YS Sharmila responds on Hanuma Vihari Issue: ఏపీలో క్రికెటర్ హనుమ విహారి విషయంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. క్రికెటర్‌ హనుమ విహారి పట్ల ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) వ్యవహరించిన తీరు అవమానకరం అని అన్నారు. రాష్ట్రానికి ఇంతకంటే సిగ్గుచేటు విషయం మరొకటి ఉంటుందా అని మండిపడ్డారు. అన్ని అంశాల్లో నీచ రాజకీయాలు చేస్తున్న వైఎస్ఆర్ సీపీ నేతలు, ఇప్పుడు క్రీడలపైన కూడా దారుణాలకు ఒడిగడుతున్నారని ఆరోపించారు. కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర గౌరవాన్ని వైసీపీ నేతలు నాశనం చేశారని ఆరోపించారు. ఇంకా ఎంత దిగజారిపోతారో ఊహించలేమని షర్మిల అన్నారు.


‘‘ఇంతకంటే సిగ్గుచేటు విషయం ఇంకేమన్నా ఉంటుందా? అన్నింటిలో నీచ రాజకీయాలు ఆడుతున్న వైసీపీ వాళ్ళు, ఇప్పుడు క్రీడలపై కూడా వారి దౌర్భాగ్య రాజకీయాలను, అధికారమదాన్ని చూపుతున్నారు. రాష్ట్రప్రతిష్ఠను అన్నివిధాలుగా నాశనం చేసిన వీళ్ళు ఇంకా ఎంత లోతులకు దిగజార్చుతారో మనం ఊహించలేము. ఆడుదాం ఆంధ్ర అంటూ రెండు నెలలు సినిమా స్తంట్స్ చేయించిన వైసీపీ నేతలు, అసలు ఆడుతున్న ఆటలు ఇవేనా? ఆటగాళ్ల భవితను, ఆత్మవిశ్వాసాన్ని ఇలా నాశనం చేస్తారా? 


ఇది ఆంధ్ర క్రికెట్ అస్సోసియేషనా లేకా అధ్వానపు క్రికెట్ అస్సోసియేషనా? ఈ విషయంపై వెనువెంటనే నిస్పాక్షికమైన విచారణ జరగాలి అని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నది. క్రీడలపై వైసీపీ క్రీనీడలు తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంకెన్ని దిగజారుడు ఆటలు ఆడతారు వీళ్ళు?’’ అని షర్మిల సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు.


అసలేం జరిగిందంటే..
బెంగాల్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో హనుమ విహారి కెప్టెన్‌గా ఉన్నారు. ఆ మ్యాచ్‌లో ఆ ఆటలో 17వ ఆటగాడైన వ్యక్తిని మందలించారు. దీంతో అతను వైసీపీ నేత అయిన తన తండ్రికి ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత కొద్ది రోజులకి విహారిని తప్పించారు. తన తప్పేం లేకపోయినా.. తనకు జరిగిన అవమానంతో విహారి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కు ఆడబోనని సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన శరీరాన్ని పణంగా పెట్టి గతేడాది లెఫ్ట్ హ్యాండ్ కూడా విహారి ఆడారు. ఏడేళ్లలో ఐదు సార్లు జట్టును నాకౌట్ రౌండ్ కు తీసుకెళ్లారు. అలాగే భారత జట్టు తరఫున 16 టెస్టులు ఆడారు. అలాంటి తనను కాదని, ఆంధ్రా అసోసియేషన్ 17వ ఆటగాడికి ప్రాధాన్యం ఇవ్వడంతో దాన్ని విహారి అవమానంగా ఫీలయ్యారు.


సోషల్ మీడియా పోస్టులో హనుమ విహారి సదరు ప్లేయర్ పేరు ప్రస్తావించకపోయినా.. విహారి ఆరోపణలపై కేఎన్ పృథ్వీ రాజ్ అనే యువ ప్లేయర్ స్పందించాడు. విహారి సింపథి గేమ్స్ ఆడుతున్నాడని, జట్టులోని ప్రతి ఒక్కరికి ఆ రోజు ఏం జరిగిందో తెలుసని అసభ్య పదజాలంతో ఇన్‌ స్టాగ్రామ్ లో రాశాడు. దీంతో అతని తండ్రి ఎవరో అందరికి తెలిసిపోయింది. అధికార పార్టీకి చెందిన తిరుపతి కార్పొరేట్ అని, అతని కుమారుడే ఈ రచ్చ చేశాడని సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరుగుతోంది.