరావతి: గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఓ బిగ్ థింక్ రివీల్ చేస్తామని తెలుగుదేశం పార్టీ నేడు ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. దాని తరువాత వైసీపీ సైతం ట్రూత్ బాంబ్ పేల్చుతామంటూ ఘాటుగా స్పందించింది. దాంతో ఏపీలో రేపు రెండు పెద్ద బాంబులు పేలతాయంటూ అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ క్రమంలో టీడీపీ బుధవారం రాత్రి ఓ సంచలన విషయాన్ని బయటపెట్టింది. ప్రస్తుతం మాజీ సీఎం జగన్, ఆయన సోదరి వైఎస్ షర్మిల, విజయమ్మ మధ్య జరుగుతున్న వివాదానికి సంబంధించిన విషయాన్ని టీడీపీ వెల్లడించింది. 


వైసీపీ అధినేత జగన్ కు చెల్లి షర్మిల, తల్లి విజయమ్మ ఆవేదనతో లేఖ రాశారని టీడీపీ తెలిపింది. "మీరు ఇప్పుడు సొంత తల్లి మీద కూడా కేసులు పెట్టాలని నిర్ణయించుకున్నారు. MOU ప్రకారం మీ సొంత చెల్లి (YS Sharmila)కి చెందాల్సిన ఆస్తులు కూడా లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారు. మన తండ్రి YSR అడుగు జాడల్లో నడవాల్సిన మీరు ఇలా దారి తప్పడం నాకు ఆశ్చర్యం వేస్తోంది." అని వైఎస్ షర్మిల సోదరుడు జగన్ కు లేఖ రాశారు. సొంత తల్లి మీద కూడా కేసులు పెట్టాలని నిర్ణయించుకున్న నువ్వు, నీ సొంత చెల్లికి చెందాల్సిన ఆస్తులు లాక్కోవటానికి సిద్ధమయ్యావా జగన్ మోహన్ రెడ్డి? అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.


 






సోదరుడు జగన్ కు వైఎస్ షర్మిల రాసిన లేఖ అని టీడీపీ బహిర్గతం చేసిన వివరాలు


"మీరు ఇటీవల నాకు పంపిన లేఖపై నేను తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి  కుటుంబ వనరుల ద్వారా  సంపాదించిన ఆస్తులన్నింటినీ తన నలుగురు మనవళ్లకు సమానంగా పంచాలని నిర్ద్వంద్వంగా ఆదేశించిన విషయం నేను మీకు గుర్తు చేస్తున్నాను. మీరు ఆ షరతుకి అంగీకరిస్తున్నాని  ఆ సమయంలో మాకు హామీ కూడా ఇచ్చారు. కానీ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత మీరు ఆ షరతుకి నేను ఒప్పుకోను అంటూ నిరాకరించారు . భారతి సిమెంట్స్‌, సాక్షి  ఇలా తన జీవితకాలంలో రాజశేఖర్ రెడ్డి సంపాదించిన ఆస్తులన్నీ తన నలుగురు మనవళ్లు సమానంగా పంచుకోవాలని ఆనాడే నిర్ద్వంద్వంగా చెప్పారు. వీటన్నిటికీ మన అమ్మ సాక్షి మాత్రమే కాదు మన మధ్య జరిగిన పరస్పర ఒప్పందాలన్నీ గమనించింది కూడా."



"ప్రేమ, ఆప్యాయతలతో నాకు బదిలీ చేసినట్లు చేసుకున్న అవగాహన ఒప్పందం, (MOU)లో పేర్కొన్న ఆస్తులు, ఇవన్నీ మన తండ్రి  ఆదేశాలను  పాక్షికంగా నెరవేర్చడం కోసం మాత్రమే. నేను పాక్షికంగా అని చెప్పడానికి కారణం సాక్షి, భారతి సిమెంట్స్ లో మెజారిటీ వాటా నిలుపుకోవాలని  మీరు పట్టుబడుతున్నారు కాబట్టి. ఇప్పటికవరకు మీదే పై చేయి కాబట్టి నన్ను పూర్తిగా అణిచివేశారు. కాబట్టి MOUలో పేర్కొన్న విధంగా మేము ఒక పరిష్కారానికి అంగీకరించాము. మీరు నాకు అన్నయ్య కాబట్టి, కుటుంబ వివాదాలు పరిష్కరించుకోవాలనే  ఉద్దేశంతో  నా సమాన వాటాను వదులుకోవడానికి అంగీకరించాను. ఆ విధంగా, 31.08.2019న అమలు చేయబడిన ఎంఓయూ ప్రకారం, నాకు కొన్ని ఆస్తులు మాత్రమే కేటాయించబడ్డాయి."



"మీరు ఇప్పుడు సొంత తల్లి మీద కూడా కేసులు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఎమ్‌ఓయు ప్రకారం మీ సొంత చెల్లికి చెందాల్సిన ఆస్తులు కూడా లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారు. మన తండ్రి అడుగు జాడల్లో నడవాల్సిన మీరు ఈ విదంగా దారి తప్పడం నాకు ఆశ్చర్యం వేస్తోంది."






