YS Sharmila: ముఖ్యమంత్రి జగన్ గత ఐదేళ్ల నుంచి పరిపాలన రాజధానిపై ఎందుకు ఫోకస్ చేయలేదని వైఎస్ షర్మిల విమర్శించారు. విశాఖ విజన్‌ పేరుతో సీఎం జగన్‌ చేసిన ప్రకటనపై షర్మిల స్పందించారు. పరిపాలనా రాజధానిలో ఇన్నాళ్లూ పాలన మొదలు పెట్టడానికి ఏం అడ్డొచ్చిందని ప్రశ్నించారు. ఎన్నికల ముందు పదేళ్ల వ్యూహాలు అంటూ వైఎస్ జగన్ కొత్త నాటకాలు ఆడుతున్నారని అన్నారు. ఈ మేరకు ఆమె ఎక్స్‌ వేదికగా ఓ పోస్ట్‌ చేశారు.       


పరిపాలన రాజధానిలో ఇన్నాళ్లు పాలన మొదలు పెట్టడానికి ఏం అడ్డొచ్చింది? పరిపాలన రాజధాని అని చెప్పి విశాఖ ప్రజలను మూడేళ్లుగా మోసం చేయడం మీ చేతకాని కమిట్మెంట్. ఐటీ హిల్స్ నుంచి దిగ్గజ కంపెనీలు వెళ్లిపోతున్నా చూస్తూ ఉండటం మీ రోడ్ మ్యాప్. ఆంధ్రుల తలమానికం వైజాగ్ స్టీల్ ను కేంద్రం అమ్మేస్తుంటే ప్రేక్షక పాత్ర వహించడం మీ విజన్. రైల్వే జోన్ పట్టాలు ఎక్కకపోయినా మౌనం వహించడం మీకు ప్రాక్టికల్. గుట్టల్ని కొట్టడం, పోర్టులను అమ్మడం, భూములను మింగడం ఇదే విశాఖపై వైసీపీ విజన్. ఇప్పుడు ఎన్నికల ముందు 10 ఏళ్ల వ్యూహాల పేరుతో కొత్త నాటకాలు కాదా?’’ అని విమర్శించారు.       






విశాఖ విజన్ గురించి జగన్ కామెంట్స్ ఇవీ


విజన్ విశాఖ సదస్సులో సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత వైజాగ్‌ నుంచే పాలన చేపడతామన్నారు. మళ్లీ గెచిన తర్వాత వైజాగ్‌లోనే ప్రమాణ స్వీకారం చేస్తానని అదే తన కమిట్‌మెంట్‌ అంటూ కామెంట్ చేశారు. విశాఖలో విజన్ విశాఖ సదస్సు ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఓప్రైవేటు హోటల్‌లో రెండు రోజుల పాటు కార్యక్రమం జరగనుంది. మొదటి రోజు సదస్సును ప్రారంభించిన సీఎం జగన్ వైజాగ్‌ వనరులను పారిశ్రామికవేత్తలకు వివరించారు. దేశంలోని మిగతా నగరాలతో పోల్చుకుంటే వైజాగ్‌ చాలా త్వరగా అభివృద్ధి చెందుతోందని జగన్ తెలిపారు.


స్థిరత్వమైన ప్రభుత్వం ఉందని అభివృద్ధితో కూడిన సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తున్నామని వివరించారు. అదే టైంలో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు వివరించారు. రాష్ట్రానికి విశాఖ చాలా ముఖ్యమైన బ్యాక్ బోన్‌గా ఉండబోతోందని అన్నారు. భవిష్యత్‌లో హైదరాబాద్‌ కంటే వైజాగ్ అభివడద్ధి చెందుతుందని జగన్ అభిప్రాయపడ్డారు. విభజనలో భాగంగా హైదరాబాద్ కోల్పోయామని దాని ప్రభావం నేటికీ ఉంటోందన్నారు. ఓవైపు అభివృద్ధిని కొనసాగిస్తూనే ముఖ్యమైన వ్యవసాయ రంగాన్ని కూడా ఉరకలు పెట్టిస్తున్నామన్నారు. ప్రస్తుతం వ్యవసాయం ఏపీలో 70 శాతం వృద్ధిని నమోదు చేసిందన్నారు.