YS Jagan Richest Chief Minister: దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల్లో బాగా రిచ్ సీఎం ఆంధ్రప్రదేశ్​ సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి కాగా, అత్యంత తక్కువ ఆస్తి ఉన్న సీఎం బెంగాల్ సీఎం మమతా బెనర్జీ! అసోసియేషన్​ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ విడుదల చేసిన నివేదిక ఇంకా ఆసక్తికర విశేషాలు ఇలా ఉన్నాయి.


భారతదేశంలో ప్రస్తుతం ఉన్న 30 మంది ముఖ్యమంత్రుల్లో 29 మంది కోటీశ్వరులేనని అసోసియేషన్​ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్, నేషనల్ ఎలక్షన్ వాచ్ అనే సంస్థలు సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలో తేలింది. వీరి లెక్క ప్రకారం AP సీఎం వైఎస్​​ జగన్​ మోహన్​ రెడ్డి అత్యంత సంపన్నుడు. ఆయన ఆస్తుల విలువ రూ.510 కోట్లని నివేదిక తెలిపింది. ఆ జాబితా ప్రకారం అందరికంటే జగనే సీఎంలు అందరిలో ధనవంతుడు. ఆస్తుల విషయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చిట్టచివరన ఉన్నారు. ఆమె పేరిట కేవలం 15 లక్షల రూపాయలు విలువైన ఆస్తులు ఉన్నాయి.


రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు.. ఎన్నికల సమయంలో ఇచ్చిన అఫిడవిట్లను విశ్లేషించి ఈ నివేదిక రూపొందించినట్లు అసోసియేషన్​ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్​- నేషనల్ ఎలక్షన్ వాచ్​ సంస్థలు తెలిపాయి. దేశంలోని 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల సీఎంల ఆస్తుల విశ్లేషణ. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్​కు ప్రస్తుతం ముఖ్యమంత్రి లేరు కాబట్టి ఆ వివరాలు వెల్లడించలేదు. 30 మంది ముఖ్యమంత్రుల్లో 97 శాతం అంటే 29 మంది కోటీశ్వరులు. ఒక్కో సీఎం సగటు ఆస్తి రూ.33.96కోట్లు.


అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్- నేషనల్ ఎలక్షన్ వాచ్ నివేదిక ప్రకారం:



  • ఆంధ్రప్రదేశ్​ సీఎం వైఎస్​ జగన్​ మోహన్​ రెడ్డి ఆస్తి రూ.510కోట్లు

  • అరుణాచల్ ప్రదేశ్​ ముఖ్యమంత్రి పెమా ఖండూ ఆస్తి రూ.163 కోట్లు

  • ఒడిశా సీఎం నవీన్​ పట్నాయక్ ఆస్తి రూ.63 కోట్లు

  • ఈ ముగ్గురు అత్యంత ఎక్కువ ఆస్తి కలిగిన ముఖ్యమంత్రులు

  • ఇక, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆస్తి రూ.15 లక్షలు

  • కేరళ సీఎం పినరయి విజయన్​ ఆస్తి రూ.కోటి పైన

  • హరియాణా సీఎం మనోహర్​ లాల్ ఖట్టర్‌ ఆస్తి రూ.కోటి పైన

  • వీళ్లు తక్కువ ఆస్తి కలిగిన ముగ్గురు ముఖ్యమంత్రులు


2018 శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆస్తి విలువ రూ. 23.55 కోట్లు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆస్తి ఒక్కొక్కరి పేరిట రూ.3 కోట్లకు పైగా ఉంది. 2018 శాసన సభ ఎన్నికల్లో ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం.. ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ ఆస్తి రూ.కోటికుపైగా ఉంది. తమిళనాడు సీఎం స్టాలిన్ , కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్​ బొమ్మై ఆస్తి ఒక్కొక్కరికి రూ.8 కోట్లకు పైగా ఉంది. ఈ 30 మంది ముఖ్యమంత్రుల్లో 43 శాతం.. అంటే 13 మందిపై తీవ్రమైన నేరాలు, హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, బెదిరింపులు లాంటి కేసులు ఉన్నాయని అఫిడవిట్లలో పేర్కొన్నారు. ఇవన్నీ బెయిల్​కు వీల్లేని ఐదేళ్లకన్నా ఎక్కువ శిక్ష పడే కేసులేనని నివేదిక తెలిపింది.