చట్టపరంగా మీ లేఖ ఎంఓయూకి విరుద్ధం
"ఇప్పుడు మీరు మన తండ్రి ఆదేశాలకు తూట్లు పొడుస్తూ ఏకపక్షంగా ఎంఓయూని రద్దు చేయాలని కోరుతున్నారు. చట్టపరంగా మీ లేఖ ఎంఓయూకి విరుద్ధం దానికి ఏమాత్రం పవిత్రత లేదు. కానీ మీ లేఖ వెనుక ఉన్న దురుద్దేశం నాకు చాలా బాధ కలిగించింది. ఇది మన తండ్రి మీద మీకున్న గౌరవాన్ని తగ్గించే విధంగా వుంది. ఆయన ఎన్నడూ కలలో కూడా ఊహించని పని చేసారు మీరు. చట్టబద్దంగా  మీ కుటుంబ సభ్యులకు  చెందాల్సిన ఆస్తులను లాక్కోవటానికి  సొంత తల్లి మీద, నా మీద కేసులు పెట్టారు."


"MOU ప్రకారం నా వాటాలో భాగంగా నాకు  ఇవ్వబడిన సరస్వతి పవర్‌పై, MOU ఒప్పందంపై సంతకం చేసిన వెంటనే దాని షేర్లన్నింటినీ నాకు బదిలీ చేస్తానని మీరు హామీ ఇచ్చారు. అయితే, మీరు చాలా సంవత్సరాలుగా  హామీ నెరవేర్చడంలో విఫలమయ్యారు. మన తల్లి భారతి సిమెంట్  మరియు సండూర్‌లకు చెందిన షేర్లను పొందిన తర్వాత, మిగిలిన షేర్లను మీరు బహుమతిగా ఇచ్చిన తర్వాత కూడా ఫిర్యాదు చేయడం సరి కాదు.  మీరు మన తల్లికి సరస్వతి పవర్ షేర్లపై పూర్తి హక్కులు ఇస్తూ గిఫ్ట్ డీడ్‌ల పై  సంతకాలు చేశారు. షేర్లతో విడిపోవడానికి అంగీకరించిన తర్వాత, మీరు ఇప్పుడు అనవసరమైన వివాదాలను లేవనెత్తడానికి మరియు కుటుంబాన్ని కోర్టుకు తీసుకెళ్లడానికి నిర్ణయించుకున్నారు. సరస్వతీ పవర్‌లో నాకు వాటాలు లేకుండా చేయాలనే  మీ ఉద్దేశ్యంతోనే ఇది జరిగింది. చట్టబద్దంగా దాని మీద నాకు పూర్తి అర్హత వుంది."


ప్రతీ దానికి నేను కట్టుబడి ఉన్నాను


"MOU చేసుకున్న దాని ప్రకారం కాకుండా, మీరు తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయం పూర్తిగా చట్ట విరుద్ధం. 20 ఎకరాల యలహంక ఇంటి ఆస్తితో సహా, MOUలో పేర్కొన్న అన్ని ఆస్తులకు సంబంధించి చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రతీ దానికి నేను కట్టుబడి వున్నాను." అని జగన్ కు షర్మిల ఈ లేఖ రాసినట్లు టీడీపీ చెబుతోంది.


"నా రాజకీయ జీవితం పూర్తిగా నాకు సంబంధించింది. నా వృత్తి పరమైన జీవితాన్ని నిర్దేశించడానికి నేను మిమ్మల్ని అనుమతించను. బహిరంగ వేదికలపై మీకు మరియు అవినాష్‌కు వ్యతిరేకంగా మాట్లాడకుండా నాతొ మీరు సంతకం చేయుంచుకున్నారన్నది అసంబద్ధం. సెటిల్‌మెంట్‌కు రావాలని నాకు షరతు విధించడం అనేది కూడా పూర్తిగా అసమంజసమైనది." మన తండ్రి అన్ని ఆస్తులలో తన మనవళ్లందరికీ మానవరాలకి సమాన వాటా ఉండాలని కోరుకున్నాడు. అంతే గాని దాని మీద రాజకీయమైన ప్రభావాలేవీ వుండకూడదు. నా రక్త సంబంధమైన అన్నగా మీరు ఇష్టపూర్వకంగా సంతకం చేసిన ఎంవోయూని అమలు చేయడం మీ బాధ్యత’.


"దివంగత నేత మన తండ్రి కోరికలను నెరవేర్చడానికి మరియు చేసుకున్న అవగాహన ఒప్పందానికి కట్టుబడి ఉండటంలో మీరు మీ నైతికతను కోల్పోయారు. మీరు దాని నుండి బయట పడతారాని ఆశిస్తున్నాను. మీరు అలా చేయకూడదని నిర్ణయించుకుంటే చట్ట పరంగా ముందుకు వెళ్ళడానికి నాకు పూర్తి హక్కులు వున్నాయి. ఇవన్నీ వాస్తవాలే అని నిర్ధారించడానికి మన తల్లి కూడా ఈ లేఖపై సంతకం చేసింది. " అని జగన్ కు షర్మిల ఈ లేఖ రాసినట్లు టీడీపీ చెబుతోంది.






ఇబ్బందులు పెడుతుంటే, నీకు ఆస్తులు ఎందుకు ఇవ్వాలి ?


"నన్ను రాజకీయంగా ఇబ్బందులు పెడుతుంటే, నీకు నేను ఆస్తులు ఎందుకు ఇవ్వాలి ? రాజకీయంగా నా పై విమర్శలు చేస్తున్న నీకు, నేను చిల్లి గవ్వ ఇవ్వను. సరస్వతి సిమెంట్స్ షేర్స్ తిరిగి ఇచ్చేయండి.. అమ్మ మీద, నీ మీద కేసు వేస్తున్నా." అని జగన్ చెప్పినట్లు టీడీపీ పోస్ట్ చేసింది.


Also Read: Jagan Files Petition Against Sharmila : షర్మిల, విజయమ్మపై జగన్ న్యాయపోరాటం- సరస్వతిలో వాటాలు ఇవ్వడం లేదని పిటిషన్